రూ. 7.5 కోట్లు తీసుకొని మోసం చేశారు.. నరేశ్ పోలీస్ కంప్లయింట్!
on Apr 18, 2021
ఓ వ్యక్తి తమ దగ్గర రూ. 7.5 కోట్లు తీసుకొని మోసం చేశాడంటూ సీనియర్ నటుడు నరేశ్ హైదరాబాద్ సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఓ వీడియో రూపంలో ఆయన వెల్లడించారు. "లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి కీస్టోన్ ఇన్ఫ్రా అనే కంపెనీ పెట్టి, మా బిల్డర్స్ ఫీనిక్స్తో అసోసియేట్ అయ్యి, సైనింగ్ అథారిటీగా ఉన్నాడు. అతను మా ఫ్యామిలీ నుంచి రూ. 7.5 కోట్లు అప్పు తీసుకున్నాడు. మా మేనమామ రఘునాథ్ ద్వారా డబ్బులు తీసుకొని దాదాపు ఆరేళ్లు దాటిపోయింది. ఇప్పటి దాకా ఎలాంటి డబ్బు చెల్లించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు." అని ఆయన చెప్పారు.
ఈ విషయమై తానిప్పుడు సీసీఎస్లో ఫిర్యాదు చేశాననీ, కోర్టుకు కూడా వెళ్లామనీ నరేశ్ తెలిపారు. "వడ్డీతో కలుపుకొని మాకు రూ. 10 కోట్లు పైనే రావాలి. కొవిడ్ టైమ్లో మేం బాగా ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్లు సత్వరమే స్పందించి దర్యాప్తు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా." అని చెప్పారు నరేశ్. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.