తస్సాదియ్యా... ఆ పాటకు కాపీయా?
on Dec 19, 2018
కాపీ పాటల్ని పట్టుకోవడం ఒకప్పుడు కష్టంగా ఉండేదేమో కానీ... ఇప్పుడు ఏమంత కష్టం కాదు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక సులభమైంది. ఏ పాత పాటను సంగీత దర్శకుడు కాపీ చేశాడనేది ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. సోషల్ మీడియా సాక్షిగా కాపీ పాట అందించిన సంగీత దర్శకుడిపై సెటైర్స్ వేస్తున్నారు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్పై ఈ సెటైర్స్ బాగా పడుతున్నారు. ఈ వారంలో ఆయన సంగీతం అందించిన రెండు పాటలు విడుదలయ్యాయి. రామ్చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న 'వినయ విధేయ రామ'లో 'తస్సాదియ్యా...' పాట ఒకటి అయితే... వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఎఫ్'లో 'రెచ్చిపోదాం బ్రదర్...' మరొకటి. ఈ రెండు పాటలకు దేవిశ్రీ కాపీ ట్యూన్లు అందించాడని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో సెటైర్స్ పడుతున్నారు.
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అత్తారింటికి దారేది'కి ఆల్బమ్ సూపర్హిట్. దేవిశ్రీ ప్రసాద్ ప్రతి పాటకు హిట్ ట్యూన్ ఇచ్చాడు. అందులో 'కిర్రాకు... కిర్రాకు' పాటను ఒక్కసారి విని, తరవాత వినయ విధేయ రామ'లో 'తస్సాదియ్యా...' పాట వింటే... రెండు పాటలకు పెద్ద తేడా తెలియదు. సింగర్ వాయిస్, ట్యూన్ సేమ్ టు సేమ్ అనిపిస్తాయి. 'అత్తారింటికి దారేది'లో పాటలో సగం... 'వినయ విధేయ రామ'లో పాటలో సగం ఎడిట్ చేసి మరీ దేవిశ్రీని ఆడుకుంటున్నారు. ఇక, 'ఎఫ్2'లో 'రెచ్చిపోదాం బ్రదర్' పాట విషయానికి వస్తే... పవన్ కల్యాణ్ 'జల్సా'లో 'జెన్నిఫర్ లోపెజ్' ట్యూన్కి దగ్గర దగ్గరగా ఉందనేది కొందరి మాట. ఈ రెండు పాటలతో దేవిశ్రీ ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అయ్యింది. రెండు పాటలపై మెగా అభిమానులు, వెంకటేష్ అభిమానులు దేవిశ్రీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు 'మహర్షి'కి ఎటువంటి పాటలు ఇస్తాడోనని టెన్షన్ పడుతున్నారు.