అప్పుడే పాతికేళ్లు నిండాయా?
on Oct 30, 2017
1992 తెలుగు చిత్ర పరిశ్రమ మరిచిపోలేని సంవంత్సరం. ఎందుకంటే.. ఆ సంవత్సంర వచ్చినన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ మళ్లీ మనం చూడలా. ఘరానామొగుడు, చంటి, సుందరకాండ, అల్లరి అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్, అక్క మొగుడు, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే. ఆ వరుసలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’. నాగార్జున కెరీర్ గ్రాఫ్ ని అమాంతం ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిన సినిమా ఇది. నాగ్ ఊర మాస్ గా నటించాడు ఈ సినిమాలో. ఈ సినిమా విషయంలో జరిగిన మరో విశేషం ఏంటంటే... ఈ సినిమా నుంచి నాగార్జున ఎరా మొదలైందని చెప్పాలి. ఈ సినిమా వెంటనే వచ్చిన రక్షణ, వారసుడు, అల్లరి అల్లుడు ఘన విజయాలు అందుకున్నాయ్. అప్పటివరకూ క్లాస్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాగార్జున... ఈ సినిమా నుంచి మాస్ తరహా పాత్రలను ఎక్కువగా చేయడం మొదలుపెట్టాడు.
అంతేకాదు.. పంచకట్టులో పల్లెటూరి సోగ్గాడిగా ఇందులో విశ్వరూపం చూపించాడు. నాగార్జున, ఏ.కోదండరామిరెడ్డి అంటేనే హిట్ కాంబినేషన్. అప్పటికి కిరాయిదాదా, విక్కీదాదా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన విజయాలు. ఆ రెండింటినీ మించిన విజయం ఈ సినిమా సాధించింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. డా.అక్కినేని నటించిన ‘మంచిరోజులొచ్చాయ్’చిత్రం ఈ సినిమాకు మాతృక. అదే కథకు నాటి నేటివిటీకి తగ్గట్టుగా మలిచాడు కోదండరామిరెడ్డి.
దైర్యం, సాహసం, ఆత్మాభిమానం, మంచితనం కలగలిపిన పాత్రను నాగ్ పోషిస్తే.. పొగరు బోతు పోట్లగిత్త లాంటి పాత్ర మీనా పోషించింది. ఇంకా సత్యనారాయణ, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు... లాంటి ఉద్దండులు ఇందులో నటించారు. శ్రీకాంత్ విలన్ గా కనిపిస్తాడు. తోటపల్లి మధు, వి.ఎస్.ఆర్ స్వామి కెమెరా ఈ చిత్రానికి హైలైట్. ఇక కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇందులో ప్రతి పాట ఓ అద్భుతమే. ఈ సినిమా విజయంలో కీరవాణిది ప్రముఖ పాత్ర.
‘నువ్వు మల్లెతీగ నేను తేనె తీగ’, ‘ఆ ఒడ్డూ ఈ ఒడ్డూ నడిమధ్య ఏరడ్డూ’, ‘ఏహే ఏహే.. నండూరి ఆంబోతు..’, ‘తస్స చక్క.. తళాంగు చుక్క’, ‘ఉమ్మకావాలీ.. ఉందా ఉందా’.. ఇలా ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. ఈ సినిమా వచ్చి అప్పుడే 25 ఏళ్లు నిండాయ్. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరలో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... వాణిజ్య అంశాల మేలుకలయిక ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’. మళ్లీ ఇంకోసారి చూసి ఎంజాయ్ చేయండి.