అది పచ్చి అబద్ధం!
on Oct 30, 2017
సోషల్ మీడియా వచ్చాక... నెటిజన్లకు విపరీతమైన పని పెరిగిపోయింది. ఏ వార్త లేకపోతే... కల్పించుకొనైనా సరే... ఏదో ఒకటి రాసేసి.. ‘మమ’ అనిపించేస్తున్నారు. పాపం.. వాళ్ల బాధలు వాళ్లకుంటాయ్ కదా! ఈ మధ్య అంత ఆసక్తిని రేకెత్తించే వార్తలేం మనోళ్లకు అందినట్టు లేవు. అందుకే.. తమకు తామే ఓ కొత్త వార్త పుట్టించారు. అదే.. ‘ఎన్టీయార్ కుమారుడు అభయ్ రామ్.. బాలనటునిగా త్రివిక్రమ్ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు’ అనే న్యూస్. ఒక్కడు రాసి నెట్లో పెట్టాడు. ఇంకేముందీ.. దురద మొదలైంది. అందరూ గోక్కోవడం మొదలెట్టేశారు. అసలు అందులో నిజం ఎంత? నిజంగా ఆ అబ్బాయిని తారక్ తెరకు పరిచయం చేస్తున్నాడా? అనే సంమయనంగా ఆలోచించే ఓపిక ఎవరికుంది? నిజానికి అదంతా సుద్ధ అబద్ధం. తారక్ తన సినిమా ఓపెనింగ్ కి ఆ పిల్లాడ్ని తీసుకొచ్చాడు. అంతే.. వాడి చుట్టూ రూమర్లు అల్లేశారు.
ఏది ఏమైనా... రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయ నాయకులవ్వడం ఎంత మామూలు విషయమో... సినిమా హీరోల కొడుకులు హీరోలు అవ్వడం కూడా అంతే కామన్. ప్రస్తుతం తెలుగు తెర మొత్తం... హీరోల వారసులతో నిండిపోయి ఉంది. ఎవరో పాపం.. అడపా దడపా.. రవితేజా, నాని లాంటి హీరోలు వెండితెరపై మెరుస్తుంటారు అంతే.
చాలామంది హీరోలు... తమ కొడుకుల్ని బాలనటులుగా పరిచయం చేశారు. అలా చేస్తే... ఆటోమేటిగ్గా వాళ్లకంటూ మైలేజ్ పెరుగుతుందనీ.. తర్వాత హీరోలు అవ్వడం ఈజీ అవుతుందని వారి అభిప్రాయం కావొచ్చు. బాలకృష్ణను ఎన్టీయార్ 14 ఏళ్ల వయసులోనే తెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మహేశ్, జూనియర్ ఎన్టీయార్, బన్నీ, అఖిల్.. బాలనటులుగా పరిచయమై... తర్వాత హీరోలుగా నిలదొక్కుకున్నారు. మహేశ్ కుమారుడు గౌతమ్ ని ‘నేనొక్కడినే’ సినిమాతో బాలనటునిగా పరిచయం చేసింది కూడా అందుకే. అలాగే... త్వరలో అభయ్ రామ్ ని కూడా ఎన్టీయార్ హీరోగా పరిచయం చేసినా ఆశ్చర్యం లేదు. అయితే... ‘త్రివిక్రమ్ సినిమా ద్వారా తాను తెరకు పరిచయం కాబోతున్నాడు’ అనే వార్త మాత్రం పచ్చి అబద్ధం.