Previous Page Next Page 
వారధి పేజి 37


                                   4

    పి.యు.సి. పరీక్షా ఫలితాలు  తెలిసిన వెంటనే  వరదరాజుని  బి.యస్ పి..కోర్సులో  చేరేందుకు  అవసరమైన  సన్నాహాలన్నీ  చేయమన్నాడు శివయ్య. మంచి మార్కులతో  పి.యు.సి. పాసైన రాజుకి  అట్టే  చికాకు లేకుండానే  కాలేజీలో  సీటు వచ్చింది. పనిమీద  పట్నం  పోతున్న శివయ్య  కాలేజీ ఫీజు, హాస్టలు ఫీజు  కట్టి వస్తానని  పంట అయివేజుగా  పెట్టి సుబ్బిసెట్టి  దగ్గిర  అప్పు తీసుకున్నాడు.

    అన్నీ  సిద్ధం చేసుకొని  అన్నయ్య  బయలుదేరబోతూంటే, ఎంతగానో  ఆలోచించి  తను గ్రామం వచ్చే ముందు రాఘవయ్య  అన్నమాట  చెప్పేడు రాజు.

    "ఏదో చిన్నపిల్లడివి  ఇబ్బంది పడుతున్నావని  మాట వరసకి  అని ఉంటారు. కాని అదెలా  సాధ్యపడుతుంది, వరదం?" అంది మీనాక్షి.

    సెలవుల్లో వదిన పనిపాట్లు  చేసుకొంటూంటే  దగ్గిర  కూర్చుని, ఆ ఎనిమిదినెలల  కాలంలో  తను పట్నంలో  చవిచూసిన  మంచి, చెడ్డ అనుభూతుల్ని, కలుసుకొన్న  మనుషుల్ని, తెలుసుకొన్న  సంగతుల్ని వివరంగా వర్ణించి చెప్పేడు రాజు. ఆ మాటల్లో  రాఘవయ్యగారి పెద్ద మేడ, వారి గేటు కాపలాదారు ఎర్రయ్య చెప్పిన దెయ్యాల కథ, ఆ ఇంటి ఆవరణలో పులిలా తిరిగే పెద్ద కుక్క, అందాల చిన్నది అనూరాధకు పాటల పోటీల్లో వచ్చిన ప్రయిజులు, ఆ పిల్ల తనతో  మాట్లాడే విధం, ఇంకా ఆమె నవ్వుతుంటే  తళుక్కున  మెరిసే  పలువరుస, బుగ్గపై పడే  అందమైన  సొట్టలు _ అన్నీ  ఉత్సాహంగా  చెప్పేవాడు.

    అనూరాధను గురించి  అంత ఉత్సాహంగా  రాజు చెప్పుతూ వుంటే  చేతిలో పనిని  ఆపి క్షణకాలం  మరిది వంక వింతగా  చూసేది మీనాక్షి. 'తన చిన్న మరిది ఈ ఏడాది ఎంతగా  పెరిగేడు!' అని ఆశ్చర్యపోయేది.  

    "ధనవంతులు  దారిద్ర్యాన్ని అసహ్యించుకొన్నంతగా  ఇంక  దేనినీ  అసహ్యించుకోరు  రాజూ! ఆదరంగా  చూపిన వారి దగ్గిర అవమానం  పొందవలసివస్తే, మనిషికి  మంచితనంమీద  నమ్మకం  పోతుంది.

    "నీ మాటల్నిబట్టి  ఆ కుటుంబం  మంచిదిగానే తోస్తున్నది. ఆ మంచితనానికి  ఎడంగా వుండి అలా నిల్పుకోడమే  మంచిపనిగా  నాకు తోస్తున్నది" అన్నాడు శివయ్య.

    "ఈ విషయంలో  ఒకటికి  రెండుసార్లుగా వారే  ప్రస్తావించేరు కాని, నేనేం అడగలేదే! రమ్మని పిలిచి, పొమ్మన్నారన్న మాట  వారికే  దక్కనిద్దాం. రమ్మని ఆహ్వానిస్తే  రానని  పొగరు  చూపేడన్న  నింద నేనెందుకు  పొందాలి?"

    "గౌరవంగా  గడిచినంతకాలం  గడుస్తుంది. ఎప్పుడు వారికి, మనకి సరిపడకపోతే  అప్పుడే  ఇంకొక మార్గం  చూసుకోవచ్చు" అన్నాడు రాజు.

    ఆ పెద్ద మేడ, అందులోని సదుపాయాలు  వరదరాజుని  బాగా ఆకర్షించేయని  ఆ దంపతులు  తెలుసుకొన్నారు. కాదని వారిస్తే  తమ మాట ఎలా  అర్ధం చేసుకొంటాడో? గడుస్తున్న ప్రతి రోజూ  మనిషికో పాఠం నేర్పుతుంది అంటారు. ఆ పాఠం  అనుభవంమీద  తనే నేర్చుకొంటాడు రాజు  అనుకొన్నారు.

    "వారిపట్ల  నీ కంత  గౌరవమర్యాద లుంటే  వద్దని  వారించవలిసిన  అవసరం ఏముంది, రాజూ? అక్కడ  వుండవలిసినవాడివి  నువ్వు. నీకు నచ్చితే  ఇంకేం కావాలి?"

    "అయితే మరి హాస్టలుకి సొమ్ము  కట్టను. బస అక్కడ  కుదిరిపోతే  భోజనం  ఏ హోటల్లో అయినా  చేయవచ్చు" అన్నాడు శివయ్య.

    'ఆ సుందర భవంతిలో తనకోసం  ఏ గది  కేటాయిస్తారా?' అని ఆలోచిస్తున్నాడు వరదరాజు. ఆ ఇంటిలో  నౌకర్లకోసం  కట్టిన గదులు కూడా  ఎంతో  నీటుగా, అందంగా వున్నాయి, ఇంక  ఆ మేడలో  తనకి ఏ మారుమూల  గది ఇచ్చినా  హాస్టలు గదిని  మించి  వుంటుందనడంలో  సందేహం లేదు. ప్రశాంతమైన  ఆ వాతావరణంలో  తన మనసుకి  నచ్చినంతసేపు  చదువుకోవచ్చు. అడ్డుపెట్టేవారు, అల్లరిచేసేవారు  వుండరు. రాఘవయ్యగారి  కారులు ఏదో పనిమీద  పట్నంలో  ఇటూ అటూ తిరుగుతూనే  వుంటాయి. కాలేజీ టైము  కాని వేళల్లో  అటు పోతుంటే  హాయిగా కారులో పోవచ్చు. ఊహల దొంతర్లలో  ములిగిపోయి  మధ్య మధ్య సందుల్లోంచి  రమ్యమైన ఆ జీవితాన్ని  చూస్తున్నాడు  వరదరాజు.

    మరిది కళ్ళల్లో  కదలాడుతున్న  సుందర  దృశ్యాలను, కాంక్షలను వింతగా  చూసింది మీనాక్షి. 'భగవంతుడా, ఇతడు ఎక్కబోతున్న  నిచ్చెన కాళ్ళు నేలకి సరిగా  ఆనివుండేలా  చూడు,' అనుకొంది.



                           *    *    *


    ఎప్పుడు కాలేజీలు తెరుస్తారా  అని ఎదురు చూసేడు  వరదరాజు. మరిది ముందు సంవత్సరం కాలేజీకి పోయేముందు చేసిన హంగామా, వారం తిరగకుండా  తిరిగివచ్చిన తీరూ గుర్తుకువచ్చి చిన్నగా  నవ్వుకొంది  మీనాక్షి. ఈసారి పట్నం పోయేందుకు రాజు  రోజులు  లెక్కించడం  చూసి ఆమె మనసులో  ఏదో బాధ  కలుక్కుమంది.

    ఇంతకాలం  తను వరదుడి  చుట్టూ  మమకారం  అనే వల పన్ని  అతడిని ఎటూ కదలనీయకుండా  బంధించి  వుంచింది. ఇప్పుడు నాలుగు తరహాల మనుషుల్ని చూసి, బ్రతుకులో  దేని కెంత విలువ  ఇవ్వాలో  తెలుసుకొంటున్నాడు. దానికోసం  తను ఆరాటపడవలసిన  అవసరం లేదు అనుకొంది.

    రెక్కలు రానంతకాలం  తల్లి  పక్షి  పిల్లలకోసం  ఆరాటపడుతుంది. రెక్కలు జాడించి పిల్ల ఎగరనేర్చిన తరవాత, అది ఎగిరే  మార్గం గురించిన  బెంగ తల్లి పక్షి  కుండదు. ఎగర నేర్చిన పిల్ల  తన గమ్యాన్ని  సులువుగానే  నిర్ణయించుకోగలదని  దానికి  ధైర్యం.

    "వెళ్ళి వస్తాను, వదినా!" సామాన్లు బండిలో సర్ది, గుమ్మం ముందు నిలబడ్డ  వదినతో  అన్నాడు వరదరాజు. 
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS