రాజాధిరాజాను ఎవరూ పట్టించుకోలేదు ఎందుకో..!
on Apr 2, 2016
ఏప్రిల్ 1న శర్వానంద్ రాజాధిరాజా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏమయ్యిందో ఏమో, అసలు రిలీజ్ కే ఎసరు వచ్చింది. వరస విజయాలతో ఊపుమీదున్న శర్వానంద్ తమిళ డబ్బింగ్ ఆకట్టుకుంటుందో లేదోనని చూసిన ఆ కొద్దిమందికీ కూడా నిరాశే ఎదురైంది. నిజానికి థియేటర్లు టైట్ గా ఉండటంతో, చాలా తక్కువ హాళ్లలో రాజాధిరాజా రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఆ కొన్ని హాళ్లలో కూడా సినిమా వేయలేదు. కనీసం సినిమాకు సంబంధించిన టీంలో ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. హీరో శర్వా, హీరోయిన్ నిత్యామీనన్ ల సంగతి సరేసరి. తమిళంలో కూడా ఈ సినిమా విడుదలలో పెద్ద జాప్యమే నడిచింది. ఆటోగ్రాఫ్ లాంటి సినిమా తీసిన తమిళ డైరెక్టర్ చేరన్ దర్శకత్వంలో తమిళంలో జేకే ఎనుమ్ నాన్బనిన్ వాళ్కై పేరుతో వచ్చిన ఈ సినిమాను, శర్వా ఫామ్ దృష్ట్యా ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేద్దామనుకున్నారు. మొదట ఏమిటో ఈ మాయ అనే టైటిల్ అనుకుని, ఆ తర్వాత శర్వాకు రాజా అచ్చొచ్చిందని రాజాధిరాజాగా టైటిల్ ను మార్చారు. తమిళంలో సినిమా రిలీజ్ అవ్వక డైరెక్ట్ గా డీవీడీలు రిలీజ్ చేసేశారు. ప్రస్తుతం తెలుగులో కూడా అదే పరిస్థితి వచ్చేలా కనబడుతోంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో, సినిమా రిలీజ్ అనుమానంగా మారింది..