Previous Page Next Page 
తుపాన్ పేజి 28

    దెబ్బలాటకు  తెలుగుకుర్రాళ్ళకి క్రాపులు బాగా పనికివచ్చేవట. అరవ వాళ్ళని  హతమార్చడానికి  కుడుములు బాగా దొరికేవట. కన్నడు  తైరు వేశాడా, ఆ తైరూ అన్నం యావత్తు  అయ్యర్ను తలంటేవారంట. అప్పణ్ణించిటండీ చెన్నపట్నంలో నిజమైన మార్పులు రావడం ప్రారంభించాయి. వెన్న కరిగిన నెయ్యీ, పాలు తోడెట్టిన పెరుగూ, పోపులు పెట్టిన కూరగాయలూ, చక్కని పిండివంటలున్నూ. ఎక్కడో   గుహలోని  హోటళ్ళు  మాయమైపోయి, వసతికీ  భోజనానికీ చక్కని ఏర్పాట్లున్న రాజభవనాలు  రావడం సాగించాయి. పొద్దున్నా సాయంత్రం  ఒక వందరకాల కారం, తీపిసరకులు. ఈ రోజులలో పెద్ద పెద్ద కాఫీహోటళ్ళలో దొరుకుతాయి.  

    ఇవన్నీ మా అచ్యుతరావు  మాకు ఉద్భోధించి చెప్పి '' కనక చెన్నపట్నం మనదిరా '' అన్నాడు మీసం దువ్వుతూ!

    '' రేపు  ఆంధ్రరాష్ట్రం వస్తే చెన్నపట్టణం  మన తెలుగు రాజ్యానికి ముఖ్యపట్నం అన్నమాట, అంతేనా?''

    '' నిశ్చయంగా.''

    '' అయితే, ఉన్న అరవాళ్ళందర్నీ ఏంచేద్దాము?''

    '' కూయమ్ మహానదీగర్భవీచికాసమర్పణమస్తు.

    '' తథాస్తు.''

    అస లీ సంభాషణంతా రావడానికి కారణం శకుంతల దగ్గర నుంచి నాకు వచ్చిన ఉత్తరం  నేను చదువుకొంటోంటే ఒక అరవ మహా పెద్ద మనిషి  కో  స్టూడెంట్ తొంగిచూసి '' క్షమించండి, సార్!'' అని ఇంగ్లీషులో  అన్నాడు. నా క్షమార్పణ వాడి చెంపమీద పెళ్ళున తగిలింది. తరువాత ఏం జరుగుతుందో ఏమోనని  భయపడి మా అచ్యుతరావు మామయ్యతో చెప్పుకున్నాను.

    '' ఏమీ పరవాలేదురా.  మన అరవ  సోదరులకి  ధైర్యం  అనే వస్తువు  రామేశ్వరం  దగ్గరే నిలబడిపోయింది. వాడు అధికార్లతో ఫిర్యాదు చేస్తే ఎక్కడ నువ్వు సాగదీసి  తంతావో  అని భయం. యిలా కొంచెం కొంచెం  మధ్య మధ్య మనం విజ్రుంభిస్తేగాని  మన  ప్రావిస్సు  మనకు రావొద్దూ!''

    ఈ  చెన్నపట్నములో  మహాభయంకరమైన  దారిద్ర్యం. ఈ  మహా పట్టణారణ్యంలో ఎక్కడో  ఒకమూల  ఏ ప్యాకేజీ పెట్టి  బాపతు  బతుకులో, వీధి తుడవగా  మూల పోగుచేసిన  తుక్కో  నిప్పుచేసుకొని, పొద్దుణ్ణించీ  సాయంత్రందాకా రిక్షాలు లాగి, కూలికి బరువుబండ్లు లాగి, అణా డబ్బులు సంపాదించుకొని  అర్ధణా  బియ్యం  గంజి  కాచుకొని, తక్కిన అర్ధణా డబ్బులతో  జీవిత  పరమావధి  నిర్వర్తించుకొనే  అతికరుణమైన దారిద్ర్యము ''కోటి చేతులు జాపి'' తిరుగుతోంది.

    ఎప్పుడైనా సరదాపుట్టి  తోటి  విద్యార్ధులతో  బజార్ల వెంబడి తిరిగినప్పుడు  నాకు కళ్ళంబట  రహస్యంగా  సుడిగుండాలు  తిరిగేటట్టు  చేసే కుష్టు రోగుల బాధలు, వికలాంగులైన బిచ్చగాళ్ళ కష్టాలూ, గుండె తరుక్కుపోతూ ఉండేవి.

    సాధారణంగా  సినిమాలలోనూ  నవలలు  మొదలైనవి చదువుకోవడంలోనూ  మనస్సు సంతోషంతో గంతులు వేసేది. కథలోని కథానాయకుని  హృదయంలా నా హృదయమున్నూ  సముద్రతీరంలో రాత్రి ఒంటిగా  చీకట్లలో ఉన్నప్పుడు  విచిత్ర  గాంధర్యాలు  ఆలాపించేది.

    నేను ఇంటరు  సీనియరు చదువుకునేటప్పుడు  మా శకుంతల  వ్యక్తురాలయిందని మా అమ్మగారికి  ఉత్తరం వచ్చింది.  ఆ వార్త  నాకు సిగ్గు కలిగించింది. ఎవరికైనా  ఈ వార్త తెలిస్తే  నన్ను  హేళన చేస్తారేమోనన్న భయం. శకుంతల నాకు క్రొత్తదై తోచింది. ఆమె నా ఆలోచనాపధానికి వచ్చినప్పుడు నా కామె  దూరమైపోయిందని   భావించాను. ఇప్పుడామె నాకు స్నేహితురాలు  కాదేమోనని  భయం వేసింది. ఇప్పుడామె సిగ్గు పడుతున్న భార్య అయినది.

    ఆమె నాకు ఉత్తరములు వ్రాయుట మానింది. అది నా కెంతో భాదా,  అశాంతి కలిగించింది. ఈ యేటి  పండుగలకు  వెళ్ళినప్పుడు శకుంతల నన్ను చూచి తుర్రున పారిపోయింది. శకుంతల ఏదని నే నడిగితే  అందరూ నన్ను చూచి నవ్వేవారు. నా స్నేహితురాలైన  శకుంతలకూ, నాకూ ఏదో విచిత్రమైన అడ్డము వచ్చి వాలింది. తెరచాటున నీడగామాత్ర మామెను  నేను దర్శించేవాణ్ని. ఎందుకు ఈ విచిత్రమైన అవమానం నాకని నేను కలతపడిపోయాను.

                                        11

    నాకునూ  హేమకుసుమకునూ  ఈ తీరెన్నాళ్ళు? ఓ  తెరచాటున  మూర్తీ! తేరా  చీల్చబడదా? ఒక్క మహాపవిత్రమైన ప్రేమకు  అతి నీరసుణ్ణయి, తన నీరసత్వానికి లోకాన్ని తిట్టుకునే తిట్టుకునే పాపినై, ఆ నీరసత్వపు  కసిని  కాశీపట్నపు గల్లిలలో  బురదలో తొక్కి పంకిలం చేసుకున్న మూఢుణ్ని నేను. అయినా అత్యంతానందంతో ఈ లోకాన్ని  మహానటనంగా చూడగలుగుతూ ఉన్నాను. చూడలేకా  ఉన్నాను.

    శకుంతలను  మరచిపోలేని నేను, నా శకుంతలను  తన చెల్లెలైన  హేమకుసుమలో  దివ్యలీలా  వినోదినిగా ఆ పవిత్ర  ముహూర్తంలో చూచినప్పణ్ణుంచీ సాక్షిగాను  ఉండలేను, జీవిత సమరోన్ముఖుడనూ  కాలేను. కాని ఏదో మహాశాంతి. ఏదో  దివ్యశీతలము, ఏదో పరమాద్భుత  నన్ను పొదివికొని నా చేతులనుపట్టి ముందుకు తీసుకొని పోతున్నది.


                                                      *        *       *

    నేను  బి.ఏ., జూనియర్  చదువు  పూర్తిచేసి  వేసవికాలంలో  కొల్లిపర వచ్చినప్పుడు  నాకు  పందొమ్మిదవ  ఏట, మా శకుంతలకు  పదునాలుగవ ఏటను ఇర్వురకు పునస్సంధాన మహోత్సవం  జరిగింది. ఈ ఏడాదిలో  శకుంతల  అందం సెలయేటి  ఊటలా విజృంభించింది. విశాలమైన ఆమె కళ్ళు  అరమూతలు  వహించినవి. ఆ కళ్ళలో  నిర్వచింపలేని మాధుర్యాలు  నర్తించింనవి. ఆమె మోమున స్నిగ్దత  పరీమళపూరితమైనది. మంచుతో కూడుకొనిన ఫాల్గుణ మాసపు  ప్రత్యూషారుణకాంతిలా అతి ఆర్ద్రత తాల్చినది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS