మోదీ సర్కార్ నిర్ణయం… కమల్ సినీ రంగం వదిలేయాల్సిందేనా?
on Jun 6, 2017
జీఎస్టీ … ఇప్పుడు మోదీ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్ ఇది! జూలై ఒకటవ తేదీ నుంచీ అమల్లోకి రాబోతున్న జీఎస్టీ పన్ను విధానం దేశంలోని అన్ని వస్తువులు, సేవల ధరల్ని మార్చేయబోతోంది. ఒకే ట్యాక్స్ వుండనుంది కాబట్టి కొన్ని రేట్స్ తగ్గితే , మరికొన్ని పెరగవచ్చు. కాని, ఇక మీదట అన్నిటికి వన్ నేషన్ వన్ ట్యాక్స్ సూత్రం మాత్రమే వర్తిస్తుంది! కాని, ఎందుకోగాని… మన విలక్షణ నటుడు కమల్ హసన్ కి జీఎస్టీ విషయంలో కోపమొచ్చింది. అందుకు ఆర్దిక మంత్రి జైట్లీ కూడా అంతే ధీటుగా జవాబిచ్చాడు!
ఆ మధ్య జయలలిత విశ్వరూపం సినిమా విడుదలకి అడ్డుపడితే కమల్ తాను తమిళనాడు వదిలేసి వెళ్లిపోతానని అన్నాడు. గుర్తుందిగా… ఇప్పుడు ఆయన ఏకంగా సినిమా రంగాన్ని వదిలేస్తానని చెప్పాడు. కారణం కేంద్ర ప్రభుత్వం సినిమా రంగంపై 28శాతం పన్ను విధించటమే! అంత తీవ్రంగా పన్ను వేస్తే ప్రాంతీయ సినిమా బతకదని వాపోయాడు కమల్. తానైతే సినిమాలు చేయటం మానుకుంటానని ప్రకటించేశాడు! కాని, కమల్ మాటలకు స్పందించిన ఆరుణ్ జైట్లీ మాత్రం గతంలో 29శాతం వుంటే ఇప్పుడు 28శాతానికి తగ్గించామని చెప్పుకొచ్చారు!
కమల్ హసన్ స్పందన, జైట్లీ ప్రతిస్పందన ఎలా వున్నప్పటికీ జీఎస్టీ వచ్చాక దేశమంతా ఒకే పన్ను వుండి తీరాల్సిందే. అలాంటప్పుడు కమల్ కోరినట్టు ప్రాంతీయ సినిమాకి తక్కువ పన్ను, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకు ఎక్కువ పన్ను కుదరదు. అంతే కాక ఏ సినిమా మీద వేసే పన్నైనా భరించేది అంతిమంగా ప్రేక్షకుడే! టికెట్ ధరలు పెంచేసి సినిమా వాళ్లు జీఎస్టీని కూడా ఆడియన్స్ నుంచే గుంజుతారు. మరి అలాంటప్పుడు కమల్ ఇంత తీవ్రంగా భయపడాల్సిన అవససరం ఏముంది? సినిమా రంగమే వదిలేస్తానని హెచ్చరించాల్సిన అగత్యం ఏంటి? కమల్ మంచి సినిమాలు చేస్తే 28శాతం పన్ను కట్టి చూడటానికి సినిమా అభిమానులు 100శాతం రెడీగా వుంటారు కదా…