గదిలో టేబుల్ వేశాను. టేబుల్ మీద స్టూల్ పెట్టాను. స్టూల్ మీద ఎక్కి తాడు ఒకటి గది కప్పుకున్న కొక్కేనికి కట్టాను. చివర వదులుగా ముడి వేశాను. ఆ బల్ల మీద నిలబడి ముడి మెడకు తగిలించు కుంటున్నాను.
సరిగ్గా అప్పుడే తలుపులు తట్టారెవరో!
ఏం చేయాలి?.... వెళ్ళి తలుపులు తీయాలా. లేక నా పని నేను చేసుకుపోవాలా!
వీధి తలుపులు ఎంతకూ తీయకపోతే ఆ మనిషి వెనక్కు వెళ్ళిపోవచ్చు. లేదా అల్లరి చేసి నలుగుర్ని పిలవచ్చు. అప్పుడు నా ప్రాణాలు రక్షించబడే అవకాశముంది.
వచ్చిందేవరో చూసి వెంటనే పంపించేస్తే నా పని తర్వాత నిర్విఘ్నంగా అయిపోతుంది.
ఒకవేళ ఆ వచ్చినది జయదేవో, రాజకుమారో , గోవిందరవో అయితే!
ఎవరైనా సరే లోపలకు రానివ్వను. అల్లరి చేసైనా వాళ్ళను బయటికి తోసేస్తాను. వాళ్ళ వల్ల ప్రమాదానికి భయపడ్డానికి ప్రాణాలింకా వుంటే గద!
తాడు ను వదిలిపెట్టి బల్ల మీంచి టేబుల్ మీదకూ టేబుల్ మీంచి నేలమీదకూ దిగి గదిలోంచి బయట పడ్డాను. తలుపులు దగ్గరగా వేసి వీధి తలుపులు తీశాను.
బయటనున్న మనిషి నేననుకున్న దెవ్వరూ కాదు. వీర్రాజు!
"మీరా?" అన్నాను ఆశ్చర్యంగా వుందా?" అన్నాడు వీర్రాజు . అతడి కళ్ళు చుట్టూ దేనికోసమో వెదుకుతున్నాయి.
"ఏం కావాలి మీకు? ఎన్నడూ లేనిది ఇలా వచ్చారేమిటి?" అన్నాను.
"నాకు పని వుంది ....' అంటూ అతను పడక గదిలోకి నడుస్తున్నాడు. అతనా గదిలోకి వెళ్ళడం నాకిష్టం లేదు. అడ్డంగా నిలబడి -- "ఏం కావాలో చెప్పండి!" అన్నాను.
అతను విసురుగా నన్ను పక్కకు తోసేసి -- "నీకిచ్చిన స్వేచ్చను ఎంత చక్కగా వినియోగించు కుంతున్నావో చూస్తాను....' అంటూ ముందుకు వెళ్ళి రెండు తలుపులు తోసి అక్కడ కనబడ్డ దృశ్యం చూసి మ్రాన్పడి పోయాడు.
అతనేదో అడిగేలోగా నేను రెండు చేతులతో ముఖం కప్పుకుని ఏడవసాగాను. అప్పుడు నా కళ్ళలోకి ఆగకుండా నీళ్ళు వస్తున్నాయి. అంత ఏడుపును ఒక్క సారిగా బయటపెట్టలేక మధ్య మధ్య వెక్కుతున్నాను.
"మోహనా! ఎందుకు తలపెట్టవీ దారుణానికి!" అన్నాడు వీర్రాజు. అతని కంఠం ఇదివరకటి లా లేదు. చాలా సౌమ్యంగా లాలనగా వుంది. ఆ కంఠం లోని ధ్వనికి నా ఎపుడు పెరిగిపోయింది.
వీర్రాజు నన్ను సమీపించాడు. అప్రయత్నంగా నా తల అతని గుండెల మీద వాలిపోయింది. అతను ప్రేమగా నా ముంగురులు, చెక్కిళ్ళు నిమురుతూ -- "చెప్పు -- ఈ దారుణానికి ఎందుకు తలపెట్టావు?" అన్నాడు.
"నాకు జీవించడానికి అర్హత లేదు!" అన్నాను ఇంకా ఏడుస్తూనే.
"అసలేం జరిగింది ?"
"నానోటితో చెప్పలేను...."
"నువ్వు చెప్పక్కర్లేదు , అంతా రాజశేఖరం చెప్పాడు" అన్నాడు వీర్రాజు.
"ఎప్పుడు?" అన్నాను అప్రయత్నంగా.
"నిన్న మధ్యాహ్నం " అన్నాడు వీర్రాజు.
వీర్రాజు చెప్పిన కధ వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
వీర్రాజు పై రాజశేఖరానికి రెండు విధాల పగ వుంది. నన్ను వీర్రాజు పెళ్ళి చేసుకోవడం మొదటిది. రాజశేఖరం భార్య నాగాదేవి వీర్రాజు పాత ప్రియురాలు కావడం రెండవది. పెళ్ళి సమయానికి ఈ కధ రాజశేఖరానికి తెలియదు. పెళ్ళయ్యేక తన భార్య అప్పుడప్పుడు వీర్రాజును కలుసుకుంటున్నట్లు అతను గ్రహించాడు. వాళ్ళిద్దర్నీ ఓ పర్యాయం రెడ్ హేండేడ్ గా పట్టుకున్నాడు రాజశేఖరం.
నాగాదేవి బరితెగించిన ఆడది. నేను వీర్రాజు ను ప్రేమించాను. మీకిష్టం లేకపోతె విడాకులివ్వండి అనేసింది. రాజశేఖరం వంశ ప్రతిష్ట కు అది చాలా అవమానం.
వీర్రాజు ను రాజశేఖరం ఎన్నో సార్లు రిక్వెస్టు చేశాడు. కాని కోరివచ్చిన ఆడదాన్ని వదులుకోలేనన్నాడు వీర్రాజు. దాని మీద రాజశేఖరం వీర్రాజు పై పగబట్టాడు. నిన్ననే అతను వీర్రాజుకు తెలియజేశాడు-- "నీ భార్యను నేను పచ్చి వ్యభిచారిణి ని చేశానని " అందుకు ఋజువుగా అతను చాలా ఫోటోలు చూపించాడు.
అమాయకంగా కనబడే తన భార్య ఇలా ప్రవర్తించిందని వీర్రాజు నమ్మలేదు. ఈరోజు అందుకే ఇంటికి వచ్చి చూశాడు.
"నీ తరపున నీ కధ కూడా చెప్పు. అంతా నిజమే చెప్పు. అసలేం జరిగింది?"
నాకు నిజం దాచాలని పించలేదు. అంతవరకూ జరిగిందంతా వివరంగా వీర్రాజుకు చెప్పేశాను. ఆఖరికు గోవిందరావు సంగతి కూడా వదలలేదు. అన్నీ వింటున్నాప్పుడు వీర్రాజు ముఖం బాగా ఎర్రబడి పోయింది.ఆవేశాన్ని అతి కష్టం మీద అణచుకుంటున్నాడని గ్రహించాను.
అంతా అయిపోయేక "చూడు మోహనా! నేనోసారి బయటకు వెళ్ళిరావాలి. అంతవరకూ ఏ అఘాయిత్యమూ తలపెట్టకు. నీ సమస్యకు మంచి పరిష్కారాన్ని నేను సూచిస్తాను" అంటూ అతను గదిలో ఉరితాడు తీసేసి -- "నా మాట విని నేను వచ్చేదాకా ఎదురు చూస్తావని అశిసిస్తున్నాను" అంటూ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు.
ఆ క్షణంలో నాకు ఆత్మహత్య ప్రయత్నాన్ని కొనసాగించే మనో ధైర్యం లేదు. వరండాలో సోఫాలో చతికిలబడిపోయాను.
వీర్రాజు వెళ్ళిన అర్ధగంటకు రాజశేఖరం ఇంట్లోకి వచ్చాడు. వరండాలో కూర్చున్న నన్ను చూస్తూ -- "మన సమస్యకు మంచి పరిష్కారం సూచించడానికి వచ్చాను" అన్నాడు.
'సమస్యను సృష్టించిన వాడివి నువ్వు. నీ స్వార్ధం కోసం ఓ ఆడదాన్ని నిండు జీవితాన్ని బలి చేశావు. నిండు హృదయంతో నీమీద ప్రేమను ప్రకటిస్తే -- దాన్ని నిలువునా దగ్ధం చేశావు. నీ అంత దుర్మాగుడు వేరే ఎక్కడా వుండదు" అన్నాను కోపంగా.
రాజశేఖరం నా ఎదురుగా కూర్చుని... "వీర్రాజు లాంటి వాడికి నేను చేసిన శాస్తి తప్పంటావా?" అన్నాడు.
"నువ్వు నీ గురించీ వీర్రాజు గురించే ఆలోచిస్తున్నావు. కానీ ఈ పగల మధ్య ఒక ఆడదాని నిండు బ్రతుకు...." అని నేనేదో అనబోతుంటే....
'అలా ఎందుకు జరగనిస్తాను? నిన్ను నాదాన్ని చేసుకుంటాను" అన్నాడు రాజశేఖరం.
"ఇది సంభవమా?" అన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు.
నా చూపులు అర్ధం చేసుకున్నట్లున్నాడురాజశేఖరం . "అది చెప్పడానికే వచ్చాను. నిన్ను నేను వివాహం చేసుకుంటాను. అయితే మనం కొత్త చోట కాపురం ప్రారంభిస్తాం. నీకు తెలియకుండా ఇక్కడ కొంత కాలం నాకు వ్యాపారంలో సహకరించావు. అదేవిధంగా తెలిసి కూడా ఇకముందు వ్యాపారంలో నాకు సహకరించాలి. నీకు ఏ లోటూ వుండదు. ఒక ప్రముఖుడి పర్సనల్ సెక్రటరీ గా నీకు సమాజంలో పలుకుబడి వుంటుంది. ఖరీదైన జీవితం వుంటుంది."
"అంటే నీకు ఉంపుడు గత్తేగా వుంటూ, నువ్వడిగిన వారికి సుఖానిస్తూ -- ఓ వ్యభిచారిణి జీవితం గడపమంటావు" అన్నాను కసిగా.
'అలాగేం కాదు....నువ్వేం చేసినా అభ్యంతరం పెట్టని నీ భర్త కూడా వుంటాడు."
"వుంటాడు , ఆ భర్తమాత్రం నువ్వు కాదు, అవునా?" అన్నాను.
'అవును మోహనా! వీర్రాజు నిన్నేలాగూ ఇక్కడుండనివ్వడు. నువ్వు నిరాశ్రయురాలి వైపోకుండా ఆకర్షణీయమైన జీవితమొకటి నా దగ్గరుందని చెప్పడం కోసమని వచ్చాను. ఆలోచించుకొని నీకు నచ్చు బాటయితే వెంటనే శోభా లాడ్జికి వచ్చి రాజకుమార్ ని కలుసుకో. అతను నిన్ను నా దగ్గిరకు చేరుస్తాడు" అని వెళ్ళిపోయాడు రాజశేఖరం.
'చాలా గొప్ప ఆఫర్!" అనుకున్నాను మనసులో కసిగా.
రాజశేఖరం వ్యాపారస్తుడి కొడుకు. అతడికి చాలా లోపాయి కారీ వ్యవహరాలుంటాయి, వాటికి నన్నుపయోగించు కోవాలను కుంటున్నాను. నైతికంగా పతనమైన నన్ను వీర్రాజు గెంటేస్తే నాకు నీడ లేకుండా పొతే -- తను ఆశ్రయమిచ్చి నా బలహీనతల నాధారంగా చేసుకుని తన వ్యాపారం పనులు చేయిన్చుకోవాలనుకుంటున్నాడు.
ఆ జీవితం తలచుకుంటేనే భయంకరంగా వుంది. ముందు ఏదో పొరపాటు అభిప్రాయంలో వున్నాను కానీ ఇప్పుడు తలచుకుంటుంటే వీర్రాజు క్రమశిక్షణ జీవితమే చాలా చాలా బాగుందని పిస్తోంది.
సరిగ్గా ఇంకో గంటకు వీర్రాజు వచ్చాడు. "నువ్విచ్చిన సమాచారం చాలా ఉపయోగపడింది మోహనా! రాజశేఖరం భావిస్తున్నట్లు మాది స్మగ్లింగ్ వ్యాపారం కాదు. అలా నటిస్తున్న ప్రభుత్యోదుగులం మేము. మాకు నిర్దుష్టమయిన కొన్ని పధకాలున్నాయి. అప్రకారం దేశంలోని కొందరు వ్యాపారస్తుల్ని , ప్రముఖుల్నీ , నిర్ణయించిన పద్దతిలో చెకింగ్ చేస్తాం. నీద్వారా ఆ సమాచారం రాజశేఖరం ముఠాకు లీక్ అయింది. పోలీస్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ చెకింగ్ చేస్తారో మాకు ముందుగానే తెలుస్తోందని రాజశేఖరం అనుకున్నాడు. తప్పితే మేము ప్రభుత్వోద్యోగులమని అనుకోలేక పోయాడు. నువ్వు చెప్పిన సమాచారం ఆధారంగా రాజశేఖరం, జయదేవ్, రాజకుమార్ వగయిరాలను అరెస్ట్ చేసే ఏర్పాట్లను చేసి వచ్చాను. ఇందులో నా ప్రసక్తి ఏమీ వుండదు...." అంటూ మెరుస్తున్న కళ్ళతో అతను చెబుతుంటే నేను ఆశ్చర్యంగా విన్నాను.
"మనమిక్కడ ఉండం. ఇంకో వూరు వెళ్ళిపోతాం" అన్నాడు వీర్రాజు.
"మనం అంటే!" అన్నాను ఆశ్చర్యంగా.
"మనం అంటే నువ్వూ నేను" అన్నాడు వీర్రాజు.
'అదెలా సాధ్యం?" నేను...నేను...."
"అగు మోహనా!" అన్నాడు వీర్రాజు. "తప్పు చాలావరకు నాదే! ఒక విధమైన కండకావరంతో రాజశేఖరం భార్యను నేను వదులుకోలేక పోయాను. అందుకే గదా అతను నామీద పగ పట్టాడు. ఆ విధంగా చూస్తె అతని పగకు కారణం నేను చేసిన తప్పు! ఆ పగను అతను నీమీదకు మళ్ళించాడు. అది కూడా నా కారణం గానే! ఎటొచ్చీ అతను వ్యాపారస్థుడు కాబట్టి, నీద్వారా తన పగను తీర్చుకుంటూ తన పనులు కూడా చాలావరకూ చేసుకున్నాడు. చివర్లో నాముందు నిర్భాయంగా నువ్వు చెప్పిన నిజాలు అతన్ని పట్టించాయి."
"ఏది ఏమయినా నేను చాలా తప్పులు చేశాను. ఇందులో నా బాధ్యత లేదని నేననలేను. తెలిసి చేసిన తప్పులవి" అన్నాను.
"నువ్వు తెలిసి కూడా తప్పు చేసే మనస్థితి నీ పట్ల నాప్రవర్తన కారణంగా నీకు ఏర్పడింది. ఈరోజు ఉదయం నేను విపరీతమైన కోపంతో ఇంటి కొచ్చాను. కానీ అక్కడ నీ ఆత్మహత్య ప్రయత్నం చూసినాకనే మానసికంగా నువ్వెంత క్షోభకు గురక్వుతున్నావో తెలుసుకోగలిగాను. అప్పుడే నా బుద్ది పనిచేసింది. నా తప్పులన్నీ తెలిశాయి. నా వివేకం నాకు కర్తవ్య బోధ చేసింది. ఫలితంగా నిన్ను సంతోష పెట్టాలను కున్నాను. ఇకమీదట మనం గడపబోయే జీవితం కొత్తగా వుంటుంది...." అన్నాడు వీర్రాజు ఉత్సాహంగా.
"కానీ నేను మానసికంగా మామూలు జీవితానికి సిద్దపడి లేను"అన్నాను నీరసంగా.
"బురదలో పడ్డ పూవును కడిగి వేస్తె బురద పోయి స్వచ్చంగా మెరుస్తుంది. ఆ సంగతి తెలిసిన నేను పువ్వును మళ్ళీ బురదలో పారవేయలేను. ఇది నా నిర్ణయం! నా నిర్ణయం బలవంతంగా నీమీద రుద్దడం యిదే ఆఖరు సారి అవుతుంది" అన్నాడు వీర్రాజు.
తప్పు చేయని వాడి కంటే తప్పును క్షమించిన వాడే గొప్పవాడు. అటువంటి గొప్పతనం ఇదివరలో వున్నా లేకపోయినా ఇప్పుడు వీర్రాజులో వున్నందుకు అతనిపై అంతులేని గౌరవాభిమానాలు కలిగాయి. నాకు, ఆనందంతో దుఃఖం ముంచుకు రాగా అతని హృదయం పై పడి తనివి తీరా ఏడ్చాను.
---అయిపొయింది -----
