'బిగ్ బాస్ 3' గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్! ఆ ఐదుగురిలో ఎవరు విన్నర్?
on Nov 1, 2019
వంద రోజులుగా టీవీ వీక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తోన్న వివాదాస్పద గేమ్ షో 'బిగ్ బాస్ 3' ముగింపుకు వచ్చేసింది. అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న ఈ సీజన్ విన్నర్ ఎవరో నవంబర్ 3న తేలనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా వస్తున్నారనే స్పెక్యులేషన్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. స్టార్ మా యాజమాన్యం ఈ విషయాన్ని ధృవీకరించకపోయినా, చిరంజీవి రావడం ఖాయమనే విషయం విశ్వసనీయ వర్గాలను బట్టి తెలుస్తోంది. నవంబర్ 3న అంటే ఈ ఆదివారం రాత్రి ఈ గ్రాండ్ ఫినాలే స్టార్ మా చానల్లో ప్రసారం కానున్నది.
మరి ఈ ఫైనల్ షూట్ అదే రోజు జరుగుతుందా, లేక ముందుగా జరుగుతుందా అనే విషయం ఆరా తీస్తే, శనివారం మధ్యాహ్నం నుంచి ఈ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతుందనీ, దాన్ని ఎడిట్ చేసి, ఆదివారం రాత్రి ప్రసారం చేస్తారనీ తెలియవచ్చింది. అంటే ఒకరోజు ముందే షూటింగ్ జరుగుతుంది కాబట్టి, ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కాకముందే విన్నర్ ఎవరనేది లీకయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే అలాంటి లీకులకు ఆస్కారం లేకుండా 'బిగ్ బాస్ 3' నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షూటింగ్లో పాల్గొనే యూనిట్ మెంబర్స్కు ఈ విషయమై గట్టి ఆదేశాలు వెళ్లాయి.
ఫైనల్స్లో తలపడుతున్న ఐదుగురు కంటెస్టెంట్లలో ఎవరు విజేతగా నిలుస్తారనే క్యూరియాసిటీ ఈ గేమ్ షోను ఫాలో అవుతున్న వాళ్లలో అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రధాన పోటీ టీవీ యాంకర్, సినీ నటి శ్రీముఖి, మ్యూజిక్ కంపోజర్ అండ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ఉంటుందని విశ్లేషకులతో పాటు అత్యధికులు భావిస్తున్నారు. అలా అని సినీ నటుడు వరుణ్ సందేశ్, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, టీవీ యాక్టర్ అలీ రెజాలనూ అంత తేలిగ్గా తీసిపారేయలేం. ఈ ఐదుగురిలో అలీ రెజా ఒకసారి ఎలిమినేట్ అయి కూడా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగివచ్చి, ఫైనల్స్కు చేరుకున్నాడు. ఫైనల్స్కు కచ్చితంగా వస్తుందనుకున్న టీవీ యాంకర్ శివజ్యోతి అనూహ్యంగా గత ఆదివారం ఎలిమినేషన్కు గురై బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం ఆమె ఫ్యాన్స్ను బాగా నిరుత్సాహపరిచింది.
100 రోజుల పాటు బయటి ప్రపంచంతో నిమిత్తం లేకుండా, కుటుంబ సభ్యులకు దూరంగా, అప్పటివరకూ ఎవరు ఎలాంటివారో తెలీని వ్యక్తులతో గడపాల్సి రావడం, బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను పూర్తిచెయ్యడం, గేమ్స్ ఆడటం, భావోద్వేగాలతో సతమతమవడం.. వంటివి కంటెస్టెంట్లకు పెద్ద సవాలు. కాకపోతే మునుపటి రెండు సీజన్లకు భిన్నంగా ఈసారి ఒక నిజజీవిత జంటకు బిగ్ బాస్ హౌస్లో స్థానం కల్పించారు. నటులైన వరుణ్ సందేశ్, వితికా శేరు నిజ జీవితంలో దంపతులనే విషయం తెలిసిందే. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే, వాళ్లకు ఒంటరితనం అనే సమస్య ఎదురవదు. కానీ టాస్కుల్ని పూర్తి చేసే విషయంలో, గేమ్స్ ఆడే విషయంలో ఒకరితో ఒకరు తలపడాల్సి రావడం భార్యాభర్తలైన వాళ్లకు ఇబ్బందికర వ్యవహారం. ఆ ఇబ్బందుల్ని ఆ ఇద్దరూ ఫేస్ చేశారు. వాటికి సంబంధించిన సన్నివేశాల్ని కూడా బిగ్ బాస్ చూపించాడు.
ఇద్దరిలో వరుణ్ ఫైనల్ వరకు రాగలిగాడు. వితిక సైతం 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో నిలవగలిగింది. ఈ షోలో పాల్గొనడం ద్వారా తొలిసారిగా వరుణ్లో ఒక థెరపిస్టును చూడగలిగాననీ, అతను ఈ సీజన్ విన్నర్గా నిలుస్తాడని నమ్ముతున్నాననీ తెలిపింది వితిక. అక్టోబర్ 30న హౌస్లో వరుణ్ జర్నీ ఎలా కొనసాగిందో, అతను ఎంత నిజాయితీగా హౌస్లో ఉన్నాడో చూపించారు. తన టీచర్తో, రాహుల్ సిప్లిగంజ్తో, వితికతో అతను ఇంటరాక్ట్ అయిన విధానం ఆ జర్నీలో కనిపించింది. ఈ సందర్భంలో వరుణ్ కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూశాం. ఇది ఆడియెన్స్ను కదిలించి, అతనికి ఓట్లు రావడానికి దోహదం చేస్తుందని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అయితే 'బిగ్ బాస్ 3' విన్నర్ పోటీలో రాహుల్ సిప్లిగంజ్ హాట్ ఫేవరేట్గా నిలిచాడు. అతని అవకాశాలకు ఫ్యాన్స్ పెద్ద అండగా నిలుస్తున్నారు. గత సీజన్లో కౌశిక్ విన్నర్గా నిలవడంలో 'కౌశిక్ ఆర్మీ' పేరుతో అతని ఫ్యాన్స్ బలమైన పాత్ర వహించడం మనకు తెలుసు. అదే రీతిలో రాహుల్ ఫ్యాన్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం అతని విజయానికి కృషి చేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి శ్రీముఖి కంటే మెరుగైన ఓటింగ్ శాతం సాధించడంలో ఇప్పటివరకూ రాహుల్ సక్సెసయ్యాడు. చివరి నిమిషంలో ఓటింగ్ శాతంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోకపోతే రాహుల్ విన్నర్ అవుతాడని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఇక తన చేష్టల ద్వారా, డాన్సుల ద్వారా వీక్షకుల ఓట్లను పొందడానికి శ్రీముఖి గిమ్మిక్కులు చేస్తోందనే మాట వినిపిస్తోంది. ఆమె గిమ్మిక్కులు ఫలించి ఓట్ల శాతం పెరిగితే విన్నరయ్యే అవకాశాలు ఉన్నాయి. గత రెండు సీజన్లలో మగవాళ్లే విజేతలుగా నిలిచారు కాబట్టి, ఈసారి ఒక విమన్ విన్నర్ అవుతుందంటూ చాలా రోజుల నుంచే ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు ఫైనల్స్లో ఆడవాళ్లకు ఒక్క శ్రీముఖి మాత్రమే రిప్రజెంట్ చేస్తోంది కాబట్టి, ఆమే విజేతగా నిలుస్తుందని ఆమె ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఈ ముగ్గురితో పోలిస్తే బాబా భాస్కర్, అలీ రెజాలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకూ వీక్షకుల ఓటింగులు వాళ్లకు తక్కువగా వచ్చాయి. చివరి క్షణాల్లో వాళ్ల ఓట్ల శాతంలో గణనీయమైన మెరుగుదల వస్తే, ఏ అద్భుతమైనా జరగొచ్చు. మొత్తానికి ఈ సీజన్ విజేతగా నిలిచే కంటెస్టెంట్ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చేతులు మీదుగా 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకోనున్నారు. అలాగే ఈ ఎపిసోడ్కు ఇప్పటివరకూ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లంతా హాజరు కానున్నారు. దీంతో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రికార్డు స్థాయి టీఆర్పీని పొందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.