'అర్జున్రెడ్డి' తరవాత కూడా శర్వా నో...
on Dec 20, 2018
'అర్జున్రెడ్డి' కథ విజయ్ దేవరకొండ కంటే ముందు శర్వానంద్ దగ్గరకు వెళ్ళింది. కథ నచ్చినా.. నిర్మాతలు ముందుకు రాకపోవడంతో అతడు సినిమా చేయలేదు. తనే నిర్మాతగా మారి సినిమా తీస్తానని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ప్రతిపాదనకు శర్వానంద్ నో చెప్పాడు. గతంలో ఈ విషయాలను శర్వానంద్ స్వయంగా చెప్పాడు. తాజా ఇంటర్వ్యూలో మరోసారి 'అర్జున్రెడ్డి' ప్రస్తావన రాగా... అందులో లిప్ లాక్స్ వల్ల నో చెప్పలేదనీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయడం కుదరలేదని అన్నాడు. 'అర్జున్రెడ్డి' తరవాత సందీప్ రెడ్డి మరో కథతో శర్వానంద్ దగ్గరకు వెళ్లగా... ఈసారి హీరోకి కథ నచ్చలేదు. 'అర్జున్రెడ్డి' విజయం తరవాత ఆ దర్శకుడితో సినిమా చేయడం కంటే కథకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు శర్వానంద్. "నేను 'అర్జున్ రెడ్డి' చేయనందుకు బాధ పడటం లేదు. ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అన్నట్టు ఆ సినిమాపై నా పేరు రాసి లేదు. ఆ సినిమా తరవాత సందీప్ మరో కథతో నా దగ్గరకు వచ్చాడు. అతడు తీసుకొచ్చిన కథ కాకుండా మరో కథతో సినిమా చేస్తానని చెప్పా" అని శర్వానంద్ తెలిపాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన 'పడి పడి లేచె మనసు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.