మీరు మోయించే వేణువును నేను. ఆ మురళీ రవాన్నీ నేనే!
మీలో ఛాయారూపంగా మిగిలిపోగలిగితే, మీ హృదయంలో రేఖారూపంగా ఉండగలిగితే నేను ధన్యురాల్ని.
కన్న కలలు కల్లలు కాగా, ఆశలు అడియాసలు కాగా, వర్తమానం గతం కాగా మిగిలినవి నీడలు మాత్రమే.
నిజాన్ని కలగా మార్చుకోండి. కలల్లోనే జీవించండి.
మిమ్మల్ని నేను పోగొట్టుకోలేదు. బాహ్యంగా దూరమైనా అంతరంగంలో కలిసే ఉన్నాము.
రాధలో సునీతను చూసుకోండి.
నేను రాధలో జీవిస్తాను.
మీలో 'నీతా' అన్న పిలుపు పిలుపుగానే మిగిలింది! నాలోనూ అంతే!
మీరు ఉన్నారు. నేను లేను!
నేనెక్కడో దూరతీరాలకు వెళుతున్నాను. మీరు ఆవలిగట్టునే ఉన్నారు.
నా ప్రభువులు మీరు. మీ చరణదాసిని నేను.
సజీవమూర్తినైన నాలో జీవచైతన్యమంతా మీరే! నా ప్రతి వాక్కు మీ ప్రేరణ ఫలితం. నాలో ప్రత్యణువూ మీ రూపభరితం.
నా ప్రాణం, నా జీవం, నా ఆత్మ-అన్నీ మీరే!
నాలో ఉజ్జ్వలంగా ప్రజ్వలించే ప్రేమజ్యోతులు మీరు. మీలో జ్వలించి, ఆరిపోయిన కొవ్వొత్తిని నేను. కేవలం ఒక స్మృతిగా, మధుర జ్ఞాపకంగా మిగిలిపోయాను కదూ?
చరణదాసి
-నీతా."
వేణు నిల్చున్నాడు. పిచ్చిగా ఉత్తరం జేబులో కుక్కుకున్నాడు. ముఖం జేవురించింది.
"ఎక్కడికి, వేణూ?" ఆర్తి అడుగుతూంది.
"నా నీతా వెళ్ళిపోతున్నది. నా నీతా ..... నా రాణి..."
క్షణంలో వేణు కారుతో సహా రోడ్డు మీద ఉన్నాడు. ఆర్తికూడా వెంటనే బయటికి వచ్చి కారులో కూర్చుంది. సారథి కూడా వచ్చాడు. గోవిందరావు పిలుస్తూ ఉండగానే కారు గేటు దాటుతున్నది.
పదింటికి ట్రెయిను వెళ్ళిందో, లేదో మరి? వేణు కారుకు ఉన్న స్పీడు అంతా ఉపయోగిస్తున్నాడు. ఆక్సిలరేటర్ పూర్తిగా లోపలికి ఒత్తబడింది. స్పీడా మీటర్ లో ముల్లు రెడ్ పాయింట్ దాటుతూంది. అదేమీ వేణు గమనించలేదు. ముందు కనిపించేది రోడ్డు. మనస్సులో సునీత. పది కావటంవల్ల ట్రాఫిక్ అంతగా లేదు. అప్పుడొక కారు, ఇప్పుడొక కారు పక్కనుంచి వెళుతున్నాయి. ముందున్న వాహనాలను వెనకపడేస్తూ బాణంలా రివ్వున దూసుకుపోతున్నది కారు.
విశ్వం రిక్షా మధ్యలో తగిలింది. "వేణూ!" అని విశ్వం కేకవేశాడు. ఆ కేక కారువేగంలో కలిసిపోయింది. వెనకనే ఆర్తి, సారథి ఉన్న కారు వచ్చి హఠాత్తుగా ఆగింది. జేబులోనుంచి తీసి రిక్షావాలా మీదికి ఒక రూపాయి నోటు విసిరివేసి, ఫుట్ బోర్డ్ మీద కాలు పెడుతూండగానే కారు స్టార్టయింది. ఆర్తి చేతిలో స్టీరింగ్ వీల్ ఉన్నది.
స్పీడులో చివరి అంకెల దగ్గిరికి వచ్చింది స్పీడా మీటర్ లో ముళ్ళు. ఆర్తి కారుకూ, వేణుకారుకూ మధ్యదూరం తగ్గటం లేదు ఎక్కటం లేదు. అవి రెండు సమాంతరరేఖల్లా స్టేషనువైపు పరుగులు తీస్తున్నాయి.
మలుపులు తిరగటంలో రెండుసార్లు చక్రాలు ఫుట్ పాత్ కు రాసుకున్నా వేణు లెక్కచెయ్యలేదు. వేగం తగ్గించలేదు. చెమటలు ధారగా స్రవిస్తున్నాయి. చేతులు చక్రం తిప్పుతున్నాయి. కాళ్ళు ఆక్సిలేటర్ ను నొక్కి పట్టాయి. బ్రేకులు, గేర్లు ఏవీ ఉన్నట్లే లేదు,
స్టేషన్ దగ్గిర పడుతూంది. ఎంతోదూరం లేదు.
ట్రెయిను కాబోలు వేసిన కేక నిశ్శబ్ధాన్ని భేదిస్తున్నట్లున్నది.
మిగిలింది ఒక్కటే.....ఒకే ఒక మలుపు. ఆ మలుపు దాటితే స్టేషను. ఒక నిమిషంలో అక్కడికి చేరగలిగితే సునీతను ఆపవచ్చు.
వేణు వాచీ చూసుకున్నాడు. పదీ ఏడు నిమిషాలు.
మలుపు గ్రహించిన చెయ్యి చక్రం తిప్పింది. టైమ్ కోసం చెయ్యిమీద చూసుకోవటంలో చక్రం తిరగవలసిన దానికన్నా ఎక్కువే తిరిగింది.
దేనికో డాష్ ఇచ్చినట్లు ధ్వని.
రోడ్డు పక్కన పేవ్ మెంట్ మీద అడ్వర్ టైజ్ మెంట్ కోసం కట్టబడిన పెద్ద బోర్డు ఒకటి ఫెళ ఫెళ విరిగి పడింది. అక్కడున్న వాళ్ళ హాహాకారాల మధ్య, "నీతా" అన్న కేక గాలిలో వ్యాపించింది.
వెనకనే వస్తున్న కారు తటాలున ఆగింది.
"విశ్వం, స్టేషనుకు పరుగెత్తు. బండి ఇంకా కదలనట్లుంది. విశ్వం, త్వరగా...." ఆర్తి విశ్వాన్ని తరిమింది. విశ్వం అటువైపుగా ఉరికాడు.
ట్రెయిను అక్కడినుండే బయలుదేరుతుంది. ముందే అందరు దిగి వెళతారు. అప్పటికే స్టేషను చేరుకున్న ప్రయాణికులు ఎక్కేస్తారు.
అందుకే లోపలినించి వచ్చేవాళ్ళెవరూ లేరు. టికెట్ కలెక్టరు షోకుగా నిలుచుని కదలబోతున్న బండిని చూస్తున్నాడు. స్టేషనుకు పది గజాల దూరంలో విశ్వం ఉండగానే ట్రెయిను కదిలింది. ఒకరిద్దరిని ఢీకొట్టి ఫ్లాట్ ఫారమ్ మీదికి వచ్చాడతను. అప్పుడే చివరిపెట్టే అతని ముందునించి వెళ్ళింది. అందుకుందామన్న ఆవేశంతో పరుగు. అదీ అందలేదు.
"సునీతా!" విశ్వం కేక స్టేషనులో అంతటా మార్మోగింది.
అందరూ అతన్ని చిత్రంగా చూశారు.
వ్యథితులను, నిర్విచారులను, ధనికులను, పేదలను-కుల మత జాతి విచక్షణ, స్త్రీ పురుష విభేదములేక-ఆబాలగోపాలన్ని చేరవెయ్యటమే తన పనిగా పెట్టుకున్న రైలు ఆ కేక వినలేదు. విన్నా ఆగలేదు. పైగా ఇది మామూలే అన్నట్లు వేగం పుంజుకున్నది.
స్టేషను దాటి రైలు మొదటి మలుపు తిరగబోతున్నది.
ఆఖరి కంపార్ట్ మెంట్ లోనుండి ఒక స్త్రీ తల బయటికి పెట్టింది. ఆమె మెరుస్తున్న కళ్ళలోనుండి బాష్పధారలు అవిరామంగా జారుతున్నాయి. ఆమె అంతిమ నమస్కారం చేస్తున్నట్లు చేతులు జోడించటం నీటిపొరలు కళ్ళకు కమ్మిన విశ్వానికి కనబడుతూనే ఉంది.
ఆమె సునీత.
వెలుగు ముగిసింది. స్టేషన్ లైట్ల కాంతినుండి నీడలోకి తప్పుకున్న రైలు సునీతను అదృశ్యం చేసింది. విశ్వం జుట్టు పీక్కున్నాడు. కాళ్ళకు వెయ్యి టన్నుల బరువు.
"ఉఫ్! ముగిసింది .... అంతా ముగిసిపోయింది. భగవాన్! చేసిన త్యాగాలకుం ఫలించని అనురాగాలకు ఫలితం ఇదేనా? ఇదేనా? సునీతా, జరగవలసిందేదో జరిగింది. ఎంతమంది ఉన్నా నీ మహాభినిష్క్రమణాన్ని ఆపలేకపోయాం."
నిరాశా, నిస్పృహలతో తిరిగివచ్చిన విశ్వాన్ని చూసి సారథి "సికిందరాబాదుకు వెళ్ళావా, విశ్వం?" అన్నాడు.
"లేదు."
సారథి వాయువేగాన కారులో కూర్చున్నాడు. అది సికిందరాబాదువేపుగా దూసుకువెళుతూంది.
ట్రెయిను అక్కడే ఉంది ఇంకా. సారథి ట్రెయినంతా వెతికాడు. సునీతకాని, యాదగిరికాని కనిపించ లేదు. ఏడెనిమిదిసార్లు ప్రతి పెట్టె గాలించాడు. అదీ లాభంలేకపోయింది. ఇద్దరు స్నేహితులు కలిస్తే పోలికలు, గుర్తులు చెప్పి అడిగాడు. ఎవరూ తమకు ఎరుకలేదన్నారు.
అతను చూస్తుండగయే ట్రెయిను కదిలింది.
'విశ్వేశ్వరా, ఏమిటీ అగ్నిపరీక్ష? కనీసం వేణు నయినా దక్కించు' అనుకుంటూ దూరమవుతున్న ట్రెయిన్ ను చూడలేక తల తిప్పేసుకున్నాడు.
* * *
వేణుకు తెల్లవారుజామువరకూ స్పృహే లేదు.
రాధ వేణు తలదగ్గర కూర్చొని నిశ్శబ్దంగా రోదిస్తున్నది. గోవిందరావు కుర్చీలో శిలారూపమైబాడు. అప్పుడొకటి, ఇప్పుడొకటి కన్నీటి చుక్కలు రాలుతున్నాయి.
భాగేశ్వరికి నైట్ డ్యూటీ లేకున్నా అక్కడే ఉంది. ఆర్తి, ఆమె క్షణక్షణానికీ వేణును పరీక్షిస్తున్నారు.
నాలుగు గంటలప్పుడు వేణుకు తెలివి వచ్చింది. రెండుసార్లు కష్టంగా అందీఅందని శ్వాసతో నవ్వాలని ప్రయత్నిస్తూ "నీతా ..... నీతా ..... వచ్చిందా?" అన్నాడు.
ఎవ్వరూ బదులు పలకలేదు.
"రా....రా.....ధా..." చెయ్యి కదిలించాడు. రాధ మరికొంచెం ముందుకు జరిగింది. ఆమె తలమీద చెయ్యి వేశాడు. రెండవ వైపు కుడిచెయ్యి విరిగింది. కళ్ళకు, తలకు, కుడికాలికి మొత్తం కట్లు కట్టబడ్డాయి.
"రాధా ..... నా కళ్ళకేమీ కనబడటంలేదు. అంధకారంగా ఉంది. కానీ అందులో ఏ లోకాలకో దారి చూపిస్తున్న కాంతిరేఖ .... నీకు కనపడటం లేదు కదూ?"
"మామయ్యా!" రాధ దుఃఖాన్ని పట్టలేకపోయింది.
"ఎందుకు, రాధా, ఏడుపు? నీతా లేదు. నేనున్నాను. నువ్వున్నావు. నీలో నీతా ఉంది. కాని..... కాని.... నే నిక్కడ ఉండలేను. ఉండలేను, రాధా."
"వేణూ, మాట్లాడకు."
"ఓ, అక్కా! నువ్వేనా? నేను వెళుతున్నాను. నన్ను దీవిస్తూ ..... అబ్బ...."
రాధ తలమీద చెయ్యి కిందికి జారుతున్నది.
"రాధలో నీత. నీతాలో రాధ. ఎవరూ లేరు. నేనూ ఉండను. నా జ్యోతి.... నా జీవం....నేను...నీతా....సాక్షిగా....
నీతా....సా.....సా......క్షిగా.....పంచభూతాలకు......అంకితం......అక్కా.....రాధా.....నీతా..."
రాధ తలమీద ఉన్న అతని చెయ్యి ఆమె నుదుటి కుంకుమ సాంతం చెరిపివేస్తూ, ముందుకువంగి తన బహిఃప్రాణమైన వేణును కన్నీటితో తడిపివేస్తున్న రాధ మాంగల్యాన్ని తెంపుతూ కిందికి జారింది.
రాధ కీచున అరిచింది.
వేణు పెదవులు మళ్ళీ విడివడనే లేదు.
అప్పటివరకూ సజీవమూర్తి అయిన అతనిలో జీవచైతన్యం, ప్రజ్వలించి ఆరిపోయిన అతని ప్రేమ జ్యోతి సాక్షిగా పంచభూతాల్లో అంతర్లీనమైంది.
26
రోజులు, సంవత్సరాలు గడవటంలో దిగులు కనిపిస్తూంది.
నెల రోజులకు ఎక్కడినుంచో ఒక ఉత్తరం వచ్చింది వేణు పేరుతో.
"స్వామీ,
హృదయమందిరంలో మీ రూపు ప్రతిష్టించు కొన్నాను. ప్రతిరోజూ నేను నా ప్రభువుతో రాధగా మిమ్మల్ని పూజిస్తాను, నటిస్తాను. అలసి సొలసి మీ ఒడిలో సేదతీర్చుకుంటాను. నన్ను మీరు లాలిస్తారు. ముంగురులు సవరిస్తూ చెక్కిలిని కొనగోటితో మీటు తారు. మీ పెదవులతో నా పెదవులను పవిత్రం చేస్తారు. ప్రేమపూరితమైన పరిష్వంగంలో అమర లోకాలను దర్శింపజేస్తారు.
ఏమిటో? బతకాలనికూడా అనిపించటంలేదు. మిమ్మల్ని వదిలి వచ్చేరోజు ప్రతి అడుగును మీ 'నీతా' అన్న పిలుపు బంధించాలని చూసింది. నేను పాషాణాన్నే అయ్యాను. నే నెప్పుడూ దుర్మార్గురాలినే కాదూ?
సారథి అన్నగారు సికిందరాబాదు స్టేషనుకు వచ్చారు. అది మేము ముందే ఊహించటంచేత సామానుతో వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నాము. ఆయన ఎన్నో సార్లు ట్రెయినంతా వెతికారు. వెయిటింగ్ రూంలో మేముంటామన్న ధ్యాస కలగలేదు. వారు బండి వెళ్ళే దాకా ఉన్నారు. మేము తరవాత మరొక ట్రెయినులో వెళ్ళాము.
మీకు ఉత్తరం వ్రాయాలన్న వాంఛను అణచలేక పోతున్నాను. వ్రాస్తున్నాను. కాని ఇదే చివరి ఉత్తరం. ఇక్కడ ఇది పోస్టుచేసి వెళుతున్నాము. ఎక్కడికో, ఎటో చెప్పలేను. అందరికీ నమస్కారాలు చెప్పండి. నన్ను మరిచిపోయేందుకు ప్రయత్నించండి.
-నీత."
ఆర్తి నిట్టూర్చింది. "హుఁ, మరుపు. పాపా, నిన్నొక్కదాన్నే కాదమ్మా, మా అందరినీ మరిచి నమస్కారాలు. పోయాడు నీ గోపాలదేవుడు. ఇంకా మరుపు ఎక్కడిది, నాన్న..." పాపా?"
