ఇప్పట్లో కొత్త దర్శకులతో చేయను: నాగచైతన్య
on Dec 11, 2019
వరుసగా రెండు మూడు విషయాలు వచ్చి, కెరీర్ కుదురుకునే వరకు కొత్త దర్శకులతో సినిమాలు చేయనని అక్కినేని నాగచైతన్య తెలిపారు. ఒక ప్లాన్ ప్రకారం తాను ఈ రిస్క్ తీసుకుంటున్నానని ఆయన అన్నారు. మేనమామ వెంకటేష్ తో కలిసి నాగచైతన్య నటించిన చిత్రం 'వెంకీ మామ'. ఈ నెల 13న విడుదల కానుంది. మామ అల్లుళ్ళు కలిసి నటించిన తొలి మల్టీస్టారర్ కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే... తాను ఈ చిత్రాన్ని మల్టీస్టారర్ గా చూడటం లేదని నాగచైతన్య అంటున్నారు.
సినిమా విడుదల దగ్గర పడిన తరుణంలో నాగచైతన్య మాట్లాడుతూ "సురేష్ మామ నా కోసం కథలు పంపిస్తూ ఉంటారు. ఇప్పటివరకు 10, 20 కథలు పంపారు. ఏవి మెటీరియలైజ్ కాలేదు. 'వెంకీ మామ' కథ నచ్చింది. రచయిత జనార్ధన మహర్షి గారు చెప్పిన కథలో దర్శకుడు బాబీ చాలా మార్పులు చేశారు. నాకు మొదట కథ చెప్పినప్పుడు సర్జికల్ స్ట్రైక్ కాన్సెప్ట్ లేదు. తర్వాత నా క్యారెక్టర్ మార్చారు. జ్యోతిష్యం, విధి నేపథ్యంలో... మామ అల్లుడు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ లో ఎక్కువ చూపించలేదు. ప్రేమ కథల గురించి అవగాహన కల్పించామంతే. ప్రేక్షకులను ఈ సినిమా సర్ ప్రైజ్ చేస్తుంది" అన్నారు. ఈ చిత్రాన్ని తాను ఒక మల్టీస్టారర్ లా చూడడం లేదని నాగచైతన్య అన్నారు. "వెంకీ మామ అభిమానిగా... ఆయన చిత్రంలో నేను ఒక క్యారెక్టర్ చేశానని మాత్రమే అనుకుంటున్నాను" అని నాగచైతన్య అన్నారు.
కొత్త దర్శకులతో ఇప్పట్లో సినిమాలు చేయకూడదని తీసుకున్న నిర్ణయం గురించి నాగచైతన్య మాట్లాడుతూ "కొత్త దర్శకులకు నేను వ్యతిరేకం కాదు. కొంతమంది కొత్త దర్శకులతో సినిమాలు చేశాను కూడా. అవి వర్కవుట్ కాలేదు. అందుకు నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. అనుభవజ్ఞులైన దర్శకులు అయితే... నా నుండి చక్కటి నటన రాబట్టుకోవడంలో సక్సెస్ అవుతారని అనుకుంటున్నా. రెండు మూడు విజయాలు వచ్చిన తర్వాత మళ్లీ కొత్త దర్శకులతో చేస్తా" అన్నారు.
Also Read