మాజీ మంత్రి కాకాణి అరెస్టు

మాజీ మంత్రి కాకాణి అరెస్టు

Publish Date:May 25, 2025

రెండు నెలలుగా పోలీసులను ముప్పతిప్పలు పట్టిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికారు.   పోలీసులు ఆదివారం( మే 25) ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో తలదాచుకున్న కాకాణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకాణిని  సోమవారం (మే26) ఉదయానికి నెల్లూరుకు తీసుకురానున్నారు. కాగా, ఇటీవల సుప్రీంకోర్టు కూడా కాకాణి ముందస్తు బెయిల్‌ని తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్న అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు కాకాణిని   అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకిణి గోవర్ధన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ.. కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయినప్పటికీ కాకాణి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నింటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారాయన. కానీ.. ఆయన ప్రయత్నాలన్నీవిఫలమయ్యాయి.   మరోవైపు రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణి జాడ కనిపెట్టేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే.. కాకాణి కేరళలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయన ఉన్న ప్లేస్‌కి వెళ్లిన పోలీసులు.. కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. 
గాంధీలు జైలుకు వెడతారా?

గాంధీలు జైలుకు వెడతారా?

Publish Date:Apr 19, 2025

అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌  మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో  గాంధీలు జైలుకు  వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది. మరో వంక ఈ కేసును తెర పైకి తెచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి  ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదని  పూటకో టీవీ చానల్ లో ప్రవచనం చెప్పినట్లు చెపుతున్నారు. సో..సహజంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అరెస్ట్  చేస్తుందా? అనే ప్రశ్న కాంగ్రెస్  వర్గాల్లోనే కాదు, సామాన్యులలోనూ  వినిపిస్తోందని అంటున్నారు. అయితే కావచ్చును కాంగ్రెస్  నాయకులు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు మోదీ నాయకత్వానికి సవాలుగా దూసుకొస్తున్న రాహుల్ గాంధీ దూకుడును అడ్డుకునేందుకే మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నది నిజం కావచ్చును. కానీ  కేసు చరిత్రను  చూస్తే అసలు ఏమీ లేకుండానే  పదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులో ఈడీ ఏ ఆధారాలు లేకుండానే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తుందా? అందులోనూ  సోనియా, రాహుల్ గాంధీ పై ఛార్జిషీట్‌ దాఖలు చేసే సాహసం చేస్తుందా? అనే  సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. పరిపాలనా దక్షత, అభివృద్ధి లెక్కల విషయంలో ఎలా ఉన్నా..  రాజకీయ లెక్కలు వేయడంలో తప్పుచేయని మోదీ షా జోడీ  కాంగ్రెస్ అగ్ర నేతలు ఇద్దరినీ ఒకే సారి టార్గెట్  చేస్తారా?  ఆ తప్పు మోదీ షా జోడీ చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  నిజానికి  రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలకు సంబందించిన కేసుల్లో చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఈ  ‘స్థాయి’ కేసుల్లో  చాలా పకడ్బందీగా, ఎక్కడా ఏ దర్యాప్తు సంస్థకూ దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం పని కానిచ్చేస్తారని  అంటారు. కానీ  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చిక్కు ముళ్ళు పెద్దగా లేవు. అంతా  ఓపెన్ సీక్రెట్ , ఖుల్లం ఖుల్లా ..అందరికీ అర్థమయ్యేలా ఉందని  అంటున్నారు.  క్లుప్తంగా కేసు వివరాలోకి వెళితే,మూడు నాలుగు తరాల రాజకీయాలతో ముడిపడిన ఈకేసులో  గొప్పగా చిక్కు ముళ్ళు ఏమీలేవు. నెహ్రూ గాంధీల తొలి తరం నేత, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ  1935 లో  మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో అక్షర ఆయుధంగా పనిచేస్తుందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)సంస్థను స్థాపించి, ‘నేషనల్ హెరాల్డ్’ అంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత జవహరలాల్ నెహ్రూ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్  పత్రిక కోసం ఢిల్లీ, లక్నో సహా మరికొన్ని మహానగరాలలో విలువైన స్థలాలను చౌకగా ఇచ్చారు. ఇవి కాక ఏజేఎల్ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంతే కాకుండా నెహ్రూజీ మానస పుత్రికగా ముద్ర వేసుకున్న పత్రికకు  కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాళాల రూపంలో,  ప్రకటనల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాయి. (పత్రిక మూత పడిన తర్వాత కూడా హిమాచల ప్రదేశ్  ప్రభుత్వం, ఈ మధ్యనే రూ. 2.50 కోట్ల  ప్రకటనలు ఇచ్చినట్లు  ఈడీ చార్జి సీట్లో ఉందిట.) అయినా, కంపెనీ 2008 నాటికి, రూ.90 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకు పోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడింది. ఈ అప్పులు తీర్చడం కోసం  కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది.  నేషనల్ హెరాల్డ్  స్టొరీలో ఇదే టర్నింగ్ పాయింట్.  ఎందుకంటే.. ఒక రాజకీయ పార్టీ అప్పులు, ఇచ్చి పుచ్చుకోవదాలను చట్టం అనుమతించదు. అదొకటి అయితే.. పత్రిక మూత పడినా, దేశంలో అనేక నగరాల్లో ఉన్న ఏజేఎల్’ ఆస్తుల విలువ పడిపోలేదు.పెరింగింది.ఇప్పడు ఆస్తుల విలువ రూ. 2000 వేల కోట్ల పైమాటే అంటున్నారు.ఇంకొదరైతే రూ.5000కోట్లు అంటున్నారు. వాస్తవానికి ఈ  ఆస్తులు 2010 వరకు నెహ్రూ కుటుంబ ఆస్తులు కాదు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆస్తులు.  కానీ 2010లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీచెరో 38 శాతం వాటాతో, (మిగతా 22 శాతంకు  ఆ స్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా  వాటాదారులు) యంగ్ ఇండియా కంపెనీ తెర మీదకు వచ్చింది. అక్కడితో, సీన్ మారిపోయింది. కొత్త కంపెనీ మూలధనం కేవలం రూ.5 లక్షలు మాత్రమే అయినా.. రూ.2000 వేల కోట్ల పైబడిన  ఏజేఎల్ ఆస్తులతో పాటుగా, కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు చెపుతున్న రూ.90 కోట్ల అప్పు ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో, యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయింది.  అక్కడితోనూ  కథ ముగియ లేదు. ఏజేఎల్  ఆస్తులు యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయిన వెంటనే  కాంగ్రెస్ ఇచ్చిన రూ.90 కోట్ల అప్పు ను  కాంగ్రెస్ పార్టీ ఉదారంగా..  యంగ్ ఇండియా నుంచి జస్ట్ ఓ రూ.50 లక్షలు తీసుకుని మాఫీ చేసేసింది. మళ్ళీ  యంగ్ ఇండియా కు ఆ రూ. 50 లక్షలు ఎక్కడివంటే..  అది మళ్ళీ మరో భేతాళ కథ.  సో .. మొత్తంగా చూస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయం ఏమంటే..  సోనియా,రాహుల్ గాంధీలలు ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్న యంగ్ ఇండియా  జస్ట్ ఓ రూ.5 లక్షల పెట్టుబడితో  రూ.2000 కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులకు హక్కు దారు అయింది.  సో.. ఇప్పుడు ఇలా నాలుగు గోడల మధ్యా జరిగినట్లు చెపుతున్న  ఒప్పందాలలకు సంభందించి సాగుతున్న విచారణలో భాగంగానే ఈడీ, సోనియా, రాహుల్ గాంధీలను ఎ 1,  ఎ 2 గా పేర్కొంటూ  చార్జిషీట్ దాఖలు చేసింది.   నిజానికి,   2012- 2013లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు వెలుగు చూసింది. సీబీఐ విచారణ చేపట్టింది. ఆ సమయంలోనే  సోనియా, రాహుల్ గాంధీలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివకు వరకూ కూడా గాంధీలు ఇద్దరూ బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఈడీ కూడా గతంలో ఆ ఇద్దరినీ విచారించింది. ఇప్పడు చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ చార్జి షీట్ దాఖలు చేసినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేస్తుందని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వెంటనే అరెస్ట్ కాలేదు. అసలు అరెస్ట్ అవసరమా..  కాదా అనేది ఈడీ కాదు.. కోర్టులు నిర్ణయిస్తాయి. సో.. ఇప్పటికి ప్పుడైతే  గాంధీలు అరెస్ట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే అంటున్నారు.  బట్.. చట్టం తన పనితాను చేసుకు పోతుంది .. చట్టానికి సహకరించడం పౌరుల ధర్మం. గాంధీలు అందుకు అతీతులు కాదు. వారికి మినహాయింపూ ఉండదు. 

సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!

Publish Date:Apr 19, 2025

రేసులో పడిపోయిన ప్రతిసారీ నిలబడటమే కాదు..  పరుగెత్తి గెలవడమంటే ఆషామాషీ కాదు.. అది ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారు కాబట్టే చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు.  చంద్రబాబు ఏజ్ బార్ అయింది.. టీడీపీ పనైపోయంది.. రాష్ట్రంలో ఇక వైసీపీకి ఎదురే లేదని జగన్ టీం తెగ హడావుడి చేసింది. అయితే సెవెన్టీ ప్లస్ ఏజ్‌లో కూడా పొలిటికల్‌గా తాను యంగ్ టర్క్‌నని నిరుపించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి చరిత్ర సృష్టించారు.  దాంతో పాటు ఎన్డీఏ కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి, కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు. 76వ పడిలోకి అడుగుపెట్టిన ఆయన పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.  ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం స‌ృష్టించింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అనడం కంటే. తెలుగుదేశం, జనసేనల బలమే వైసీపీని మట్టికరిపించిందనడం కరెక్ట్.ఎందుకంటే ఆ పార్టీల అండ లేకుంటే బీజేపీకి ఏపీలో ఉన్న ఉనికి నామమాత్రమే. విజనరీ లీడర్, అపరచాణక్యుడిగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీబీఎన్ మండుటెండల్లో  ప్రచారం చేసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇతర పార్టీల నేతలు భానుడి ప్రతాపాన్ని  తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు.  కాని ఆ సూర్యుడు ఈ చంద్రుడి స్పీడ్‌కి  బ్రేక్‌లు కాదు కదా కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేకపోయాడు. సెవెన్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్‌‌లో తొంభై సెగ్మెంట్లలో సీబీఎన్ ప్రచారం చేశారంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థం అవుతుంది.  ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం.  బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్..  సౌత్ అసియన్ ఆఫ్ ద ఇయర్.. వరల్డ్ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్‌ మెంబర్.. ఇదీ విజనరీ లీడర్  చంద్రబాబుకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు. ఆ విజనే రాజధాని లేకుండా విడిపోయిన ఏపీలో జరిగిన మొదటి ఎన్నికల్లో జనం చంద్రబాబుకు పట్టం కట్టేలా చేసింది. అంతర్జాతీయంగా నారావారిని ఎందరు ఎన్నిరకాలుగా ఆకాశానికెత్తేసినా,  తెలుగోళ్లకు మాత్రం అభివృద్ది కాముకుడు, అపరచాణక్యుడే.  చంద్రబాబు పేరు చెప్తే హైదరాబాద్ హైటెక్‌ సిటీకి పునాది వేసిన సైబర్ టవర్సే గుర్తొస్తాయి. అలా ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో తనదైన బ్రాండ్ వేసుకున్న సీబీఎన్. విభజిత ఆంధ్రప్రదేశ్ కు  కూడా హైదరాబాద్ స్థాయి రాజధానిని ఏర్పాటు చేస్తారనీ,  అభివ‌ృద్దిని పరుగులు పెట్టిస్తారనే 2014 ఎన్నికల్లో ప్రజలు ఆయనను నెత్తినపెట్టుకున్నారు.  అమరావతి రాజధానికి అంకురార్పణ చేసి .. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న టైంలో చంద్రబాబు స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి.  ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధ్యక్షుడు చేసుకున్న అభ్యర్ధన రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనామకంగా, అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్, 14 ఏళ్లు సీఎంగా ఉన్న సీబీఎన్  రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించి అభాసుపాలయ్యారు.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక వైపు అమరావతి డెవలప్‌మెంట్, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టిస్తూనే,  పెట్టబడులు, పరిశ్రమల స్థాపనపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.  ఇప్పుడు ఏపీ, తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్లను చూస్తే తెలుగోళ్లకు చంద్రబాబునాయుడే కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన సీబీఎన్ ను  రాష్ట్ర విభజన తర్వాత మరోసారి సీఎంని చేసింది ఆ హైటెక్ విజనే.   ఆయన అమరావతి రాజధాని అనగానే జగన్‌ సహా అందరూ ఆమోదించారు. అయితే..  2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి.  రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు మిగిలారు .బటన్ నొక్కుడు పాలిటిక్స్ మొదలు పెట్టిన జగన్.. సంక్షేమం డబ్బులు డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తూ కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో కూడా ఆ నవరత్నాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో కనిపించారు.  పైగా.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తన హయాంలోని పథకాలు అన్నీ ఆగిపోతాయని ప్రచారంలో చెప్పారు. 2014లో ఎన్డీఏ కూటమితో గెలిచిన చంద్రబాబు.  గత ఎన్నికల్లో ఆ కూటమికి దూరమై దెబ్బ తిన్నారు.  అయితే... రాష్ట్రం సంక్షేమం కోసం  జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మళ్లీ 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేనలతో కలిశారు.  అయితే పేరుకి  ఎన్డీఏ కూటమి అయినా దానికి పెద్ద దిక్కు చంద్రబాబే అయ్యారు. ప్రచార  బాధ్యతను కూడా భుజ స్కంధాలపై వేసుకుని ముందుకు సాగారు. ఓవైపు ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూనే... తాము అధికా రంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు చంద్రబాబు.. ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించారు.  నవరత్నాలని  వైసీపీ అంటే. సూపర్ సిక్స్, భవిష్యత్తుకు గ్యారెంటీ హామీలతో  చంద్రబాబు దూసుకుపోయారు.  జగన్ సర్కారు మద్యం పాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచ్‌లు విసిరారు.  టీడీపీ అధినేత నవరత్నాల పేరుతో  జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి.. నెక్లెస్‌లు తీసుకుంటున్నారంటూ ప్రజల్ని ఆలోచింపచే శారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నడిపించారు .  పని రాక్షసుడిగా టాగ్‌లైన్ తగిలించుకున్న హైటెక్ లీడర్ బర్త్ డేట్ 1950 ఏప్రిల్ 20.  14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. మండు టెండల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన 90 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసారంటే.. మామూలు విషయం కాదని రాజకీయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  దటీజ్ చంద్రబాబు అంటూ కితాబులిచ్చారు. . ఆయనకంటే వయస్సులో చిన్నవారైన పవన్‌కళ్యాణ్, జగన్‌.. ఎండ ధాటికి తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం నిత్య యవ్వనుడిలా అలుపెరుగని పోరాటం చేశారు.  ఒక్కసారి కూడా బ్రేక్‌ తీసుకోకుండా,  అటు పార్టీ నేతలతో పాటు ప్రజలూ ఆశ్చర్య పడేలా చేశారు. అంతే కాదు..  రోజుకి మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొంటూ జనాలతో మమేకం అయ్యారు. ప్రతి అంశాన్నీ జనాలకు చెప్పటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో అంశాలతో పాటు జగన్ ప్రభుత్వ పనితీరుపై  తనదైనలో శైలిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు, సీట్ల సర్ధుబాటు సహా అన్ని అంశాలనూ జనంలోకి తీసుకెళ్లగలిగారు.  ఓవరాల్‌గా ఈ అభివృద్ది కాముకుడు చేసిన పోరాటం ఫలించింది.  ఆయన ఊహించిన దానికంటే బెస్ట్ రిజల్ట్ లభించింది.151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగారు. అటు కేంద్రంలోనూ సోలో మెజార్టీకి దూరమైన బీజేపీకి దిక్కు అయ్యారు.  ఎన్డీఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా అవతరించడంతో కేంద్రానికి అణిగిమణిగి ఉండాల్సిన ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది టీడీపీకి. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఏపీ వాసులంతా కలలుగంటున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.  అందుకే అందరి నోటా ఎన్నికల ప్రచారం తర్వాత ఒకటే మాట వినిపించింది. అదే .. సీబీఎన్ ద గ్రేట్.

మాటలతో కట్టిపడేయాలంటే ఇలా ఆకట్టుకోవాలి!

Publish Date:May 24, 2025

మాట ఆభరణం మనిషికి అంటారు పెద్దలు. మాటే మంత్రము అంటారు కవులు. మాట ఇతరులను ముగ్ధులను చేస్తుంది, ఆకర్షిస్తుంది. అందంగా ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా ఒక కళ. ఇప్పటి యూత్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మాట్లాడటం గురించి కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మాట్లాడటంలో అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి.  ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు ఆ సంభాషణలో మనం ఎప్పుడూ ఇతరులతో వాదించడానికి ప్రయత్నం చేయకూడదు. సంభాషణలో మనకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతేకానీ వాదనకు దిగటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాదనే గొడవలకు దారి తీస్తుంది. సంభాషణలో ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ మాట్లాడాలి. ఇతరులు చెప్పిన దాన్ని వారి ముఖం మీదే తప్పు అని ఖండిస్తూ మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా సంభాషణలో మనం మాట్లాడేది తప్పు అని మీరు గమనించినా లేక ఇతరులు తెలియజేసినా హుందాగా ఆ తప్పును అంగీకరించాలి. అంగీకరించడంలో కూడా గొప్ప వ్యక్తిత్వం వ్యక్తం అవుతుంది. అంతేగానీ ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించకూడదు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ఇతర పనులు కూడా తప్పిదాలే అవుతాయి. ఒకదాని వెనుక ఒకటిగా తప్పుల చిట్టా పెరుగుతుంది. సంభాషణని ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగా ప్రారంభించాలి. అలాగే చిరునవ్వుతో ముగించాలి. అప్పుడే విలువను కాపాడుకోగలిగిన వారమవుతాము. నచ్చని విషయాలు ఉన్నా, న్యాయమైన విషయాలు లేకపోయినా వాటిని సుతిమెత్తగా నవ్వుతూనే చెప్పాలి తప్ప గొడవకు దారితీసేలా ఆవేశంగా ఉండకూడదు. ఇతరులు చెప్పే విషయాలను మనం ఎప్పుడూ జాగ్రత్తగా వినాలి. వారు చెబుతున్నప్పుడు మీరు కూర్చున్న కుర్చీలో లేదా కూర్చున్న స్థానంలో కొంచెం ముందుకు వంగి వినాలి. వారికి అటెన్షన్ ఇస్తున్నామనే అభిప్రాయం  కలుగుతుంది. చెప్పాల్సిన విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా, దాపరికం లేకుండా చెబుతారు. ఇతరుల అభిప్రాయాలపట్ల సానుకూలంగా స్పందించాలి. ఎప్పుడూ కూడా సంభాషణలో ఇతరులను ఆకర్షించాలంటే ఎదుటి వారిని ఎక్కువగా మాట్లాడనివ్వాలి. మనం చెప్పాలనుకున్న విషయాలు, మనం చేయాలనుకున్న ఆలోచనలనూ ఇతరుల ఆలోచనలుగా చేసి వాటిని ఆమోదించాలి. విషయాలను మనం చూసే కోణంలో కాక ఇతరుల కోణంలోంచి చూడాలి, ఆలోచించాలి. మనం ఇతరులపట్ల చూపవలసింది గౌరవాన్ని అనే విషయం మరచిపోకూడదు. వారు చెప్పే మంచిని మనస్ఫూర్తిగా అభినందించాలి. సంభాషణలో అన్నీ నాకు తెలుసు అనుకొనే మనస్తత్వాన్ని వదులుకోవాలి. అవతలి వారు అభిప్రాయాన్ని విషయాన్ని పూర్తిగా చెప్పేంతవరకూ వినాలి. అంతేకానీ మధ్యలో  తొందరపడి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వకూడదు. సూచనలు ఇచ్చే ముందు వారు చెప్పిన విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొన్నాకే ఇవ్వండి. ఇతరులతో సంభాషించే ముందు సంభాషణను అభినందనతో ప్రారంభించాలి. ఇతరులు చేసిన పొరబాట్లను బహిరంగంగా విమర్శించకూడదు. ఇతరులను విమర్శించే ముందు మీ తప్పుల్ని మీరు అంగీకరించాలి. ఇతరులకు ఆజ్ఞాపూర్వకమైన సూచనలు ఇవ్వవద్దు. దానికి బదులుగా సలహాపూర్వక సూచనలు ఇవ్వాలి. సంభాషణలో ఎప్పుడూ కూడా ఇతరులను అవమానించకూడదు. ఇతరులలో ఉన్న మంచి గుణాలను గాని లేక ఇతరులలో మీరు ఆశిస్తున్న మంచి గుణాలను వారికి ఆపాదించి, వారిని ఆ విధంగా ఉండేలా మలచుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఇతరులను ఆకర్షించుకోగలుగుతాము. ఎప్పుడైనా సరే ఎదుటివారి మంచిని బయటకు చెప్పి వారిలో ఉన్న తప్పును ఇది ఇలా ఉండచ్చా?? అలా ఉంటుందని నాకు తెలియదు లాంటి మాటలతో చెప్పాలి. అలా చెబితే మన మాటల ద్వారా అది తప్పేమో అనే ఆలోచన చేసి చివరికి వారు దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇదీ మాటల్లో ఉన్న మర్మం, మాటకు ఉన్న ఆకర్షణ, మాటకున్న శక్తి.                                      ◆నిశ్శబ్ద.
[

Health

]

జుట్టు బాగా రాలిపోతోందా? ఈ నాలుగే అసలు కారణాలు..!

Publish Date:May 24, 2025

వేగంగా మారుతున్న జీవనశైలి ప్రభావం మన ఆరోగ్యంపైనే కాకుండా జుట్టుపై కూడా కనిపిస్తుంది.ఇప్పట్లో చాలామంది  జుట్టు రాలడం, జుట్టుకు సంబంధించి  అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి,  ఇతర కారణాల వల్ల, జుట్టు రాలే సమస్య తరచుగా మొదలవుతుంది. జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం, బట్టతల రావడం వల్ల ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకుని,  దాని పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం. జుట్టురాలడంలో ఈ 4 కారణాలే ప్రధానం... పోషకాహార లోపాలు.. ఇప్పట్లో ప్రజల  ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఇవి కూడా అనారోగ్యంగా తయారవుతున్నాయి.  శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, జుట్టు మీద కూడా లోతైన ప్రభావం చూపుతుంది. బయోటిన్ లేకపోవడం వల్ల  జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా విటమిన్ సి,  ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. జుట్టు రాలే సమస్య వేగంగా అరికట్టడానికి, జుట్టు తిరిగి ఆరోగ్యంగా పెరగడానికి  ఆరోగ్య నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు. ఫలితాలు వేగంగా ఉంటాయి. ఒత్తిడి,  శారీరక సమస్యలు.. భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం,  శారీరక ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేసే టెలోజెన్ ఎఫ్లూవియం అనే పరిస్థితిని ప్రేరేపిస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా, జుట్టు రాలడం పెరుగుతుంది.  జుట్టును దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు   జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా జుట్టు రాలడాన్ని నివారించడానికి మొదట ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించాలి . దీని కోసం  రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, రెగ్యులర్ వ్యాయామం,  హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్  ఫాలో కావడం చేయాలి. జన్యు కారణాలు.. కొన్నిసార్లు హెయిర్ ఫాల్ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల అంటే కుటుంబ చరిత్ర వల్ల కూడా రావచ్చు. దీనిని ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు, ఇది చాలా మందిలో బట్టతలకి దారి తీస్తుంది. అలోపేసియా అరేటా అనే పరిస్థితిలో  రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై దాడి చేస్తుంది.  ఫలితంగా జుట్టు రాలుతుంది. అలోపేసియా అరేటా శరీరంలో ఎక్కడైనా జుట్టు రాలడానికి కారణం అయినప్పటికీ, ఇది సాధారణంగా తల, ముఖాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యకు చికిత్స ఎంపికలు మారుతూ ఉంటాయి. . కార్టికోస్టెరాయిడ్స్, ఇమ్యునోథెరపీ లేదా ఆరోగ్య నిపుణులు సూచించిన ఇతర మందులు కూడా ఉండవచ్చు. జుట్టు సంరక్షణలో చెడు అలవాట్లు.. ఈ రోజుల్లో  స్టైలింగ్ కోసం జుట్టుపై అనేక రకాల వస్తువులను ప్రయోగిస్తున్నారు.  దీని కారణంగా జుట్టు పాడైపోతోంది.  దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు సంరక్షణ కోసం సరైన పద్ధతులను పాటించాలి. హీట్ స్టైలింగ్‌ను తగ్గించాలి.  బిగుతుగా ఉండే కేశాలంకరణను నివారించాలి.  జుట్టుకు సరైన ఉత్పత్తులను ఉపయోగించాలి.                                      *నిశ్శబ్ద.  గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...