'నారప్ప' సరసన మరో హీరోయిన్!
on Feb 1, 2020
తమిళంలో సూపర్ హిట్టయిన 'అసురన్' మూవీ తెలుగులో 'నారప్ప' పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఒరిజినల్లో ధనుష్ చేసిన టైటిల్ రోల్ను తెలుగులో విక్టరీ వెంకటేశ్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమా తర్వాత వెంకటేశ్తో అతను చేస్తున్న సినిమా ఇది. ఇందులో వెంకటేశ్ భార్యగా ప్రియమణి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్పై ఉంది.
కాగా ఫ్ల్యాష్బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే మరో హీరోయిన్ క్యారెక్టర్ కోసం దర్శక నిర్మాతలు అమలా పాల్ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం యువకుండిగా ఉన్న కాలంలో వెంకటేశ్ ఒక యువతి ప్రేమలో పడతాడు. ఆ పాత్ర కోసమే అమలా పాల్తో చర్చలు జరుపుతున్నారు. తమిళంలో ఆ పాత్రను అమ్ము అభిరామి పోషించింది. 'రాక్షసుడు' సినిమాలో ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ మేనకోడలి పాత్రలో కనిపించింది. 'నారప్ప'కు మణిశర్మ సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీని సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లపై డి. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.