2021 సంక్రాంతి.. మల్టీస్టారర్ మయం!
on Mar 23, 2020
సంక్రాంతి అంటేనే క్రేజీ ప్రాజెక్ట్స్కి కేరాఫ్ అడ్రస్. ఇక మల్టీస్టారర్ అంటే స్టార్ హీరోల కాంబినేషన్కి కేరాఫ్ అడ్రస్. అలాంటి సంక్రాంతి, మల్టీస్టారర్.. రెండూ కాంబినేషన్ కడితే.. థియేటర్లంతా కాసుల గలగలతో కళకళలాడతాయి. జనరల్గా సంక్రాంతికి ఒక మల్టీస్టారర్ వస్తేనే.. ఎంతో కనువిందుగా ఉంటుంది. అలాంటిది మూడు మల్టీస్టారర్స్ సందడి చేస్తే.. అది 2021 ముగ్గుల పండగలా ఉంటుందేమో! ఎందుకంటే.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఏకంగా మూడు బహు కథానాయకుల చిత్రాలు వినోదాలు పంచే అవకాశం కనిపిస్తోంది మరి.
అందులో ఒక మల్టీస్టారర్ ఏమో ఒకే తరానికి చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులతో రూపొందుతుంటే.. మరొకటేమో ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల కథానాయకుల కలయికలో రానుంది. ఇంకొకటేమో రెండు వేర్వేరు కుటుంబాలు, తరాలకు చెందిన హీరోల కాంబోలో తెరకెక్కనుంది.
కాస్త వివరాల్లోకి వెళితే.. 2021 సంక్రాంతికి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న సిసలైన మల్టీస్టారర్ 'ఆర్ ఆర్ ఆర్' రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ జనరేషన్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ కలసి నటిస్తున్న ఈ బడా మల్టీస్టారర్ జనవరి 8న విడుదల కానుంది.
ఇక అదే సమయంలో 2016 సంక్రాంతి విజేత 'సోగ్గాడే చిన్ని నాయనా'కి సీక్వెల్ గా రూపొందుతున్న 'బంగార్రాజు'ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్య.. 'మనం' తరువాత కలసి నటించబోతున్నఈ మల్టీస్టారర్ జూన్లో ప్రారంభమై 2021 పొంగల్కి రిలీజవుతుందని ప్రచారం సాగుతోంది.
అలాగే 2019 సంక్రాంతి విన్నర్ 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా రాబోతున్న 'ఎఫ్ 3' కూడా వచ్చే పొంగల్కి థియేటర్లలో సందడి చేసే అవకాశముందని వినిపిస్తోంది. తొలి భాగంలో నటించిన వెంకటేశ్, వరుణ్ తేజ్.. ఈ కొనసాగింపు చిత్రంలో కూడా వినోదాలు పంచనున్నారు. సో.. 'ఆర్ ఆర్ ఆర్' జనవరి 8న రానుంటే.. ఆ తరువాతి వారంలో 'బంగార్రాజు', 'ఎఫ్ 3' విడుదలయ్యే అవకాశముందన్నమాట. మరి... ఈ మూడు మల్టీస్టారర్స్లో దేనికి జనం పట్టం కడతారో చూడాలి.