మహేశ్ - వంశీ పైడిపల్లి మూవీ ఆగిపోయింది!
on Feb 22, 2020
ఇది టాలీవుడ్లో లేటెస్టుగా చక్కర్లు కొడుతున్న గాసిప్! 'సరిలేరు నీకెవ్వరు' మూవీ షూటింగ్లో ఉండగానే 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరో సినిమా చెయ్యడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వంశీ చెప్పిన స్క్రిప్టు మహేశ్కు బాగా నచ్చిందనీ, అందుకే 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మరోసారి వంశీతో కలిసి పనిచెయ్యాలని మహేశ్ నిర్ణయించుకున్నాడనేది మనకు తెలిసిన వార్త. అనిల్ రావిపూడి డైరెక్ట్ చెయ్యగా సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచి వరల్డ్ వైడ్గా రూ. 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
ఆ సినిమా రిలీజ్ తర్వాత మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకొని అప్పుడు వంశీ పైడిపల్లి సినిమా మొదలు పెడతానని మహేశ్ స్వయంగా ఇంటర్వ్యూల్లో తెలిపాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపిస్తోంది. వంశీ చెప్పిన ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ మహేశ్ను ఇంప్రెస్ చెయ్యలేదనీ, అందువల్ల ఆ ప్రాజెక్టును ఆపుదామనీ అతను వంశీతో చెప్పినట్లు ప్రచారం మొదలైంది. నిమిషాల వ్యవధిలో ఈ ప్రచారం సోషల్ మీడియాను చుట్టేసింది. ఒకవేళ ఈ ప్రచారమే కనుక నిజమైతే, ఇటీవలి కాలంలో తాను మొదట ఓకే చేసిన ప్రాజెక్టును క్యాన్సిల్ చెయ్యడం మహేశ్కు ఇది రెండోసారవుతుంది.
వాస్తవానికి మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' ప్లేస్లో సుకుమార్తో సినిమా చెయ్యాల్సింది. కానీ స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆ ప్రాజెక్టును మహేశ్ వదిలేసుకొని, అనిల్ రావిపూడితో సినిమా చేశాడు. ఇప్పుడు అదే తరహాలో వంశీతో ప్రాజెక్టును అతను వదులుకుంటున్నాడనీ సమాచారం. వంశీ ప్రాజెక్టుకు బదులు పరశురామ్ తో సినిమా చెయ్యడానికి మహేశ్ ఆసక్తి చూపుతున్నాడని వినిపిస్తోంది. అయితే ఇప్పటికే నాగచైతన్యను డైరెక్ట్ చెయ్యడానికి పరశురామ్ రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో దాన్ని వదులుకొని అతను మహేశ్తో సినిమా చెయ్యడానికి ముందుకు వస్తాడా?.. అనేది సస్పెన్స్గా మారింది. మరోవైపు 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కొంతకాలం క్రితం ప్రశాంత్ చెప్పిన సబ్జెక్ట్ మహేశ్ను పూర్తి స్థాయిలో ఇంప్రెస్ చెయ్యలేదు. ఇప్పుడు దాన్ని మార్చి తీసుకువచ్చి మహేశ్కు మరోసారి వినిపించాడనీ, మహేశ్కు ఈ రివైజ్డ్ వెర్షన్ నచ్చిందనీ అంటున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ ఏ డైరెక్టర్తో తన తదుపరి మూవీ చెయ్యనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.