కెసిఆర్ పార్టీలో 'ఆత్మహత్యల' పరకాయప్రవేశం !!

 

 

మహాభారతం చదువుకున్నవాళ్ళకు "ముసలం'' అనే మాట తెలిసి ఉంటుంది. "యాదవకులంలో ముసలం'' అన్న పదం అదే! అలాగే, తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి, తద్వారా తన రాజకీయ నిరుద్యోగానికి ఒక పరిష్కారంగా తెలంగాణలో తిష్ఠవేసిన కోస్తాంధ్రుడు "బొబ్బిలిదొర''గా పలువురు చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖర రావు టి.ఆర్.ఎస్. అనే పార్టీనొకదాన్ని స్థాపించుకున్నది లగాయతూ తోటి తెలుగు వారందరినీ కలిపి "సీమాంధ్ర దోపిడీదారులు''గా ప్రకటించి విద్వేష ప్రచారం ప్రారంభించాడు. అది మొదలు, కొంతమంది యువకుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఫలితంగా "సీమాంధ్రులను తెలంగాణా ఆంధ్రుల మధ్యనుంచి వెళ్లగొట్టి, వారి భూముల్ని, వారి ఇళ్ళను, వారి సంస్థలను మనం స్వాధీనం చేసుకోవడంద్వారా ఉద్యోగాలన్నీ మనకే దక్కుతా''యన్న ప్రచారంద్వారా స్థానిక యువకుల్లో భ్రమలు, ఆశలు పురిగొల్పాడు. ఈ "పురి'' కొందరు తెలంగాణా యువకులపాటి టి.ఆర్.ఎస్. నాయకుడు కెసిఆర్ విధించిన 'ఉరి'గా మారి, రకరకాల పేరిట ఆత్మహత్యల్ని ప్రోత్సహించింది!


చివరికి ఈ "ప్రోత్సాహం'' కెసిఆర్ పార్టీ నిర్మాణ తీరుతెన్నుల పట్ల ఏ కరీంనగర్ జిల్లా తనదేనని కెసిఆర్ భ్రమిస్తున్నాడో సరిగ్గా ఆ జిల్లాలోనే అంతర్గత కుమ్ములాటల గురించి విన్నవించుకోదలచిన ప్రధాన కార్యదర్శి, జిల్లా యువజన విభాగం నాయకుడైన గుండా నాగరాజు ఆత్మహత్యకు దారితీసింది. తోటి తెలుగువారిపై కెసిఆర్ ప్రారంభించిన విద్వేష ప్రచారంలో మొదలైన ఆత్మహత్యలు కెసిఆర్ పార్టీలోకే ప్రవేశించక తప్పలేదు! నాగరాజు ఆత్మహత్య పార్టీలోని కుమ్ములాటల గురించిన తన విజ్ఞాపనను కెసిఆర్ పట్టించుకోనందుకే గాక, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన తనను "మంథని'' శిక్షణా తరగతుల సభావేదికపైకి సహితం కెసిఆర్ ఆహ్వానించక పోవడంతో తీవ్రంగా కలతచెందిన నాగరాజు సభావేదిక సమీపంలోనే పురుగుమందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లినా బతికించడం సాధ్యపడలేదు. ఇతర కార్యకర్తలయినా ఆస్పత్రికి వెళ్ళి నాగరాజు మృతికి కుటుంబాన్ని కలుసుకొని సంతాపం తెలియజేసివచ్చారు గాని, కెసిఆర్ ఆ ఛాయలకు కూడా వెళ్ళకుండా, సరాసరి హైదరాబాద్ కు ఉడాయించడం అందరినీ ఆశ్చర్యపరిచిందని కొన్ని పత్రికలు రాశాయి.



నాగరాజు మృతి వార్తను అన్ని పత్రికలూ ఒకలా రాయకుండా ప్రస్తుతపు "ఉద్రిక్త వాతావరణం''లో అగ్నికి ఆజ్యం పోయడం ఎందుకని భావించి, సెంటిమెంటు పేరిట నాగరాజు తెలంగాణా కోసం బెంగపడి ఆత్మహత్య చేసుకున్నట్టు కొన్ని పత్రికలు చిత్రించ జూచాయి. కాగా, తెలంగాణా వాదాన్ని బలపరచడం ద్వారా స్థానికంగా ఓ నాలుగు సీట్లయినా రాకపోతాయా అని భావించి అవకాశవాద రాజకీయాన్ని ఆశ్రయించి, అంతకుముందు తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరాయి పాలనల వల్ల చెల్లాచెదురై ఉన్న తెలుగువారందరినీ ఒక్క రాష్ట్రంగా (విశాలాంధ్ర) ఒక్క గొడుగుక్రింద సమీకరించిన కమ్యూనిస్టుపార్టీ దినపత్రిక "విశాలాంధ్ర'' నాగరాజు ఆత్మహత్య వార్తను యిలా అందించింది:



"టి.ఆర్.ఎస్.లో వర్గపోరుకు ఒకరు బలి : కె.సి.ఆర్. సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆత్మాహుతి'' : మంథనిలో జరిగిన శిక్షణా తరగతులకు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్రావు హాజరయ్యారు. అయితే, టి.ఆర్.ఎస్. జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నాగరాజును (29) వేదిక మీదకు ఆహ్వానించకపోవటంతో మనస్థాపం చెందాడు. క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దానిని గమనించిన నాయకులు నాగరాజును వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నాగరాజు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంధని సి.పీ.ఐ. నేత కొవ్వూరి రాజలింగం, పట్టాన కార్యదర్శి సత్యనారాయణ, టిడిపి మంథని మండల అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్య, పట్టాన అధ్యక్షులు లక్కాకుల వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ నాగరాజు కుటుంబానికి కెసిఆర్ తక్షణం రూ.10 లక్షణ ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగరాజు మృతికి కెసిఆర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గినా దృష్ట్యా నాగరాజు కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన కారణంగా మంథనిలో టి.ఆర్.ఎస్. ఫ్లెక్సీలు, తోరణాలను నాగరాజు సహచరులు తొలగించడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి''



కాగా, "సాక్షి'' పత్రిక కూడా నాగరాజు తెలంగాణా కోసం 12ఏళ్లుగా కష్టపడ్డాడని, కాని ఈరోజు స్టేజీమీదికి ఆయన్ని రానివ్వకపోవటంతో అవమానంతో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బావ ప్రభాకర్ ఆరోపించారు'' [07-06-20`13]
ఇక బొబ్బిలిదొర'' బందీగా ఉన్న 'టి'ఛానల్ ఒక్కటే నాగరాజు తెలంగాణా రాలేదనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడం ఆ ఛానల్ చూస్తున్న కొద్దిమందికి సహజంగానే ఆశ్చర్యం కల్గించలేదు!



కాగా గత కొంతకాలంగా జరుగుతున్న విచిత్ర పరిణామాల వెనక రహస్యం ఎవరికీ బోధ పడడంలేదు. ఎందుకంటే, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సజావుగానూ, సమర్థవంతంగానూ, ఆశాజనకంగానూ, పకడ్బందీగానూ, ఆత్మవిశ్వాసంతోనూ నిర్వహించడంలో ఆరితేరిన తెలంగాణా ప్రాంత ప్రజలు ఆత్మహత్యలకు పూర్తిగా వ్యతిరేకం. 1947-53 దాకా సాగిన నాటి సాయుధ పోరాటంలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదు. కాని ఇప్పుడా పరిస్థితి ఎందుకు, ఎవరివల్ల వచ్చింది? తెలంగాణా యువతలో కొందరిని ఎందుకీ బలహీనత ఆవరించింది? అంతేగాదు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల (తెలంగాణా, కోస్తాంధ్ర, రాయలసీమ)లో మిగతా రెండు ప్రాంతాలతో పోల్చితే, తెలంగాణలో ఎక్కువ ఆత్మహత్యలు జరగడానికి దారితీసిన పరిస్థితులేవి? ఈ ఆత్మహత్యలు యువతకే కట్టుబడకుండా తెలంగాణాలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, బడుగు, బలహీనవర్గాల కుటుంబాల వరకూ వ్యాపించిపోవటానికి కారణం తెలంగాణా వాదమా లేక రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలూ ప్రధాన కారణమా? ఈ ప్రశ్నకు సాధికారికంగా సమాధానం చెప్పుకోకుండా ప్రజాసమస్యలను విశ్లేషించుకోలెము.

 

"పుట్టినబిడ్డ బారెడ''ని ఓ సామెత! అలాగే తన స్వార్థరాజకీయం కోసం "తెలంగాణా రాష్ట్రం ఇదిగో నేడో, రేపో, ఎల్లుండో'' అంటూ తెలంగాణా ప్రజల్ని మోసపుచ్చుతూ ఇప్పటికి కనీసం ఎంతలేదన్న డజనుసార్లు "ఉద్యమాన్ని'' వాయిదా వేసుకున్నాడు కెసిఆర్. ఈసారి 'వాయిదా' సరాసరి నవంబర్ కు నెట్టి, 2014 ఎన్నికల లక్ష్యం - "ఓట్లు, సీట్లేగాని'', తెలంగాణా కాదంటున్నాడిప్పుడు! అయితే మరి రాష్ట్రాన్ని ఎలా సాధిస్తాడట? కాంగ్రెస్ లోని టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడంద్వారా, తాను ముఖ్యమంత్రి కావడం ద్వారానట! కాని ఈ మధ్యలో మరో 'చిట్కా' వదిలాడు. ఇది కూడా 'వాయిదాల'కు సంబంధించిందే! తెలంగాణా వస్తే గిస్తే 'దళితుడ్ని' ముఖ్యమంత్రిని చేస్తానని ఏడాదిన్నర నాడు ప్రకటించి, మళ్ళా ఇన్నాళ్ళూ ఆ వూసెత్తకుండా 2014 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరోసారి (02-0602013) ఈసారి "దళితుడే ముఖ్యమంత్రి'' అని నినదించాడు. కాని ఢిల్లీలో ఆంధ్ర భవన్ లోని దళిత అధికారిమీద 'దొర'తనం చేయిచేసుకుని గాయపరిచిన తరువాత 'నష్టపరిహారం'గా ఎన్నికలలో టి.ఆర్.ఎస్. కు ఓట్ల కోసం "దళితుడే ముఖ్యమంత్రి'' అన్న పొలికేకను వినిపించాడు! కానీ ఇతని రాజకీయ "చదరంగపు'' ఆటను, కుట్రను తెలంగాణలో దశాబ్దాల తరబడిగా 'దొర'ల, జాగిర్దార్ల,దేశ్ ముఖ్ ల దోపిడీ దౌర్జన్యాలను అనుభవించి కునారిల్లిపోయిన గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తరగతులు, తదితర బడుగువర్గాలన్నీ పసికట్టేశారు! ఎవరోకాదు, టి.ఆర్.ఎస్. ప్రధాన దళిత కార్యదర్శి ఎలా టి.ఆర్.ఎస్. నాయకత్వం బేరసారాల ద్వారా వందలకోట్లు వసూలు చేశారో బహిరంగంగా ఆరోపించి, ఆ నాయకత్వం ఎలా దళిత వ్యతిరేక నాయకత్వామో ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేశాడు.



తెలంగాణలో జరుగుతున్నా ఆత్మహత్యల స్వరూపస్వభావాల గురించి, ఆత్మహత్యలకు కారణమైన సశాస్త్రీయ కారణాల గురించీ సాయీమనీష్ (bold) అనే పరిశోధకుడు జరిపిన సర్వే ఫలితాలను, వాటి విశేషాలనూ ఇటీవల ఒక నివేదిక రూపొందించాడు. ఆ నివేదనను భారతదేశ మ్యాగజైన్ జర్నలిజంలో, ప్రత్యేక పరిశోధక నివేదికల రూపకల్పనలో, అవినీతిని, అక్రమాలను వెల్లడించడంలో సాధికారతను, విశ్వసనీయతను దేశంలోనేగాక, విదేశాలలోనూ పొందిన తేజ్ పాల "తెహల్కా'' (2013, మార్చి 9న) ప్రచురించింది. ఆ ప్రత్యేక పరిశోధనలో సాయీమనీష్ తెలంగాణలో ఆత్మహత్యలకు కారణాలను విపులంగా వివరించాడు : "స్వేచ్చా టిబెట్, (ఫ్రీ-టిబెట్) పేరిట టిబెటనలు ఆత్మాహుతి చేసుకుంటుంటారు. సరిగ్గా తెలంగాణాలో ఆత్మహత్యల దృశ్యం కూడా అలాంటిదే. కాని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఒక్కటే తెలంగాణాలో జరిగే ఆత్మహత్యలకు కారణం కాదు. అదే అసలు కథ కాదు'' అని చెబుతూ ప్రాంతంలో ఆత్మహత్యల పర్వం వెనక దాగిఉన్న అసలు కారణాల్ని మనీష్ నివేదిక యిలా వెల్లడిస్తోంది.


 
"2009 నవంబర్ కు 2012 జనవరి నెల మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల సంఖ్య 849. ఈ ఆత్మహత్యల్లో కొన్ని తెలంగాణా రాష్ట్రం సమస్యపై జరిగినవైతే, వాటిలో పెక్కు ఆత్మహత్యలు నానాటికీ తీసికట్టు అవుతున్న దారుణ సాంఘిక-ఆర్థిక పరిస్థితుల మూలంగా జరిగాయి. దుర్భరదారిద్ర్యం, రుణాలు చెల్లించలేని పరిస్థితులు, వ్యవసాయరంగ సంక్షోభం, ఉద్యోగావకాశాలు సన్నగిల్లిపోవటం, ప్రత్యేకరాష్ట్రం ఏర్పడకపోతే తెలంగాణా ప్రజలకు యిక భవిష్యత్తే లేదన్న నిరంతర రాజకీయ ప్రచార మత్తు ఫలితంగానూ - తెలంగాణాలో చేనేత పనివారు, రైతులు, విద్యార్థులు ఆత్మహత్యల వైపునకు నెట్టబడ్డారు. ఇలా ఒక వైపున అమూల్యమైన జీవితాలు కొడిగట్టి పోతూండగా మరొక వైపున ఆంధ్రప్రదేశ్ లో పరస్పరం దుమ్మెత్తిపోసుకునే రాజకీయ ప్రహసనం యదేచ్చగా సాగిపోతోంది. ఇక తెలంగాణా ఉద్యమంలో అట్టడుగు బలహీన వర్గాల ఆత్మహర్యాలు మానవుడి కనీసపు ఆత్మగౌరవానికి కూడా నోచుకోని పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా స్పష్టంగా, వాస్తవం చెప్పాలంటే తెలంగాణా పేరిట ఆత్మహత్యలు చేసుకున్నవారిలో దాదాపు అందరూ షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి.) షెడ్యూల్డ్ తరగతులకు (ఎస్.టి.) లేదా వెనుకబడిన తరగతులకు (బి.సి.లు)చెందినవారేగాని, తెలంగాణా రాష్ట్రసమితి నాయకుడు, వెలమ కులానికి చెందిన కె.సి.ఆర్. కులంనుంచి ఒక్కడంటే ఒక్కడూ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎక్కడా నమోదు కాలేదని ఈ సందర్భంగా గుర్తించాలి ... ఒక వైపున ఈ ఆత్మహత్యల్ని రాజకీయ సమస్యకు ఉద్రేకపూరిత స్పందనలుగా ప్రచారం చేస్తూండగా, రాష్ట్రంలోని రాజకీయవేత్తలు ఇంకొక వైపున నిరుద్యోగం, అనంతమైన రుణభారం లాంటి ప్రజాసమస్యలను బాపకిందకు తోసేసి, వ్యక్తుల దారుణ విషాద ఘటనలకు ప్రాధాన్యమిచ్చి ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు ....



అంతేగాదు, మనీష్ తన నివేదికలో యింకా యిలా తెలియజేశాడు : "1996 నుంచి 2007 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆత్మహత్యల్లో మూడింట రెండు వంతులు తెలంగాణాలోనే నమోదయ్యాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా తెలంగాణాలో దుర్భిక్ష పరిస్థితులవల్లం కొత్తరకం పత్తివిత్తనాలు విఫలమవటంవల్ల, 2004 మే నుంచి 2005 నవంబర్ మధ్యకాలంలో చేనేత పనివారు జీవనభృతికి దూరం కావడంవల్ల - మొత్తం రాష్ట్రంలో జరిగిన 1068 ఆత్మహత్యల్లో తెలంగాణాలో నమోదైనవి 663 ఆత్మహత్యలు. ఈ లెక్కన కూడా ప్రాంతాలలోనూ ఒక్కొక్క ప్రాంతంలో పరిస్థితిని విశ్లేషించగా [కోస్తాంధ్రనుంచి ప్రకాశంజిల్లా, తెలంగాణా నుంచి మెదక్ జిల్లా, రాయలసీమలో అనంతపురం జిల్లా], ఎక్కువ ఆత్మహత్యలు కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అగ్రకులాల్లో నమోదుకాగా, తెలంగాణాలో మాత్రం ఈ ఆత్మహత్యలు అగ్రకులాలు, షెడ్యూల్డ్ కులాలు, తదితర వనుకబడినవర్గాల మధ్య నమోదదయ్యాయి. తెలంగాణాలో దళితులు, వెనుకబడిన కులాలలో ఆత్మహత్యలు తరచుగా సర్వసాధారణమయ్యాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమంలో 2009-10 సంవత్సరాల మధ్యన, 2009 నవంబర్, 2010 ఫిబ్రవరి మధ్యకాలంలో 313 ఆత్మహత్యలు నమోదుకాగా, వాటిలో 218 ఆత్మహత్యలకు పాల్పడ్డవారు 18-50 సంవత్సరాల మధ్య వయస్సుగల వాళ్ళు.




"వీటిలో ఎక్కువ ఆత్మహత్యలు కెసిఆర్, అతని మేనల్లుడు హరీష్ రావు విద్యోశక తరహా అపహాస్యపు ప్రకటనలకు లోనవడం వల్ల జరిగాయి. ఆ ఏడాది నవంబర్ 29న హరీష్ రావు కిరోసిన్ మీద పోసుకున్నాడు కాని నిప్పంటించడానికి అగ్గిపెట్టె దొరక్కపోవటం ఒక అట్టహాసంకాగా, పగిలిన గాజుముక్కతో కోసుకుని చస్తానన్న కెసిఆర్ బెదిరింపు మరొక అపహాస్యపు ఘటన'' అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి చేప్పార''ని మనీష్ ఉదాహరించారు. అప్పటికే గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడ్డ యువకుల్లోనూ ఇతరుల మనస్సుల్లోకి కెసిఆర్, హరీష్ రావుల అపహాస్యపు పనులు ప్రమాదకరమైన సందేశం ఎక్కించినట్టయింది. ఈలాంటి సందేశం ద్వారా తమ బాధలన్నింటికీ పరిష్కారం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమేనన్న అభిప్రాయాన్ని ప్రజలకు పదే పదే గుర్తుచేస్తున్నట్టయింది. ఇలాంటి చర్యల ద్వారానే [ఆత్మహత్యలకు పాల్పడడం ద్వారానే] తమ జీవితాలు సార్థ్యక్యం పొందుతాయనీ, తాము తద్వారా 'హీరోలు'కావడానికి ఇది మంచి అవకాశమని పెక్కుమంది యువకులు భావించారన్న'' ప్రొఫెసర్ సింహాద్రి అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో ప్రతిధ్వనించడం గమనార్హం. ఇదంతా కెసిఆర్ వాచాలత్వం, ఉదార ఫలితమని రుజువైంది. కనుకనే ఈలాంటి విస్మయకర దృశ్యాన్ని మనస్తత్వ శాస్త్రజ్ఞులు "మారిలిన్ మన్రో సిండ్రోమ్'' (మానసికస్థితి) అని నామకరణం చేశారనీ తాము అనుకున్న లక్ష్యం నెరవేరక విఫలమైనప్పుడు ఆ బలహీనతతో కొందరు గుడ్డిగా ఆత్మహత్యలకు పాల్పడతారనీ మనీష్ నివేదిక తెలిపింది.


ఇందుకు ఉదాహరణగా మనీష్ హైదరాబాద్ లోని ఒక స్థానిక రెస్టారెంట్ లో తన విద్యా ఖర్చుల కోసమని పనిచేస్తున్న యాదయ్య అనే అనాథ యువకుడు ఉస్మానియా విద్యార్థీకాడు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడూ కాడు. కాని అతను ఆత్మహత్య చేసుకున్నది తెలంగాణా రాష్ట్రం కోసం కాదు, ఆర్థిక బాధలవల్ల ఆ పనిచేశాడు. కాని అతని ఆత్మహత్యను ఓ టి.వి.ఛానల్ 'లైవ్' చూపింది. అది చూసిన వెంటనే నానాబాపతు రాజకీయాలూ యాదయ్య ఆత్మహత్యను తెలంగాణా కోసం జరిగిన ఆత్మహత్యగా ముద్రవేయడానికి తొక్కిసలాడుకొన్నారు. అయితే యాదయ్య వద్ద ఉన్న అనేకమంది ఫోటో జర్నలిస్టులు చెప్పారు : "యాదయ్య చనిపోతూ రక్షించండి, రక్షించండి'' అంటూ కేకలు పెట్టాడనీ, టి.ఆర్.ఎస్. వర్గం చెప్పుకుంటున్నట్టు యాదయ్య నోట "జై! తెలంగాణా'' అన్న నినాదమే వినిపించలేదనీ చెప్పారు! టెలివిజన్ ప్రసారాలు చూసి ఎక్కువమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, రాజకీయవేత్తలు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల్ని పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా తెలంగాణాలోని విద్యార్థులలో ఆత్మహత్యా ధోరణులను పెంచుతున్నారని హైదరాబాద్ మనస్తత్వశాస్త్ర అధ్యయన సంస్థ శాస్త్రవేత్త డయానా మాంటిరొ ఆరోపించారు. అందుకే భూస్వామ్య వ్యవస్థ తాలూకు మనస్తత్వాలూ, నిరంతర సమస్యలూ చింత చచ్చినా పులుపు చావదన్నట్టు అంతతేలిగ్గా, త్వరగా పోవని మనీష్ వ్యాఖ్యానించాడు! అన్నివందలమంది ఆత్మహత్యలకు ప్రోత్సాహకుడు, కారకుడయిన సీమాంధ్ర "బొబ్బిలిదొర'' కెసిఆర్ దివంగతులయిన యువకుల కుటుంబాల ధర్మాగ్రహానికి అర్హుడు కాక తప్పదు!

త‌మిళ‌నాట కార్తీక దీపం చిచ్చు! పవన్ ఏమన్నారంటే?

తమిళనాట కొత్త చిచ్చు రేగింది. ఇది మత విశ్వాసాలకు సంబంధించినది కావడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు సైతం తలెత్తాయి. ఇంతకీ విషయమేంటంటే.. మ‌ధురైకి ద‌గ్గ‌ర్లో ఉన్న తిరుపుర‌కుండ్రం అనే కుమార స్వామి క్షేత్రంలో కార్తీక దిపానికి సంబంధించినది. త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా  భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ  కార్తీక దీపం  పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం. అయితే ఇక్క‌డి ద‌ర్గాకు కుమార‌క్షేత్రానికి చారిత్ర‌క సంబంధాలుండ‌టంతో వివాదం  చెల‌రేగింది. ఈ స్తంభంపై కార్తీక దీపం పెట్ట‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో  విషయం కాస్తా  కాస్తా కోర్టు మెట్లు ఎక్కింది.  ఈ విష‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు, మ‌ధురై బెంచ్ న్యాయ‌మూర్తి స్వామినాథన్ ఈ దీపం ఇక్క‌డ వెలిగించ‌డానికి అధికారులు త‌గిన‌ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ  చేశారు. ఈ ఆదేశాల ప్ర‌కారం..  , ఇక్క‌డ కార్తీక దీపం వెలిగించుకోవ‌చ్చు. అయితే ఇలా చేస్తే  మ‌త ఘ‌ర్ష‌ణకు దారి తీసే ప్రమాదం ఉందన్న ఆందోళనతో తమిళనాడు ప్రభుత్వం  దీపం పెట్ట‌నివ్వ‌కుండా,   హైకోర్టును ఆశ్ర‌యించింది. హైకోర్టు  కూడా మ‌ధురై బెంచ్ ఇచ్చిన తీర్పునే స‌మ‌ర్ధించింది. దీంతో దీపం  వ్య‌వ‌హారంలో తిరుపుర‌కుండ్రంలో తీవ్ర ఉద్రిక్త‌త చెల‌రేగింది. ఒక వ‌ర్గం వారు ఇక్క‌డ దీపం  వెలిగించాలంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మక రూపం దాల్చి  పోలీసులు సైతం గాయ‌ప‌డ్డారు.   లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. కార్తీక దీపం వెలిగించాలంటూ   తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథ‌న్ పై అభిశంస‌న తీర్మాన‌రం పెట్టాల‌ని నిర్ణ‌యించారు ఇండి  కూట‌మి ఎంపీలు. వీరంతా  క‌ల‌సి ఈ దిశ‌గా ఒక మెమ‌రాండం సైతం స‌మ‌ర్పించారు.  దీనిపై స్పందించిన   ఏపీ డిప్యూటీ  సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో సుప్రీం  కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి హిందూ దేవ‌త‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే ఏ పార్టీ ఆయ‌నపై అభిశంస‌న  పెట్ట‌డానికి ముందుకు రాకపోగా  ఆయ‌న్నే వెన‌కేసుకొచ్చార‌న్న పవన్ స్వామినాథ‌న్ ఏం చేశార‌ని  అభిశంస‌న పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారో అర్ధం కావ‌డం లేదన్నారు. ఇటువంటి వివాదాలు తలెత్తకుండా స‌నాత‌న బోర్డు ఒక‌టి అత్య‌వ‌స‌రం అంటూ  ట్వీట్   చేశారు.

పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

పంచాయతీ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో  కలవరం మొదలైంది. ప్రచారానికి  వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం (డిసెంబర్ 9)  సాయంత్రంతో ముగియనుంది.  అదలా ఉండగా.. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన  ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయ్యింది. దీనికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

పుత్రిక రాజ‌కీయ అరంగేట‌గ్రం.. గ్రౌండ్ ప్రిపరేషన్ లో బొత్స!

బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నాత‌నదైన రాజ‌కీయం చేయ‌డంలో ఆరితేరిన వార‌న్న పేరుంది ఆయనకు.  విజయనగరం రాజ‌కీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి  సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.   ఈ క్రమంలోనే  తాను పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు.  తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్‌ వర్క్ పెద్ద ఎత్తున‌ జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష  చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స  అనూష‌ ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే అతి త్వ‌ర‌లోనే  ఆమె రాజ‌కీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది.  చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్‌ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్‌ మీటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక‌ నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వెళ్లి త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నార‌ట‌. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.  తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల‌ స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్‌ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి మ‌రో రాజకీయ వారసత్వం  ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.

గుంతకల్లులో కీలక నేతల వారసత్వ రాజకీయం

  ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీ లు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు.ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు.  ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారట. 2024లో టీడీపీ నుంచి గెలిచినా గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు.  అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో  ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత  బలం చేకూర్చింది.  అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడంతో  అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి  ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం కర్నూల్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు  టీడీపీ లో గుమ్మనూరు జయరాం ఇమడకపోవడం, అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ అతనికి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు.  అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీట్‌పై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, ఆయనకు అది సొంత నియోజకవర్గం కూడా కావడంతో గుమ్మనూరు ఈశ్వర్‌కు కొద్దిపాటి ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.

డల్లాస్ లో కొడాలి నాని గురించి లోకేష్ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.   ఆరు రోజుల అమెరికా పర్యటనలో  లోకేష్ లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణే. అందులో భాగంగానే ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ ఆర్ఐలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచారో వివరించారు. రాష్ట్రం నంబర్ వన్ గా ఎదగడంలో ఎన్ఆర్ఐల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక ఎన్ఆర్ఐ కొడాలి నాని గురించి అడిగారు. అధికారం అండ చూసుకుని అరాచకత్వంతో రెచ్చిపోయిన కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.   అంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా నిలబెట్టేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలి, అందరూ దానిపైనే దృష్టి పెట్టాలి అని చెప్పిన ఆయన అనవసర విషయాల ప్రస్తావన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.  

విజయసాయి కాషాయ మంత్రం..జగన్ కు కషాయం!

రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు.  ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి  అవేశంతో కంటే ఎంతో  ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.  ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు.  ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు. అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ  జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.   ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా  జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.   వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్  ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు.  తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ

కారు పార్టీ పోయి...హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్‌ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలో కారు పార్టీ పోయి హస్తం పార్టీ దోపిడీ మాత్రం ఆగలేదని ఆయన అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయలంటే భూములు అమ్మవలసి వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేలు ఏవి? రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎంత కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు  గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హాయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణం : సీపీఐ

బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్

  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.  ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.

వింటర్ లో హాట్ హాట్ గా మద్యం సేల్స్! నాలుగు రోజుల్లో రూ.600 కోట్లు!

తెలంగాణలో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో మందుబాబులు గజగజలాడించే చలి నుంచి రక్షణ కోసం చలిమంటలు, దుప్పట్లు, రగ్గులను కాకుండా మద్యాన్ని ఆశ్రయించారని భావించాల్సి వస్తోంది. ఎందుకంటేచలి పెరగడంతో గత నాలుగు రోజులలో  రాష్ట్రంలో  ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ అమ్మకాలు 5 కోట్ల 86 లక్షలుగా ఉన్నాయి.  వెచ్చటి మద్యం గొంతులో పోసుకుని చలిలో  తెలంగాణ మందుబాబులు ఖుషీ చేస్తున్నారని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పొలిస్తే  మద్యం విక్రయాలు ఈ ఏడు ఏకంగా 107 శాతం పెరిగాయి.  రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ నెల మొదటి తారీకు నుంచి నాలుగో తేదీ వరకూ అంటే డిసెంబర్ 1 నుంచి 4 వరకూ కేవలం నాలుగు రోజుల్లో 600 కోట్లు ఉండటానికి  గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం విధానం కూడా కారణమని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.  నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో  5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వడమే ఇందుకు నిదర్శనం. అదే గత ఏడాది ఇదే కాలంలో  బీర్ల అమ్మకాలు 4.26 లక్షల కేసులు మాత్రమే.