మహత్వ కవిత్వ పటుత్వం
వాసిరెడ్డి కళాశాల వాసిగన్న అందాలబాల
ధరణి కోట తోటలో తయారైన సురభిళ గులాబీల మాల. నాకీ అమరావతి, ధరణికోటలు ఎంతో ప్రియమైనవి. మీ ప్రిన్సిపాలు గారు మాకు చిరకాల మిత్రులు.
నవ్వులాటకైన రవ్వంత తడబాటు
పొలుగారు ప్రిన్సిపాలుగారు;
కమ్మదనముచిమ్ము నోమ్మోము గలవారు
పోలుగారు ప్రిన్సిపాలుగారు.
అందుచేత మీ ఆహ్వానం కాదనటానికి వీలులేనిది. "20 వ శతాబ్దపు తెలుగు కవిత్వం ' గూర్చి గోష్ఠి అన్నారు. ఇది మంచి ఆశయం. భారతదేశంలో కవిత్వం, కవిత అనే మాటలను వాడేవారు సంస్కృతాన్ని దాని సహకారాన్ని మరచిపోగూడదు. గతంలోని సాహిత్య సంపదను గుర్తు చేసుకుంటూ ఆధునికులు ముందుకు సాగిపోవాలి. ప్రాచీన సాహిత్యంలో ఎందరో మహానుభావులు అమూల్యరచనలు చేశారు . వాటి బలం గూడమనకు అవసరం.
రాణ్మహేంద్రకవీంద్రు రతనాలమేడలో
పసిడిగిన్నెల గుమ్మపాలు ద్రావి
సోమయాజుల గృహరామసీమలయందు
అల్లారు ముద్దుగా నాటలాడి
శ్రీనాధుని సువర్ణ సీసమాలికలలో
హాయిగ తూగుటుయ్యాల లూగి
భాగవతులవారి లోగిళ్ళలో మెత్త
మెత్తని శయ్యల నోత్తిగిల్లి
విజయ విద్యానగర రాజవీధులందు
దిగ్గజంబుల మీదనే తిరిగి తిరిగి
కంచు జయభేరి దిశల మ్రోగించుకొన్న
ఆంధ్ర కవితా కుమారి! జయోస్తు నీకు.
ఆధునిక సాహిత్యపు సొగసులను దిద్దినవారిని స్మరిద్దాం
జడవేసి 'జడకుచ్చు' లిడగ రాయప్రోలు
గురజాడ ముత్యాల సరము వెయ
పింగళి కాటూరి ముంగురుల్ సరిదిద్ద
దేవులపల్లి శ్రీతిలకమిడగ
విశ్వనాధ వినూత్న గతుల కిన్నెరమీట
తుమ్మల రాష్ట్రగాన మ్మొనర్ప
వేదుల నాయని వింజామరలు వీవ
బసవరాజు కొడాలి పదముపాడ
జాషువా ఏటుకూరి దాశరధి మరిసి
నా.రె. అరుద్ర కుందుర్తి చేరి కొలువ
తిలకు శ్రీశ్రీలు విజయగీతికలు చదువ
ఆంధ్ర భారతి! దీర్ఘాయురస్తు నీకు.
తెలుగు కవితాప్రశస్తిని గురించి ఈ పద్యాలలో చెప్పుకున్నాం. తెలుగుబాష మనకే కాదు. అనేక మందికి ప్రీతి పాత్రమయినది. ప్రపంచంలోని గొప్ప భాషలలో తెలుగు మూడవది అన్నారు శ్రీ ఉన్నవలక్ష్మీ నారాయణగారు. మొదటిది ప్రపంచవాప్తమయింది ఇంగ్లీషు. తర్వాత స్థానం సంస్కృతానిది. మూడవది తెలుగు. ఎందువల్ల? తెలుగు పద్యం చదువుతుంటే తెలుగు పాట వింటుంటే ఏదో సంగీతం వినిపిస్తుంది. తెలుగున కన్న అక్లిష్టత, సౌందర్యం మరే బాషకు లేదు. అనేక భాషలు తెలిసిన శ్రీకృష్ణదేవరాయలవారే "దేశభాషలందు తెలుగు లెస్స" అన్నారు. హిమాలయం అంత ఎత్తు మనిషి అప్పయ్య దీక్షితుల వారు. జన్మతః తమిళుడు. అయన "ఆంధ్రత్వం ఆంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్ " అన్నాడు. తమిళ నవయుగప్రవక్త సుబ్రహ్మణ్య భారతి ఏమన్నాడు? నిండుపున్నమినాడు , పండు వెన్నెల్లో తియ్యని తెలుగు పాటలు వింటూ మలయాళ బాలికల మధ్య కూర్చొని సింధూ నదిలో షికార్లు చెయ్యాలని ఉంది" అన్నాడు. - తెలుగు భాషా ప్రశస్తి ఎంతటితో ఈ ,ఆహానుభావులందరూ చెప్పారు.
తెలుగు కవిత్వం యెట్లా ఉండాలి? కవిత్వం గూర్చి ప్రాచీనులూ చెప్పారు. ఆధునికులు చెప్పారు.
కలువలు పూచినట్లు చిరుగాలులు చల్లగ వీచినట్లు క్రో
వ్వలపులు లేచినట్లు పసిపాపల చేతులు చాచినట్లు తీ
వలు తలలూచినట్లూ చేలువల్ కడకన్నుల చూచినట్లు ఆ
త్మలు పెనవైచినట్లు కవితల్ రచియింతురహూ! మహాకవుల్.
కవిత్వం ఏదయినా సరే అది హృదయస్పందనం కలిగించాలి. "నేను రోజూ రోడ్డు మీద నాశవాన్ని పదహారు సార్లు చూస్తున్నాను." అన్నాడొక కవి. ఎన్ని శవాల్ని చూస్తె మాత్రం పాఠకునికి ఎందుకది? కవిత్వం ఇతరులను ముందుకు నడిపించేది. ప్రతిస్పందింపచేసేది. అయి ఉండాలి. అంటే ఆ కవిత్వం పాఠకునికి అర్ధం కావాలి ముందు. కవిత్వపు కళ తగ్గకుండా పద్యం పాట, వచన కవిత్వం ఏది వ్రాసినా సరే అది అర్ధం కావాలి. కృష్ణానది నిండుగా ప్రవహిస్తుంటే అంతర్గతంగా ఉన్నలయ వలె కవిత్వానికి ఒక అంతర్లయ ఉండాలి. తన అందమైన అనుభవాన్ని అందంగా చెప్పగలగాలి. "మధురం మధురాక్షరం" అన్నారు వాల్మీకి మహర్షిని గురించి.
దండి అనే అలంకారికుడు "ఇషార్ధవ్యచ్చిన్నా పదావాళీ" అన్నాడు చెప్పదలచుకొన్న అర్ధాన్నీ చక్కగా చెప్పగల పదములతో కూడినది కవిత్వం అన్నాడు. "వాక్యం రసాత్మకం కావ్యం" అన్నాడు మరొక అలంకారికుడు. చెప్పిన వాక్యం రసవంతంగా ఉండాలి. ప్రతి వాక్యంలోనూ రసం ఉంటుందా అని చర్చ వచ్చింది. అందుకని జగన్నాధ పండితుడు "రమణీయార్ద ప్రతిపాదక శబ్దః కావ్యమ్" అన్నాడు. శబ్దములు, అర్ధములు, కూడా రమణీయంగా ఉండాలని చెప్పాడు. రమణీయం అంటే ఏమిటీ అని చర్చించారు. "క్షణేక్షణే యన్నవతా యుపయితి తదేవరూపం రమణీయతా" క్షణక్షణం నూతనత్వంలో కనిపించేది కావాలి.
భావకవులు, అనుభూతికవులు, విప్లవ కవులు ఎవరయినా సరే పై సాహిత్యగుణాలను విడవనంతవరకు సహృదయులకు ఆమోదయోగ్యులే. డాడాయిజం, అధివాస్తవికత మొదలయిన విపరీత వాదాలను సహృదయులు మెచ్చరు. అందుకనే తర్వాత అవి ఆగిపోయాయి.
