23
మద్రాసు సెంట్రల్ స్టేషను బయట నీళ్ళ కుళాయి దగ్గిర కడుపు నిండా నీళ్ళు పట్టించిన తరవాత రవిచంద్ర కు కాస్త సేద చేరిన ట్లనిపించింది.
ఆ కుళాయి పక్కనే ఏదో యాత్రికుల బస్సు ఉంది. కొంతమంది ఒకపక్కగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు.
సెంట్రల్ స్టేషన్ ఆవరణలో రవిచంద్ర. చతికిల పడ్డాడు. ఆ బస్సులోంచి ఒకాయన దిగి వచ్చి కాస్సేపు స్టేషనంతా పరికించి చూశాడు. రంగుటద్దాల పెట్టెల్లో అమర్చిన సినిమా బొమ్మల వైపు దీక్షగా చూశాడు. అటు, ఇటు తిరుగుతూ భోజనం చేస్తున్నవాళ్ళను , "త్వరగా తెమలండి" అని కేకేసి ఏమీ తోచనట్లుగా రవిచంద్ర పక్కనే తను చతికిల పడ్డాడు.
"తెలుగు వారేనా?' అని అడిగాడు అయన.
అవునన్నట్లు తల ఊపాడు రవిచంద్ర.
"ఎక్కడి దాకా వెళ్ళాలి?"
ఆ ప్రశ్న జవాబు కోసమే అతను ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తున్నది !
"ఎక్కడికి లేదు " అన్నాడు రవి చివరికి.
కొంచెం సేపాగి, "ఇది యాత్రికుల బస్సా!" అని అడిగాడు.
'అవును, తిరుపతి వెళుతున్నాం " అన్నాడు ఆ పెద్ద మనిషి.
రవిచంద్ర లో ఏదో ఊహ తళుక్కున మెరిసింది. క్షణం సేపాగి "నన్ను మీ బస్సులో రానిస్తారా తిరుపతికి?" అన్నాడు.
ఆ పెద్దమనిషి నివ్వేరబోయి , సంభాళించుకొని, "ఏం తిరుపతి వెళదామను కుంటున్నారా?'అన్నాడు.
'అవును, తిరుపతి వెళ్ళాలనుంది. దయచేసి మీరు నన్ను తీసి కెళ్ళరూ?' ఎందుకనో అతని గొంతులో దాచుకుందామన్న దాగని దీనత్వం , సడలిన నిబ్బరం ధ్వనించాయి. ఒంటరితనం మనిషిని బలహీనుడ్ని చేస్తుంది కాబోలు కళ్ళలో నీళ్ళు కూడా అతనికి తిరిగాయి.
రవిచంద్ర పరిస్థితి ఆ పెద్ద మనిషిని ఆకట్టుకుంది. క్షణం సేపు అలోచించి "డ్రైవరు తో అలోచించి చేబుతాలెండి, " అని భోజనం చేస్తున్న వాళ్ళను తొందర పెట్టి ప్రయాణానికి సిద్దం చేశాడు.
ఒక అర్ధగంట తరవాత బస్సు కదిలింది. కదలబోయే ముందు అతను రవిచంద్ర ను చూసి చేయి ఊపాడు. గబగబా వెళ్లి రవిచంద్ర ఆ బస్సులో కూర్చున్నాడు. "గోవిందా గోవిందా" అన్న యాత్రికుల భగవన్నామస్మరణ తో బస్సు తిరుపతి వైపు పరుగులు తీసింది.
* * * *
కలియుగ వైకుంఠం గా పేరొందిన తిరుపతి దివ్యక్షేత్రం భక్తులతో కలకల లాడుతున్నది. దైవ దర్శనాని కోసం భక్తులు ఒక్క పక్క బారులు తీరి ఉండగా, మరొక పక్క అడుక్కుని తినేవాళ్ళు బారులు తీరి కూర్చున్నారు. ఎటువైపు చూసినా భగవంతుని దివ్యానామ సంకీర్తనలతోను, గొవిందల తోనూ , గణగణ మని మోగే గంటలతో నూ కోలాహలంగా ఉంది.
పేలికలయిన గుడ్డలతోను, పెరిగిపోయిన గడ్డం తోనూ ఉన్న రవిచంద్ర నుఎవరో ధర్మాత్ముడు బిచ్చగాడుగా భావించి చేతిలో ఏదో ప్రసాదం ఉంచాడు.
శక్తి విహీనుడై , శుష్కించి పోయిన రవిచంద్ర అతికష్టం మీద కళ్ళు పైకెత్తి చూశాడు. నిర్జీవపు నవ్వు అతని పెదిమల మీద మెదిలింది. "మహా ప్రసాదం" అని గొణుక్కుంటూ భక్తితో కళ్ళ కద్దుకొని నోట్లో వేసుకున్నాడు. అతనితో ఇప్పుడు ఆవేదన, దుఃఖం, విచారం, సంతోషం, ఆనందం -- ఏవీ లేవు. నిర్వికారత అతణ్ణి పూర్తిగా ఆవరించు కుంది.
దేవాలయం లో దీపాలు వెలిగాయి. తిరుపతి కాంతివంతమైన విద్యుద్దీపాలతో కన్నుల పండువుగా మెరిసిపోతున్నది. రవిచంద్ర ఇక్కడికి వచ్చి ఎన్ని రోజు అయిందో అతనికి జ్ఞాపకం లేదు. జ్ఞాపకం చేసుకోవలిసిన అవసరమూ కలగలేదు. ఏదో వేళకు ఇంత ప్రసాదం లభిస్తున్నది. అది తిని పక్కనే ఉన్న అనాధసత్రం లో రాత్రిళ్ళు జాగరణ చేస్తున్నాడు.
ఆరోజున ఎందుకనో అతనిలో నీరసం ఎక్కువయింది. అతి కష్టం మీద సత్రానికి చేరుకో గలిగాడు.
చేరుకున్న చాలాసేపటికి కళ్ళు మూతలు పడ్డాయి.
గుంపులు గుంపులుగా భక్తులు ముందుకు తోసుకొని వెళుతున్నారు. ఎంతమంది ఆపినా అగకుండా ఆ తొక్కిడి లోనే అందరూ వేగిరం వెళ్ళాలనే ఆదుర్దాతో ఇంకా ముందుకు పోతున్నారు.
ఎక్కడికీ జన ప్రవాహం? ఎక్కడికీ మహా ప్రస్థానం? ఎవర్నో అడిగాడు తను, "ఎటువైపు వెళుతున్నారు వీళ్ళు?' అని. అతను తనను విస్మయంతో చూస్తూ "మీరు ఉత్త అమాయికుల్లాగా ఉన్నారే? భగవంతుడు ఈ పట్టణానికి వచ్చాడు. మేమంతా చూడటానికి వెళుతున్నాం." అని చెబుతూ అతను ఆ రద్దీలో ముందుకు నడవ సాగాడు. ఇంతలో అతణ్ణి ఎవరో వెనక్కి తోశారు.
"నీవు తోయబట్టే వెనక బడ్డాను" అని తనని తిట్టుకుంటూ మళ్ళీ ముందుకు చొచ్చుకొని పోతున్నాడు.
తనకు విచిత్ర మనిపించింది.
భగవంతుడు స్వయంగా రావడమా?"
అది సాధ్యమా? ఈ ప్రజలంతా పిచ్చివాళ్ళు. రక్త మాంసాలలో దేవుణ్ణి చూడాలని ఆదుర్దా పడే వాళ్ళను పిచ్చివాళ్ళనక ఏమనాలి?
ఎందుకనో తనకు ఆ గుంపుల వెంబడి వెళ్లాలని పించింది.
అతి కష్టం మీద ఒక గుంపులో పడ్డాడు. సీసాలో బంధించినట్లుగా ఉంది! ఎంతకూ గుంపు ముందుకు సాగదెం?
గంట...రెండు...గంటలు....మూడు గంటలు...ఇంకా ఎంతసేపు? హమ్మయ్య! దేవాలయ ప్రాంగణం లోకి చేరుకున్నాడు.
ఇక్కడి నుంచే వంగి వంగి దండాలు పెడుతున్నారు. సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తున్నారు. ఎంత మూర్ఖులు వీళ్లు?
అదిగో, ఆ కనబడే గోపురం కిందనే దేవుడు దర్శన మిస్తున్నది! ఇంకోక్కసారి వెనక ప్రజ తనను ముందుకు నెట్టితే చాలు, అక్కడ పడతాడు. ఎలాగైతే నేం? తను ఆ నిలయం లోకి చేరుకున్నాడు.
ఏడీ? భగవంతుడేడీ? కనబడడెం? అదేనా? ఆ విగ్రహమేనా? నల్లటి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహామేనా భగవంతుడు? అది చూడడాని కెనా ఇంతమంది ఇంత ఓపికతో వేచి ఉన్నారు?
ఏమిటి, చిత్రంగా ఉందే? ఆ విగ్రహానికి రూపురేఖలు వస్తున్నాయేమిటి? విచిత్రంగా ముక్కూ, కళ్ళూ, అంతా మనిషి పోలికతో? ఓహ్! భగవానుడు ప్రత్యక్ష మవుతున్నాడు.
"జనమంతా భక్తీ తో తన్మయులవుతున్నారు!"
"ఎవరిది?.....అతను దేవుడా? అక్కడ ప్రత్యక్ష మయి ప్రజలకు ఏదో సందేశమిస్తున్న రాజగోపాలం దేవుడా?"
"తనతో సాహచర్యం చేసిన రాజగోపాలం భగవంతుడా?"
"మిరుమిట్ల తో....నేత్రాలు మూతలు పడుతున్నాయి. ఆ మూర్తి ప్రసరించే దివ్యకాంతి కి తను తట్టుకోలేకుండా ఉన్నాడు.
"తొలగండి! తొలగండి! దేవేరి వస్తున్నది!" జనం లో ఎవరిదో కేక!ప్రజలంతా భక్తీ ప్రపత్తులతో అడ్డు తొలిగి దారి చేస్తున్నారు.
దివ్యత్వాన్ని వెదజల్లుతూ ఆమె వస్తున్నది!
దగ్గిరగా మరింత దగ్గిరగా, తనకు దగ్గిరగా వస్తున్నది ఆమె!
ఆ దేవేరి వీణ! తను పెళ్ళాడిన మూగ వీణ!
తను నివ్వెర పోయాడు. అటు చూడలేక తల దించుకున్నాడు.
చేయెత్తి భగవంతుడు ఏదో అజ్ఞాపిస్తున్నాడు .
వీణను చూపిస్తూ ఏదో తనను తూలనాడుతున్నాడు.
తన జవాబు ఎవరూ వినిపించు కోరెం? అందరు తనను అలా రౌద్రంగా చూస్తున్నారేం?
ఆమె కళ్ళలో నించి రక్తాశ్రువులు వస్తున్నాయి!
ఒక్కొక్క అశ్రువు ఒక్కొక్క జలపాతం లా తన మీద పడుతున్నది. భగవంతుడేదో అజ్ఞాపిస్తున్నాడు. తన కిక దారి లేదు. ఆమె నెమ్మదిగా తనకు దగ్గిరగా వచ్చి తన చేయి అందుకుంది.
* * * *
"వీణా!" అని బిగ్గరగా కేకేసి లేచి కూర్చున్నాడు రవిచంద్ర.
అప్పుడే తెలతెల వారుతున్నది. ఆలయం దిక్కు నుంచి వెంకటేశ్వర స్వామి స్తోత్రం శ్రావ్యంగా వినపడుతున్నది.
నిండుగా బొట్లు పెట్టుకొని ఆలయం కేసి భక్తీ శ్రద్దలతో నడిచి వెళుతున్నాయన నెమ్మదిగా శ్లోకాన్ని పటిస్తున్నాడు!
"సర్వ ధర్మాన్ పరిత్యజ్య
మా మేకం శరణం ప్రజ!
అహం త్వా సర్వ పాపేభ్యో
మోక్ష యిష్యామి మా శుచః!"
]
* * * *
రవిచంద్ర బలహీనంగా అక్కడి నించి లేచాడు. అతి కష్టం మీద ఒక్కొక్క అడుగు వెయగలుగుతున్నాడు.
వీధిలో భక్తులు సందడిగా తిరుగుతున్నారు. అప్పుడే కొంతమంది స్నానాలు చేసి మంత్రాలు వల్లిస్తూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కోనేటి వద్ద ఇంకా చాలామంది పాప ప్రక్షాళనకోసమా అన్నట్లుగా వేచి ఉన్నారు.
రవిచంద్ర కు ఒంట్లో ఓపిక పూర్తిగా నశించి పోయింది. అతి నీరసంగా ఆ కోనేటి వద్దకు వచ్చాడు. ఇక నడిచే ఓపికలేక, వరసగా కూర్చున్న ముష్టి వాళ్ళ పక్క కూలబడ్డాడు.
నాలుగు వైపులా నించి దేవుని స్త్రోత్రం వినబడుతున్నది. అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. అతను ఇంతకూ పూర్వం ఎన్నడూ ఎరగని ఏదో మానసిక పరిస్థితి అనుభవిస్తున్నాడు.
స్నానాలయిన తరవాత భక్తులందరు బారులు తీర్చి కూర్చున్న ముష్టి వాళ్లకు పైసలు వెదజల్లుతున్నారు.
ఎవరో అతని చేతిలో అయిదు పైసల నాణాన్ని వేశారు. మూతలు పడుతున్న రెప్పలను అతి కష్టం మీద పైకెత్తి చూశాడు.
తదేకంగా చూస్తున్న ఆ నేత్రాలు! ఎక్కడో చూసినట్లుగా ఉన్న ఆ ముఖం!
ఆ మగత లో ఆలోచనను కేంద్రీకరించి అతి కష్టం మీద ఆయన్ని గుర్తు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు!
అయన తన మీదికి అలా అత్రతతో వంగుతున్నాడెం? పక్కన ఎవరదీ? తనను అత్రతతో పరీక్షిస్తున్న ఆ కరుణామయి నేత్రాలు ఎక్కడో చూసినట్లుగా అనుభూతి! ఎవరామే?
గొంతు పెగుల్చుకొని పెదిమలు ఎండి పోతుంటే, మాట తడబడుతుంటే , కళ్ళు మూసుకొని పోతుంటే ప్రాణాలు బిగపట్టుకొని అతి కష్టం మీద మరింత మీదికి వంగిన అయన భుజం మీద చేయి వేస్తూ రవిచంద్ర "నాన్నా!" అన్నాడు.
ఆ పిలుపులో కోటి వీణలు ధ్వనించాయి ఆయనకు! "రవీ, నా తండ్రీ, ఇక్కడున్నావా? ఇదేం ఖర్మరా, నాయనా?' ఆయనలోంచి ఏడుపు, సంతోషం పెల్లుబికి వస్తుండగా, చిక్కి శల్యవస్థలో ఉన్న రవిచంద్ర ను హృదయానికి హత్తుకున్నాడు.
ఆ ప్రయత్నంగా ఆమె రవిచంద్ర పాద ధూళి ని స్వీకరించింది.
* * * *
రైలు కుదుపుతో రవిచంద్ర కు మెలుకువ వచ్చింది. పక్కనే తండ్రి ఆప్యాయంగా తనను చూస్తున్నాడు.
"నాన్నా!" బలహీనంగా పిల్చాడు.
"ఏం రవీ?"
"ఎక్కడికీ వెళ్తున్నాం?"
"మనింటికి , బాబూ!"
రవిచంద్ర ఒక నిట్టుర్పు విడిచాడు ఆ జవాబు విని. అతని కళ్ళు ఎవరి కోసమో వెతికాయి. ఆమె అతని పాదాల వద్ద కూర్చొని ఉంది.
ఆమెను తన దగ్గిరికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు. ఆమె పవిత్ర శిఖలా గోచరించింది అతనికి. తన దగ్గిరికి వచ్చిన ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, "ఇన్నాళ్ళ నించి, ఈ బలహీనుడు , ఈ దుఃఖ భాజనుడు వీడి కోసం వేచి ఉన్నావా, వీణా?" అన్నాడు.
ఆమె నేత్రాలు అన్నాళ్ళ నించి లోనైనా మూగ బాధను వర్షించాయి!
(సమాప్తం)
