'అసలేం జరిగింది ?' అన్నాడు కులభూషణ్. ఒకరోజున గనేయ్య ఊరందర్నీ సమావేశ పర్చి "నాకీ రోజు యముడు కలలోకి వచ్చి నరకానికి తీసుకుపోతానని బెదిరించాడు. నా తప్పులన్నీ ఒప్పుకుని పాపాలన్నీ కడిగేసుకునే అవకాశమిప్పించమని నేనాయన్ను వేడుకుంటే అంగీకరించాడు. ఇకమీదట నేనే పాపాలు చేయను. మీకోసమే దేవుడు సుబ్బారావు తండ్రికి మళ్ళీ ఆయువు పోశాడు. మంచికీ చెడ్డకూ మనమందరం అయన యొక్క ఆ కుటుంబం యొక్క సలహాల సంప్రదింపులతో నిర్ణయాలు తీసుకుందాం" అంటూ ఒక్కొక్కటిగా తన తప్పు లోప్పుకున్నాడు. అందరికీ నష్ట పరిహారంగా తన ఆస్తి పంచి పెట్టాడు. ఆ తర్వాత తన ఇంట్లో ఓ గదిలో దూరి తలుపులు వేసుకున్నాడు. అంతా తలుపులు తెరిచి చూస్తె తాను బంధితుడై ఉన్నాడు. గదిలో ఇంకెవ్వరూ లేరు.
ఆ రోజుతో ఆ ఊరి దశ మలుపు తిరిగింది.
ఈ వింతలూ వింటూ ఉదయ తన విస్సీ బావ వంక ముచ్చటగా చూసింది. అతడిదేమీ పట్టనివాడీలా ఏదో ఆలోచనలో ఉన్నాడు. సుబ్బారావు తల్లి బలవంతం మీద వారక్కడ ఒకరోజు పూర్తిగా ఉండిపోయి మర్నాడుదయం తెల్లవారుజామున బయల్దేరారు.
ఈసారి వారికి తెల్లవారు జామున వీధుల్లో ఆడవాళ్ళేవరూ ఎదురు కాలేదు. సుబ్బారావు వారిననుసరించి వస్తూ "ఈ ఊరి స్త్రీలు మీకెంతగానో ఋణపడి ఉన్నామని భావిస్తున్నారు. వారికి మీరు తప్పించిన అవమానం ఏ భారత స్త్రీ కూడా భరించలేదు...' అన్నాడు.
అంతా ఊరి పొలిమేర చేరుకునేసరికి అక్కడి దృశ్యం వారందర్నీ ఆశ్చర్యపరిచింది.
అక్కడ చిన్న తేడా ఉంది.
డేరా చుట్టూ సుమారు యాభై మంది యువకులున్నారు. అందరూ అందంగా ఉన్నారు.
ఒకపక్కగా చిన్న బల్ల ఉంది. దాని మీద కొన్ని పళ్ళేలు, గిన్నెలు ఉన్నాయి. వాటిలో అరటి పళ్ళు, వడపప్పు, పసుపు, కుంకం ఉన్నాయి.
వారందరూ కోలాహలంగా ఏవో భజనగీతాలు పాడుతున్నారు.
"ఏమిటిదంతా ?" అన్నాడు వేదాంతం.
సుబ్బారావు బదులివ్వలేదు. ఈలోగా ఆ యువతులు వీరిని చూశారు. చూస్తూనే ఇద్దరు ముందుకు వచ్చారు. వారి చేతుల్లో నీళ్ళ చెంబులున్నాయి.
యువతులిద్దరూ వంగి వేదాంతం పాదాలు కడిగారు. ఆ నీరు తమ శిరస్సులపై చల్లుకుని లేచి నిలబడ్డారు. వేదాంతం తెల్లబోయి చూస్తుండగా వారిద్దరూ అతడి రెండు చేతులూ పట్టుకుని డేరా లోనికి తీసుకుని వెళ్ళారు. డేరాలో ఓ సింహాసనముంది .దాని కటూ ఇటూ ఆలయంలో విధంగా దీపాలు వెలుగుతున్నాయి.
యువతులిద్దరూ అతణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టారు.
"ఏమిటిదంతా ?' అన్నాడు వేదాంతం ఇబ్బందిగా.
"మమ్మల్ని దేనికీ అభ్యంతర పెట్టకండి --" అందో యువతి.
ఆ తర్వాత ఒక్కొక్కరే యువతులు లోనికి వచ్చారు. వచ్చిన వారందరూ అతడి పాదాలకు మ్రోక్కారు. కొందరు కొబ్బరికాయలు అతడి ముందు కొట్టారు. కొందరు అరటిపళ్ళనుంచారు. కొందరు పూలతో అర్చించారు.
ఆకక్ది తతంతం పూర్తీ కావడానికి సుమారు రెండు గంటలు పట్టింది. కులభూషణ్, ఉదయ ఇదంతా విడ్డూరంగా చూస్తున్నారు.
"గ్రామీణుల బానిసత్వం తొలగడానికి కారణం వేదాంతం అన్న విషయం నేను నిన్న అందరికీ తెలియజేప్పాను. దాని ఫలితమిది" అన్నాడు సుబ్బారావు వారితో.
వేదాంతం మాత్రం ఇందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు.
ఇది వారించమని చెప్పడానికికతడు మధ్యలో ఉదయనూ, కులభూషణ్ నూ పిలిచాడు.
వాళ్ళిద్దరూ లోపలకు వచ్చి అతడు చెప్పేది వినకుండా అతడికి సాష్టాంగపడి అతడి ముందు కొబ్బరికాయలు కొట్టి పూలతో అర్చించి వెళ్ళిపోయారు. వేదాంతానికి నోటమాట రాలేదు.
అంతా అయ్యాక అతడు సింహాసనం దిగి - నేను దేవుణ్ణి కాను. మీవంటి సామాన్యుణ్ణి . మనిషిని --అన్నాడతను.
'అదంతా మాకు తెలియదు. మా కోసం మీరు చేసినది ఏ సామాన్యుడు చేసినా ఇలాగే గౌరవించే వాళ్ళం. అయతే మానుంచి ఓట్లు పొందుతూ మాకు నాయకులనిపించుకునే గొప్ప వారి వల్లే ఈ విశేషం సాధ్యపడలేదు. మీరు స్వామాన్యులు కాదు. సాక్షాత్తు భగవంతుడు...." అన్నారా యువతులు ఏకకంఠంతో.
వారి నుంచి వీడ్కోలు అందుకుని వేదాంతం తన బృందంతో అడవిలో అడుగు పెట్టాడు.
"ఈ పద్దతి నాకు నచ్చలేదు. ప్రజలచేత పాదాభిషేకం చేయించుకునే రాజకీయ నాటకులకూ నాకూ తేడా ఏముంది?" అన్నాడు వేదాంతం సుబ్బారావుతో.
"తేడా వుంది. అది వారెర్పాటు చేసుకున్నది. ఇది మీకు తెలియకుండా మీ కోసం ఏర్పాటు చేయబడింది....' అన్నాడు సుబ్బారావు.
"మన ప్రజలు అమాయకులు. కనీసావసరాలు తీరితే చాలు-- నాయకుణ్ణి దేవుడిని చేయాలను కుంటారు. అయినా వారి కనీసవసరాలు తీరడం లేదు....' అంటూ నిట్టూర్చాడు వేదాంతం.
అంతానడిచి నడిచి ఓ చెట్టు కిందకు చేరుకున్నారు.
"ఆహ్హోయ్---" అని పెద్దగా అరిచాడు సుబ్బారావు.
అప్పుడక్కడికి నల్లగా పొట్టిగా ఉన్న ఆటవికులు పరుగున వచ్చారు. వాడి కనుగుడ్లు ఎర్రగా మెరుస్తున్నాయి. మొల చుట్టూ అడవి నారతో నేసిన బట్ట చుట్టుకున్నాడు.
"మదహోచిర....' అన్నాడు వేదాంతం.
ఆటవికుడు వేదాంతానికి నమస్కరించాడు.
"నేను సెలవు తీసుకుంటాను" అన్నాడు సుబ్బారావు.
"ధన్యవాదాలు" అన్నారు మిత్రులిద్దరూ.
సుబ్బారావు వెళ్ళిపోయాడు.
వేదాంతం బృందం ఆటవికుడి ననుసరించినది.
** ** **
ఆటవికుల గ్రామం ఉదయకు నచ్చింది.
ఆటవికులు వేదాంతం బృందం కోసం నాలుగు గదుల గుడిసె ఒకటి క్షణాల మీద నిర్మించారు.
గుడిసెలో అడుగు పెట్టగానే సన్నటి పొడవైన వరండా, ఆ వరండానే అనుకుని నాలుగు గదులు.
వారందులో స్థిరపడగానే ఒక చిత్రం జరిగింది.
ఒక ఆటవిక యువతికి ఏదో తెలియని జబ్బు చేసింది. ఆమెకు వివాహం జరిగి నాలుగు మసాలైంది. భర్త ఆమెను మాంత్రికుడికి అప్పగించాడు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమించింది.
"మాంత్రికుడామే "శాపగ్రస్త" అన్నాడు.
కులభూషణ్ ఇది విని ఆమెను తను చూస్తానన్నాడు.
మాంత్రికుడు నాయకుడితో "శాపగ్రస్థలను బాగుచేయడం ఎవరికీ సాధ్యం కాదు" అన్నాడు.
'అతడి ప్రయత్నం అతణ్ణి చేయనిద్దాం" అన్నాడు నాయకుడు.
'అతడి ప్రయత్నం విఫలమైతే వారిక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు ... ఎందుకంటే శాప గ్రస్థలకు సాయం చేసిన వారిని భగవంతుడు క్షమించడు. అలాంటి వారిక్కడుంటే మన గ్రామం నాశనమైపోతుంది" అన్నాడు మాంత్రికుడు. నాయకుడు మాంత్రికుడి షరతును కులభూషణ్ కు చెప్పాడు.
"ముందామేను చూసి ఆమె శాపగ్రస్థ అయిందీ కానిదీ తెలుసుకుంటాను"అన్నాడు కులభూషణ్.
"మా మాంత్రికుడి మాటకు తిరుగుండదు" అన్నాడు నాయకుడు. 'అదే చూద్దాం " అన్నాడు కులభూషణ్.
నాయకుడందుకనుమతించాడు.
కులభూషణ్ ఆ యువతిని పరీక్షించాడు. ఆమె పరిస్థితి బాగోలేదు. కానీ మనిషి ప్రయత్నం చేస్తే బ్రతికే అవకాశముంది. అదే అతడు వేదాంతానికి చెప్పాడు.
"మన పరిశోధన సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందా యువతిని రక్షించు" అన్నాడు వేదాంతం.
"నేనూ అదే చేయాలను కుంటున్నాను" అన్నాడు కులభూషణ్. రిస్కు తీసుకుని అతడు వైద్యం ప్రారంభించాడు.
ఆమెకు అవసరమైన సేవలు చేయడానికి ఉదయ పూనుకుంది. అందుకు వీలుగా ఆమెను వారుండే గుడిసెకు తరలించారు. కులభూషణ్ తను తెచ్చిన మందులతో ఆమెని రక్షించడానికి ప్రయత్నం ప్రారంభించాడు. తను తెచ్చిన వాటిలో ఆమెకు అవసరమైనవి అన్నీ లేవు. ఉన్నవాటి నేలాగో ఉపయోగించి ఆమెను బ్రతికించాలని అతడి తాపత్రయం. ఆమెను బ్రతికించలేకపోతే అతడి పరిశోధనా ప్రయత్నం వాయిదా పడిపోతుంది.
మానవత్వానికి దైవత్వం సాయపడుతుందా?
"నీ మెడికల్ ప్రాబ్లమ్స్ విశ్వనాద్ తో డిస్కస్ చేయి" అని వేదాంతం అతడికి సలహా ఇచ్చాడు.
కులభూషణ్ కదే మార్గంగా తోచింది.
అతడామె రోగ లక్షణాలనీ, అందుకు వాడవలసిన మందుల్నీ తనవద్ద ఉన్న మందుల్నీ అవేయే రోగ లక్షణాలకు పనికి వచ్చేది విశ్వనాద్ కు చెప్పుకున్నాడు. విశ్వనాద్ అంతా విని క్షణాల మీద అతడికి ఓ కాంబినేషన్ సెలక్టు చేసి పెట్టాడు. అది వెంటనే కొంత గుణం చూపించడం లో కులభూషణ్ అడుగడుగునా విశ్వనాద్ సలహా తీసుకు సాగాడు, మనిషి మేధస్సుకందని వేగంతో విశ్వనాద్ సమస్యలకు పరిష్కారం చెప్పగల్గుతున్నాడు. అతడికవసరమైనదల్ల సమస్యలను సరిగ్గా విపులీకరించి చెప్పగలిగిన వ్యక్తీ!
