వెంకీలో ఈ మార్పుకు కారణం ఏంటబ్బా!
on Jan 2, 2018
వెంకటేశ్ లో ఉన్నట్టుండి ఏంటీ మార్పు? ఇలా విరివిగా మల్టీస్టారర్లు ఒప్పేసుకుంటున్నాడు కారణం ఏంటి? ఫిలింనగర్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ. ఇప్పటికే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాలా గోపాలా, మసాలా అనే మూడు మల్టీస్టారర్లు చేసిన వెంకీ... త్వరలో మరికొన్ని మల్టీస్టారర్ సినిమాలకు పచ్చజెండా ఊపేశాడు.
అందులో ఒకటి... వెంకీ, వరుణ్ తేజ్ సినిమా. దానికి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. రెండో సినిమా వచ్చేసరికి.. తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ఓ చిత్రంలో నటించనున్నాడు. ఆ సినిమాను సురేశ్ బాబు నిర్మించనున్నట్లు టాక్. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే రానుంది.
మూడో సినిమా వచ్చేసరికి వెంకీ, నాని కలిసి ఓ చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు టాక్. అంతేకాదు... ఇప్పటికే... చైతూ ‘ప్రేమమ్’లో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చేశాడు. రాబోతున్న పవన్ ‘అజ్ఙాతవాసి’లో గెస్ట్ గా కనిపించనున్నాడు.
ఎందుకిలా మల్టీస్టారర్లు ఒప్పుకోవడం? గెస్ట్ గా నటించేయడం? తన తోటి కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగ్ ఇంకా సోలో సినిమాలతో స్పీడ్ మీదే ఉన్నారు. మరి వెంకీలో ఎందుకీ మార్పు? తేజా దర్శకత్వంలో వెంకీ సినిమా అన్నారు. అయితే... ఉన్నట్లుండి సీను మారిందని టాక్. ఎన్టీయార్ బయోపిక్ పనిమీద తేజా బిజీగా ఉన్నడట. మార్చిలో ఆ సినిమా షూటింగ్ మొదలు కానుంది. మరి విక్టరీ సోలో సినిమా మాటేంటి? పోనీ విజయాల్లేక అంటే అదీ లేదు.. మొన్ననే ‘గురు’ రూపంలో చక్కని హిట్ అందుకున్నాడు. మరేంటి ఈ మార్పు? దానికి కాలమే సమాధానం చెప్పాలి.