యడ్యూరప్ప కొత్త పార్టీ పనులు విజయదశమినుంచే ప్రారంభం

 

కొత్తపార్టీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బిజెపి గుడ్ బై కొట్టేశారు. తనకి బిజెపితో సంబంధాలు తెగిపోయాయని, కొత్త పార్టీకి ప్రజలు మద్దతివ్వాలని ఆయన కర్నాటక వాసులకు విజ్ఞప్తి చేశారు.  బిజెపికి ఇంకా రాజీనామా సమర్పించని యడ్యూరప్ప విజయదశమి సందర్భంగా తన కొత్త పార్టీ ఏర్పాట్లను లాంఛనంగా మొదలుపెట్టేశారు. డిసెంబర్ పదో తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి తన రాజీనామా లేఖని పంపుతానని యడ్యూరప్ప చెబుతున్నారు. తనకి పార్టీతో ఏమాత్రం పడడం లేదని, పడనప్పుడు వేరు కుంపటి పెట్టుకోవడంలో ఉన్న సంతోషం మరి దేంట్లోనూ ఉండదని యడ్డీ వ్యాఖ్యానించారు. స్కామ్ లో ఇరుక్కుని ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్న యడ్యూరప్ప ఆరు నెలలు తిరిగేలోగా మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటానని కలలుగన్నారు. కానీ.. పార్టీ అధిష్ఠానం ఆయనకు మొండిచేయి చూపించింది. అలిగి అటకెక్కిన యడ్డీ తనకికి మళ్లీ ఛాన్స్ దక్కే అవకాశం లేదని గ్రహించి, కొత్త కుంపటి పెట్టుకోవాలన్న బలమైన ఆలోచనని ముందుకు తీసుకొచ్చారు. యడ్యూరప్ప కర్నాటక బిజెపి అధికార పీఠాన్ని కోరుతున్నారు. దాన్ని యడ్డీకి ఇస్తే ప్రజల్లో చెడ్డపేరొస్తుందని పార్టీ భావిస్తోంది. రెండు పక్షాలకూ మధ్య లంగరు కుదరని పరిస్థితుల్లో యడ్యూరప్ప తనదారి తను చూసుకున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.