గుండు కొడుకును తన కొడుకుగా చేసుకున్న బ్రహ్మీ
on Feb 22, 2018
ఫ్రెండ్షిప్ అంటే కలిసి సినిమాలకి వెళ్లడం.. కబుర్లు చెప్పుకోవడం.. కాదు. స్నేహితుడి కష్టాన్ని తన కష్టంగా చేసుకున్నప్పుడే అది నిజమైన ఫ్రెండ్షిప్. దశాబ్ధాల పాటు తెలుగు ప్రేక్షకులని నవ్వించిన గుండు హనుమంతరావు మొన్న అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా హనుమంతరావు ఇంటికి వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి.. కాసేపు అక్కడే ఉండి జరగాల్సిన కార్యక్రమాన్ని నిర్వహించి.. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
తల్లిదండ్రులు, తోబోట్టువు అందరూ కాలం చేయడంతో... ఒంటరిగా అనాథలా మారిన గుండు హనుమంతరావు కొడుకు ఆదిత్యని అందరూ ఓదార్చారు కానీ.. ఎవ్వరూ ఆ కుర్రాడి భవిష్యత్తు ఏంటన్నది పట్టించుకోలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అక్కడికి వచ్చిన బ్రహ్మానందం తన స్నేహితుడి మృతదేహాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన్ను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
ఆ సమయంలో నిర్జీవంగా పడివున్న తండ్రి భౌతికకాయం వద్ద ఏడుస్తున్న.. ఆదిత్యను చూసి బ్రహ్మానందం మనస్సు తట్టుకోలేకపోయింది. తన మిత్రుడి కొడుకు అనాథగా మిగలటానికి వీలు లేదని ఆ క్షణంలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆదిత్యకు తండ్రిలా మారాలని నిర్ణయించుకున్నారు. ఆ కుర్రాడి చదువు, పెళ్లి వంటి బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటానని ప్రకటించి.. తన మిత్రుడికి నిజమైన శాంతిని చేకూర్చారు. బ్రహ్మానందం ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.