'మీ పెద్దాడుబిడ్డ ఒకటే వడవడ వాగుతూ వుంటుందేమిటే! నన్నూ, లలితనూ, సరోజినినీ కూచోబెట్టి వేదాంతం బోధించడం మొదలుపెట్టింది. రెండో ఆవిడ మన కుటుంబం సంగతులు అన్నీ ఆగడం మొదలుపెట్టింది. అస్తమానం ఈ చెవినుంచి ఆ చెవికి నవ్వుతూనే వుంది ఆవిడ.
లలిత: వాళ్లు చిన్నబుచ్చుకునేటట్లుగా మనం గబుక్కున లేచేవచ్చాంగా!
సరోజిని: ఏమే శకుంతలా! నీకు వేళాకోళాలు వెక్కిరింతలూను. వాళ్ళూ మనమల్లేనే గౌరవం సాంప్రదాయం కలిగిన కుటుంబాలు. అందరికీ జమిందారీలు ఉంటాయా ఏమిటే? దేశమంతా గాలించినా గుడిగుడి గుంచంలా ఒక పది జమిందారీ కుటుంబాలున్నాయి. మీ నాన్నగారికి పదిమంది కూతుళ్లు పుడితే అందరికీ జమిందారీ సంబంధాలు ఎక్కడ తీసుకువస్తారే?
శకుంతల: నువ్వెప్పుడూ అందర్నీ హాస్యం చేస్తూనే వుంటావు. జమిందారీలు వుండకపోవచ్చును గాని ఎక్కడో పల్లెటూళ్ళ పద్ధతిలా వుంది అనరుటే.
ఇంతలో సూర్యకాంతం అక్కడకు వచ్చుటచే వారి సంభాషణ ఆగిపోయింది. సూర్యకాంతం చిన్నన్నగారిని వెర్రి ప్రేమతో ప్రేమించినది. తల్లిదండ్రులు, అక్కలు, పెద్దన్నయ్యలు ఎందరున్నను నారాయణ క్షణము కన్పించకున్న సూర్యకాంతం బెంగపెట్టుకొనును. చిన్ననాటినుండియు సూర్యకాంతమును నారాయణరావే పెంచినాడన్న నిసుమంతయు నసత్యము లేదు. ఆమె కించుకంత దెబ్బతగిలిన 'చిన్నన్నయ్యా' అని యేడ్చునది. అన్నగారి దగ్గరనే పండుకొనును. అన్నగారితోనే భోజనము చేయును. ఆమెకు రామస్మరణ 'చిన్నన్నయ్య! చిన్నన్నయ్య!' చిన్నన్నగారు చదువులకై అమలాపురం, రాజమహేంద్రవరము, చెన్నపట్టణము వెళ్ళినప్పుడు, జైలుకు పోయినప్పుడు సర్వదా గ్రుడ్లనీరు బెట్టుకొనునది. రాజమహేంద్రవరము జైలున అన్నగారిని చూచుటకు వెళ్ళినప్పుడు నారాయణరావు జైలరు ననుమతి నడిగి చెల్లెలిని దగ్గరకు దీసుకొని చెవిలో దేశభక్తిని గూర్చియు, ధైర్యమును గూర్చియు చిన్న ఉపన్యాసము నిచ్చినాడు. ఆమె విచారించినచో శ్రీ మహాత్మాగాంధీవారి హృదయము బాధనొందుననియు, తన ముద్దుల చెల్లెలు బెంగ పెట్టుకొని ఇంటిదగ్గర కండ్లనీరు నింపుచున్నదని తెలిసినచో తన మనస్సు వికలమైపోయి జైలు భరించుట కడు దుర్భరమగుననియు, తన ముద్దుల చెల్లెలు తనను దేశద్రోహి వలె జైలువదలి రమ్మని కోరునంతటి దేశభక్తి లేనిది కాదనియు జెప్పి, యూరడించినాడు. అప్పుడు సూర్యకాంతము కళ్ళనీళ్ళతో చిరునవ్వు నవ్వింది. ఆమె వదనము వాన కురిసి వెలిసి మబ్బులు మాయమైన పూర్ణిమాకాశమువలె సౌందర్యశోభితమైనది.
అట్టి ప్రేమపూర్ణమగు నామె హృదయము తన చిన్నన్నగారి పెండ్లి కుమార్తెను జూచినప్పుడెల్ల బరవశత్వములో నుప్పొంగిపోవును. తన చిన్న వదినగారెంత యందగత్తె! ఏమి సొగసు! అంత సంగీత పాటకురాలెక్కడైనా యున్నదా? చిన్న వదినను కౌగలించుకో బుద్ధిపుట్టినదాబాలకు. పెండ్లి అయిదురోజులు వీలయిన వేళలలో నొక్క నిమిషమైన కొత్తవదిన గారిని విడిచి యామె యుండలేదు. ఆమెకు దాను తలదువ్వును. ఆమె తలలో పూవులు ముడుచును. ఆమె నగలు సర్దును. ఆమె యొడిలో దనతల నుంచును. ఆమె దగ్గరగా గూర్చుండును. 'వదినా! నువ్వు చాలా అందగత్తె'వనును. శారదకిదియంతయు వెఱ్ఱిగా అనిపించినది. సూర్యకాంతమును వెఱ్ఱిపిల్లయని యనుకొన్నది. కాని సూర్యకాంతం ప్రేమప్రవాహవేగమున శారద యుపేక్షా భావము చెదరగొట్టబడి కరిగిపోయినది. భర్తృబంధుకోటిలో సూర్యకాంత మొకర్తే యామె హృదయములో ప్రవేశించినది.
సూర్యకాంతము వదినగారికడ కరుదెంచి 'చిన్నవదినా! మా గుమ్మడిపండావును జూపిస్తానన్నాను కదూ? నువ్వు దాని అందం చూస్తే వదలలేవు సుమా. రా! అప్పుడే పొలాల నుంచి మా ఆవులు, గేదెలు, బండి యెద్దులు వచ్చాయి. తక్కిన పశువులన్నింటినీ మా తోటలో పశువులశాలల్లోనే కట్టేశారు. వస్తావా?' అని యడిగినది. ఆ సాయంత్రము చల్లని గాలులు వీచుచు మల్లెమొగ్గల సౌరభమెల్ల యెడల జల్లుచుండెను. నిన్ననే సూర్యకాంతం వదినగారికి తమ ఇంటివెనుక తోట జూపించినది. మల్లెజాతులు, సన్నజాజులు, గులాబుల కుటుంబములు, సంపంగెలు, జాజులు, మందారముల రకములు, ఏవేవో కొత్తరకముల పూవులు దొడ్డియంతయు నావరించి బారులుతీర్చి గీతములు పాడుకొనుచున్నవి. నారాయణరావుకు తోటపనియన్న ప్రాణము. తాను సెలవలకు వచ్చినప్పుడు కొత్తకొత్త రకముల పూలచెట్లు నాటుచుండును. అంట్లుకట్టుట చిరుగులనంటుకట్టుట, కొమ్మలు కత్తిరించి వానికి జీవము పోయుట, మొక్కలలో క్రొత్త జాతులను సృజించుట మున్నగు పనులు అతడు అవలీలగా జేయగలడు. అతనికి స్నేహితులు తోటమాలి యనికూడ పెరుపెట్టినారు.
అతడు మొక్కలతో మాట్లాడుకొనును. అతని హస్తస్పర్శకు, జల్లని మాటలకు జెట్లు సంతోషమున బొంగిపోవును. 'బోసు చెప్పినదానిలో ఇంతైనా అతిశయోక్తి లేదురా' అని స్నేహితులతో ననువాడు నారాయణరావు. గ్రాండిఫ్లోరా పూలచెట్లొక వరుసయును, చామంతి జాతులొక బారును లెజిస్త్రోమియాలు వివిధ వర్ణముల పూలతో నొకవంకను కళకళలాడిపోవుచున్నవి. ఇంకను నేవేవో రకముల పూలట! భరత ఖండములో నెక్కడ పెరుగునదియైన నారాయణరావు దానినెంత ఖరీదునకైన తెప్పించి తోటలో పెంచుచుండును.
సింహాచలము సంపెంగలు_పచ్చ, తెలుపు జాతులవి కలవు. కనంగ సంపెంగ, కర్పూర సంపెంగ, సకలగుణ సంపెంగ, తీగ సంపెంగ యతని ముద్దుబిడ్డలు., ఎడ్వర్డు, కార్లెన్ డిఆర్డెను, ధవళమగు నమెరికా సుందరి, పాలెనీరాను మొదలగు నెనుబది రకముల గులాబుల ప్రాణప్రదముగా బెంచినాడు. బొడ్డుమల్లె, జంటమల్లె, పొదమల్లె, పందిరిమల్లె, చిరుమల్లె, కాకినాడ మల్లెలు నక్షత్రము వలె విరిసి యతని కన్నుల నార్ద్రములు సేయును. చెన్నపట్టణపు బొడ్డు చేమంతి, తెల్ల చేమంతి చిన్నది, సాదారకము బొత్తాము చేమంతి, నీలపు చేమంతి, ఎర్ర చేమంతి, అరచేతి పెద్దజాతి చేమంతులు నతని జీవితమున దీపులూరజేయును. కదంబము కలదు. పన్నీరు వృక్షములున్నవి. దేవపారిజాతములున్నవి, పూవుదానిమ్మలున్నవి.
సూర్యకాంతము చిన్నన్నగారి యుత్సాహములో తానును మునిగిపోవును. అన్నగారు చదువునకు పోయినప్పుడు తోటమాలితనము తన్నావరించినట్లు భావించుకొనును. తోటమాలులచే నీరు పోయించును. ఇవక పట్టనీయక కాపాడునట్లు చేయును. ఉద్యానవన బాలికయై యన్నగారి యాజ్ఞ పాలింపుచుంటినని గర్వమునొందును. ఆమె వనదేవతయే అయిపోవును.
శారద యా వనము చూచి ఆశ్చర్యమందెను. కొంచె మసూయ ఆమె లేత హృదయము నలమినది. ఆనాడు బాలికలిద్దరు వనసంచార మొనర్చునప్పుడు నారాయణరావు చూచినాడు. అతని బ్రతుకప్పుడు సువాసనాలహరీస్నాతయైనట్లయినది. ఆ ఇరువురు బాలికలను తన ఇరుసేతులనెత్తి ముద్దాడ నువ్విళ్ళూరినాడు. ప్రపంచఅంతయు నతనికి ప్రేమస్నాతమయినట్లు తోచినది.
చల్లని యడుగులతో వారిరువురనతడు చూసి 'సూరీడూ! ఈ తోటంతా చూపిస్తున్నావుటే' అని పలకరించినాడు. పలుకరించి, తన చొరవకు తానే యక్కజంపడినాడు.
కులుకుమిటారియగు తన శారదతో మాటలాడవలెనని పెండ్లి రెండవనాడే యతనికి గోర్కె వొడమినది. కాని సిగ్గుపెంపున మాటలాడింపలేడయ్యెను. ఎట్టి సభలోనైన పులకలు పుట్టించు గంభీర స్వరమున నుపన్యాసము లిచ్చు నారాయణరావాముహూర్తమున త్రపావశుడైనాడు. మరునాడుదయమున మోటారులో భార్యాసమేతుడై యూరేగునప్పుడు 'నీకు కాలేజీలో చేరి చదవాలని ఉన్నదా'యని యెట్లో ప్రశ్నించినాడు.
శారద యాశ్చర్యపూరితయైనది. ఆమెకు నాగరిక మర్యాదలన్న నెంతయు నిష్టమే. తానంతకుముందు చూడబోయిన వివాహములందు నూతన వధూవరులు మాటలాడుకొనుట చూచినది. సంతోషము నొందినది. అటులనే తానును మాటలాడగలనని తలంచి లజ్జాకవోష్ణమై మోము కెంపెక్క జిరునవ్వు పెదవులు దాటకుండ నప్పలించుకొన్నది. నేడు భర్త తన్నట్లు మాట్లాడించునని యామె కలనైన తలపోయలేదు. తొలినాడు తన్ను జూడవచ్చిన నారాయణరావును నిర్భయముగా జూచినది. అప్పుడప్పుడే పరిమళమలముకొను హృదయమున నారాయణరావును మెచ్చుకొన్నది. అతని రూపసంపద శారద మనస్సును గలకలలాడించినది. నారాయణరావు ఫిడేలుపై మధురముగా గానము చేసినప్పుడాశ్చర్యము, నానందము నామె నలముకొనియెను.
సంబంధము నిశ్చయమైనదని తెలిసినప్పటి నుండియు దల్లియగు వరదకామేశ్వరీదేవి శారద చెవికాడ నిల్లుగట్టుకొని విచారించినది. పల్లెటూరి సంబంధము ఘటించిన భగవంతుని తీవ్రముగా దూలనాడినది. తనకును శారదకును గ్రహచారమున్నట్లున్నదని కంటనీరు పెట్టుకొనినది. చుట్టములలో స్త్రీలు ఒకరిరువురు తప్ప మిగిలిన వారట్టి సంబంధము నిశ్చయమైనందున కక్కజమందుచు వరదకామేశ్వరీదేవితోపాటు విచారించినారు. ఆ సంబంధమును నిందించినారు.
