నా బిడ్డను అన్యాయంగా అరెస్టు చేశారు.. కేసీఆర్ సెంటిమెంట్ ఓట్లు రాలుస్తుందా?

కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు. బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటున్నారు. బస్సు యాత్రకు ముందు ఓ టీవీ చానెల్ లో మాట్లాడిన ఆయన మేడిగడ్డ కుంగుబాటు చాలా చిన్నదనీ, అటువంటివి సహజమనీ చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఫోన్ ట్యాపింగ్ ను కూడా ఆయన అటువంటిది జరిగితే అది అధికారుల తప్పు తనకేం సంబంధం అని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇలా అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో  ముఖ్యమంత్రిగా తాను రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యంగా పని చేశానని చెప్పుకున్నారు. అయితే ఆయన మాటలను జనం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ పండించైనా సరే ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం మొదలు పెట్టారు.  తెలంగాణను పార్టీ పేరు నుంచే దూరం చేసుకున్న ఆయన ఇప్పుడు తెలంగాణ సాధకుడిని అని చెప్పుకుంటే జనం మెచ్చరనుకున్నారో ఏమో.. కుమార్తె అరెస్టు అంశాన్ని ఎత్తుకున్నారు.  తన బిడ్డను అక్రమంగా అరెస్టు చేశారంటూ సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నిస్తున్నారు.  మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన తరువాత చాలా రోజుల వరకూ కనీసం స్పందించలేదు. అదే కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేసినప్పుడు ఖండించిన కేసీఆర్.. తన కుమార్తె అరెస్టుపై మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తరువాత ఎన్నికల ప్రచారంలో కవితను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ సానుభూతి పొందే యత్నం చేస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా భువనగిరిలో ఆయన మాట్లాడుతూ..కవిత అరెస్టు విషయాన్ని ప్రస్తావించారు. తప్పుడు కేసులో కవితను బీజేపీ సర్కార్ జైల్లో పెట్టిందన్న కేసీఆర్ ఈ సంఘటన బీజేపీ కపటత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణించారు. తన కుమార్తెకు నిజంగా మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉంటే అసెంబ్లీ ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.    వాస్తవానికి కవిత అరెస్టైన సందర్భంలోనే తెలంగాణ సమాజం సీరియస్ గా తీసుకోలేదు.  ఆమె అరెస్టైన సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసనల పిలుపునకు ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. అప్పట్లో కవిత అరెస్టు సార్వత్రిక ఎన్నికలలో  కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు కూడా వెలువడ్డాయి.    తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ పితగా నిన్నటి వరకూ ప్రజల మన్ననలు అందుకున్న కేసీఆర్ తనయను ఈడీ అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదు. రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగలేదు. చాలా ఉదాశీనంగా వ్యవహరించారు. ఇక కవిత పట్ల ప్రజల నుంచే కాదు, పార్టీ శ్రేణుల నుంచి కూడా ఏ మంత సానుభూతి లభించలేదు. పైపెచ్చు అవినీతికి పాల్పడితే అనుభవించక తప్పదుకదా అన్న వ్యాఖ్యలూ వినవచ్చాయి. వాటన్నిటి కారణంగానే కేసీఆర్ కవిత అరెస్టుపై స్పందించేందుకు వెనుకాడారనీ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఇక లోక్ సభ ఎన్నికల ముంగిట కవిత అరెస్టును తురుఫు ముక్కగా వాడుకోవాలని చూస్తున్న కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది. 
Publish Date: Apr 26, 2024 1:44PM

గుడివాడ, గన్నవరం వైసీపీలో కనిపించని జోష్.. ముందుగానే చేతులెత్తేసిందా?

గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ  విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇరువురూ కూడా తెలుగుదేశంతో రాజకీయ అడుగులు మొదలు పెట్టిన వారే. అయితే కొడాలి నాని ముందుగా వైసీపీలోకి జంప్ కొడితే.. గత ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన తరువాత గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జంప్ కొట్టారు. ఇరువురూ కూడా తెలుగుదేశం అధినేతపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నవారే. వారిరువురూ వారి వారి నియోజకవర్గాలలో తిరుగులేని నేతలుగా ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు. తీరా ఈ ఎన్నికలలో నామినేషన్ వేసే సమయానికి వారిరువురి ధీమా సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. ఒక వైపు తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీ ఆర్భాటంగా ప్రజల భాగస్వామ్యంతో జరిగితే.. కొడాలి నాని, వల్లభనేని వంశీల నామినేషన్ ర్యాలీలో ప్రజా భాగస్వామ్యం మాట అటుంచి కనీసం పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం కనిపించలేదు. దీంతో ఇరువురిలోనూ ఓటమి భయం తీసుకువచ్చిన అసహనం పెచ్చరిల్లుతోందని అంటున్నారు.  ముందుగా కొడాలి నాని విషయం తీసుకుంటు.. భారీ ర్యాలీతో తన నామినేషన్ ర్యాలీ నిర్వహించాలని కొడాలి నాని భావించారు. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని పార్టీ క్యాడర్ కు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే గురువారం ( ఏప్రిల్ 25) కొడాలి నాని నామినేషన్ ర్యాలీ చూసిన వారు జోష్ కనిపించలేదంటున్నారు. అనుకున్న స్థాయిలో  జనం రాకపోవడంతో కవర్ చేసుకుందుకు తన నివాసం నుంచి కొడాలి నాని ర్యాలీని ఇరుకు సందుల గుండా నిర్వహించారు.  ఈ ర్యాలీలో నానితోపాటు వైసీపీ మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్‌, జడ్పీ  చైర్‌పర్సన్‌ ఉప్పల హారిక, పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. అనుకున్నస్థాయిలో  పార్టీ కార్యకర్తలు సైతం రాలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వచ్చిన వారు కూడా ఏదో మమ అన్నట్లుగా ర్యాలీలో పాల్గొన్నారు కానీ ఎవరిలోనూ నాని విజయం పట్ల ధీమా కనిపించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నినాదాలలో జోష్ కనిపించలేదనీ, ర్యాలీని ఇరుకు రోడ్ల గుండా నిర్వహించడమే  ఆ ర్యాలీకి స్పందన కనిపించలేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. మొత్తం మీద గుడివాడలో కొడాలి నాని నామినేషన్ ర్యాలీ వెలవెలబోయి ఆయన గాలి తీసేసిందని అంటున్నారు.   భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన చేయాలని ఎంతగా ప్రయత్నించినా జనం మాత్రం రాలేదు. అసలు నాని ప్రచారంలోనే ఆయనకు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిని ఇసుమంతైనా పట్టించుకోని నానికి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైన దాఖలాలు లేవు. పైపెచ్చు ఎక్కడికక్కడ నిలదీతలు, నిరసనలే వ్యక్తం అయ్యాయి. అదే ఆయన నామినేషన్ ర్యాలీలోనూ ప్రతిఫలించింది. దీంతో నామినేషన్ ర్యాలీని తెలుగుదేశం కార్యాలయం మీదుగా నిర్వహించి గొడవలు సృష్టించాలని నాని వర్గం చేసిన ప్రయత్నం కూడా ఆ రూట్ లో ర్యాలీకి పోలీసులు ససేమిరా అనడంతో విఫలమైంది. రెండు రోజుల ముందుగానే గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెనిగండ్ల రాము ఆ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ప్రజా భాగస్వామ్యంతో కళకళలాడింది. వేలాది మందితో సాగిన ఆయన నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించిందని స్థానికులు వ్యాఖ్యానించారు.    ఇహ ఇప్పుడు గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ నామినేషన్‌  సందర్భంగా జరిగిన ర్యాలీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ర్యాలీకి జనాలను తరలించేందుకు  పెద్దఎత్తున డబ్బు, మద్యం, బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ జరిగినా ప్రజలు మాత్రం ర్యాలీలో పాల్గొనేందుకు పెద్దగా ఉత్సాహం చూపలేదు.  ఆశించిన స్థాయిలో  జనాలు రాకపోవడంతో  వంశీ అసహనానికి లోనయ్యారు. నామినేషన్ అనంతరం ఆయన ప్రసంగంలో అది స్పష్టంగా ప్రతిఫలించింది.  గన్నవరం నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయిల్లో పలువురు నాయకులు తెలుగుదేశం గూటికి చేరిపోయారు. దీంతో క్షేత్రస్థాయిలో వైసీపీకి నాయకత్వమే లేకుండా పోయింది.  అదే గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ వేలాది మందితో ఆద్యంతం ఉత్సాహంగా జారింది. ఈ ర్యాలీతో పోల్చి నామినేషన్ ర్యాలీయే గన్నవరం ఫలితాన్ని తేల్చేసిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో వైసీపీలో జోష్ కనిపించడం లేదనీ, క్యాడర్ లో ఉత్సాహం కానరావడం లేదనీ, అదే ఆయా నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల ర్యాలీలో ప్రతిఫలించిందనీ చెబుతున్నారు.  
Publish Date: Apr 26, 2024 12:11PM

ఏపీలో భానుడి భుగభగలు

ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా శక్రవారం (ఏప్రిల్ 26) రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 174 మండలాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఇక రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 25)నంద్యాలలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే విజయనగరం జిల్లా రాజాంలో 45.5, అల్లూరి జిల్లా కొండై గూడెంలో 45.1, కడన జిల్లా ఖాజీపేటలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 
Publish Date: Apr 26, 2024 12:08PM

బాబూమోహన్ దిక్కులేని రాజకీయాలు!

అందుకే ఆయన రాజకీయంగా ఆయన పరిస్థితి దిక్కుమాలిన స్థితికి చేరుకుంది. గురువారం నాడు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వీల్ చైర్లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకీ మీరు నామినేషన్ వేసింది ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగానేగా అని అడిగితే, ‘ఛ.. ఛ.. ఆ పార్టీలో నేనెనెప్పుడు చేరాను? కాఫీ తాగుదువుగాని రా అని కేఏ పాల్ పిలిస్తే వెళ్ళాను. ఆయన నాకు కండువా కప్పి వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. కానీ నేను ఆ పార్టీలో చేరలేదు.. ఆ పార్టీ సభ్యుణ్ణి కూడా కాదు. ఆ పార్టీకి ఆరోజే టాటా చెప్పేశాను. స్థానిక ప్రజలు నన్ను నా స్వస్థలమైన వరంగల్ నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో నామినేషన్ దాఖలు చేశాను’ అని చెప్పుకొచ్చారు. నిజానికి బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నానని కె.ఎ.పాల్‌తో కలసి ప్రకటించారు. అప్పటి వరకు తాను వున్న బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్టు కూడా ప్రకటించారు. మధ్యలో ఓసారి వరంగల్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాబూమోహన్ బరిలో నిలిచే అవకాశం వుందని వార్తలు వచ్చినప్పుడు బాబూమోహన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తన పేరును బీఆర్ఎస్ పార్టీ ఇలా వాడుకుంటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. నిజంగానే బీఆర్ఎస్ ఈయనకు టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్టే బిల్డప్పు ఇచ్చారు. చివరికి ఇప్పుడు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బాబూమోహన్‌కి పిలిచి మరీ అందోల్ టిక్కెట్ ఇచ్చింది. మంత్రి పదవి కూడా కట్టబెట్టింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వున్న సమయంలో బాబూమోహన్ నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకి వచ్చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలో కొంతకాలం కేసీఆర్‌తో స్నేహబంధం కొనసాగించారు. ఎప్పుడైతే కేసీఆర్ తనను దూరం పెట్టడం ప్రారంభించారో, పొమ్మనలేక పొగపెట్టడం మొదలుపెట్టారో బాబూమోహన్ పార్టీకి క్రమంగా దూరమవుతూ, చివరికి పార్టీలో నుంచి బయటకి వచ్చేశారు. ఈసారి మకాం బీజేపీలో వేశారు. మొన్నటి ఎన్నికలలో అందోల్ టిక్కెట్ కోసం తన కొడుకుతోనే గొడవపడి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీకి చేరువై, ఆ తర్వాత దూరమై ఇప్పుడు ఇండిపెండెంట్‌గా మిగిలి, తనకు రాజకీయంగా కొత్త అయిన వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. రాజకీయంగా తన కెరీర్ ముగిసిన విషయాన్ని బాబూమోహన్ ఇంకా గ్రహించలేదు. ఏడుపదులు దాటిన బాబూమోహన్ ఇక రాజకీయాలకు స్వస్తి పలికి విశ్రాంతి బాటలో నడిస్తే బాగుంటుంది!
Publish Date: Apr 26, 2024 11:57AM

నిజామాబాద్ లో నెగ్గేదెవ‌రు? అప్పుడు పసుపు... ఇప్పుడు గల్ఫ్‌ బోర్డు!

నిజామాబాద్ లో హోరాహోరీ సమరం సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ హేమా హేమీలే! ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని బ‌ట్టి చూస్తే  ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు!  ఏడు సెగ్మెంట్లలో మూడు చోట్ల‌ బీఆర్‌ఎస్‌ గెలిస్తే..  కాంగ్రెస్‌, బీజేపీ రెండేసి చొప్పున పంచుకున్నాయి! పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు మూడు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి!  1) కాంగ్రెస్‌ నుంచి జీవన్‌ రెడ్డి పోటీ లో ఉన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ చేతిలో 15,822 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.  2) బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సర్పంచ్‌ నుంచి ఆర్టీసీ చైర్మన్‌ వరకు పదవులను చేపట్టడమే కాదు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగానూ పని చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి చేతిలో దాదాపు 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.  3) బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ సిటింగ్‌ ఎంపీ. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోరుట్ల నుండి శాసనసభకు పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10,305 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు.  శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన ఈ ముగ్గురూ వారి, వారి పార్టీల తరపున ఈ సారి నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, గత ఎన్నికలలో పసుపుబోర్డు తెస్తానని రాసిచ్చిన బాండ్ పేపర్, సొంత డబ్బులతో తెరిపిస్తానన్న షుగర్ ఫ్యాక్టరీ హామీలు ఈ సారి ఆయ‌న‌కు చిక్కులు తెస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై ప్రధానమంత్రితో ప్రకటన చేయించినా, ఆ తర్వాత ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేక‌పోవ‌డం,  పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి  అధికార పార్టీ గ్యారెంటీ ల్ని ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి అయ్యేలా చూసుకుందామని రేవంత్ రెడ్డి జోష్ పెంచారు.   ముగ్గురూ ఉద్ధండులే కావడంతో ఇక్కడ ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురికీ రాజకీయ పరపతి ఉండడం, ఆయా సామాజిక వర్గాల మద్దతు ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది.  ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి గెలుపును డిసైడ్ చేసేది గల్ఫ్‌, బీడీ కార్మికులని చెప్ప‌వ‌చ్చు.  ఉపాధి కోసం భర్తలు గల్ఫ్‌ దేశాలకు వెళ్లగా.. భార్యలు బీడీలపై ఆధారపడి పని చేస్తున్నారు. బీడీ, గల్ఫ్‌ కుటుంబాల ఓటర్లు ఐదున్నర లక్షల వరకూ ఉంటారు. వీరు తీసుకునే నిర్ణయం ఎన్నికల్లో కీలకం కానుంది. అందుకే, అన్ని పార్టీలూ వారిని ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నాయి.  1. ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి పది రోజుల క్రితం గల్ఫ్‌ సంఘాలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వారికిచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు పునరావాసం కల్పిస్తామని, గల్ఫ్‌లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు.  అలాగే, నియోజకవర్గంలో మున్నూరు కాపు, పద్మశాలి సామాజికవర్గ ఓటర్లు కూడా ఎక్కువే. బరిలో ఉన్న సిటింగ్‌ ఎంపీ అర్వింద్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికల్లో వీరి ఓట్లు గంపగుత్తగా అర్వింద్‌కు పడగా.. ఈదఫా ఇద్దరూ చీల్చుకునే అవకాశం ఉంది. పద్మశాలి ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఇక్క‌డ ఓట్లు చీలితే అది కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. 2. పదేళ్లలో వారికి కేసీఆర్‌ సర్కారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తన‌కు ఓట్లు కురిపిస్తాయని బీఆర్‌ఎస్‌ నేత భావిస్తున్నారు.  3. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా నిజామాబాద్ ఓట‌ర్ల‌ మద్దతు తమ కేనని బీజేపీ అంచనా వేసుకుంటోంది.  నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో మైనారిటీ ఓటర్లూ కీలకమే. ఇక్కడి పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల వరకూ మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. సగానికి సగం ఓట్లు తమకూ వస్తాయని బీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ముస్లిం ఓట్ల చీలిక తమకు లాభిస్తుందనే బీజేపీ ధీమాగా ఉంది.  ఇక్క‌డ ఓ విష‌యం మాట్లాడుకోవాలి. అదే నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ. ప్రతి ఎన్నికలో ఇక్కడ నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ ఎజెండాగా మారుతోంది. ఈ ఎన్నికలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే సెప్టెంబరు 17 నాటికి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డితో సహా నేతలు హామీలు ఇస్తున్నారు. చెరుకు రైతుల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు.  తనను గెలిపించగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి అర్వింద్‌తోపాటు పార్టీ నేతలు హామీలు ఇస్తున్నారు. రైతులను మోసం చేసేందుకే బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ ప్రకటనలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.  రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్‌ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం ప్రతిసారీ విలక్షణ తీర్పునే ఇస్తున్నారు నిజామాబాద్ ఓట‌ర్లు. రైతులే ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారు ఎటు మొగ్గితే వారే విజయాన్ని సాధిస్తున్నారు. ఎంపీ హోదాలో కవిత ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పసుపు బోర్డు తీసుకురాకపోవడంతో రైతులే 2019లో పోటీగా నామినేషన్లు వేశారు. పార్లమెంట్‌ చరిత్రలోనే ఏకంగా 186 మంది పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న కవితను ఓడించడంతోపాటు పసుపు బోర్డు తీసుకు వస్తామన్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు పట్టం కట్టారు. ఐదేళ్ల తర్వాత పసుపు బోర్డు ప్రకటించి జీవో జారీ చేసినా.. దానిని ఎక్కడ పెడతారో ఇంకా స్పష్టం చేయకపోవడంతో ఈసారి వారు తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది. ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే నిజామాబాద్ ఓటర్లు ఈసారి ఎవరిని గెలిపిస్తార‌నేది ఉత్కంఠ‌గా మారింది. మళ్లీ గెలిచి సత్తా చూపాలని అరవింద్‌, పార్లమెంటులో కాలు మోపాలని జీవన్‌ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ లు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే నిజామాబాద్ ఓటర్ ఈ సారి ఏ పార్టీ వైపు మొగ్గు చూప‌నున్నారనేది ఉత్కంఠ‌గా మారింది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌  
Publish Date: Apr 26, 2024 11:08AM

రెండో దశ పోలింగ్ షురూ

ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. అలాగే త్రిపుర, జమ్మూ కాశ్మీర్ లలో కూడా ఒక్కో స్థానానికి ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. రెండో దశలో మొత్తంగా 88 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా 1202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న  తొలి దశలో ఈ నెల 19న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తొలి దశలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ దశలో పోలింగ్ శాతం పెరిగేలా అన్ని చర్యలూ తీసుకుంది. ఇక బీజేపీ అయితే తొలి దశలో తమ పార్టీ పెర్ఫార్మెన్స్ పై ఒకింత అసంతృప్తితో ఉంది. దీంతో ప్రధాని మోడీ ప్రచారంలో దూకుడు పెంచారు. విపక్షాలపై విమర్శల డోస్ పెంచారు. మతపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ హిందుత్వ అజెండాను తెరపైకి తీసుకు వచ్చారు.  విపక్షాలు ఓటమి భయంతోనే మోడీ సమాజంలో విద్వేషాలు సృష్టించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి.  
Publish Date: Apr 26, 2024 10:57AM

జ‌గ‌న్ పసుపు చీర వ్యాఖ్య‌లు.. చెడుగుడాడేసిన చెల్లెళ్లు

అమాయ‌కమైన ముఖం పెట్టి అబ‌ద్ధాలను అల‌వోక‌గా చెప్ప‌డంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మించిన రాజ‌కీయ నేత మ‌రొక‌రు ఉండ‌రంటే అతిశ‌యోక్తి  కాదు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పైన‌.. సొంత చెల్లెళ్ల‌పైన‌కూడా ఎలాంటి సంకోచం లేకుండా అధారాలు లేని అభాండాలను, అసత్య వ్యాఖ్యలను అలవోకగా  చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ దిట్ట.  తాజాగా వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసు విష‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అదే చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌త్య‌కు గురైన వివేకా కేసులో కీల‌క ముద్దాయిగా వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్నారు. సీబీఐ సైతం వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ ప్ర‌మేయం ఉంద‌ని తేల్చింది.  అంతేకాదు.. క‌స్ట‌డీలోకి తీసుకొనే ప్ర‌య‌త్నం కూడా చేసింది. కానీ  తన అధికారాన్ని ఉపయోగించుకుని జగన్  అవినాశ్ అరెస్టు కాకుండా అడ్డుప‌డిన విష‌యం   తెలిసిందే. ఒక‌వేళ ఆనాడు అవినాశ్ అరెస్ట్ అయ్యిఉంటే.. వివేకా హ‌త్య‌కేసులో జ‌గ‌న్‌, భార‌తీరెడ్డిల ప్ర‌మేయంకూడా వెలుగులోకి వ‌చ్చేది. వివేకా హ‌త్య కేసులో ప్ర‌మేయం ఉన్న అవినాశ్ రెడ్డికి జ‌గ‌న్ అండ‌గా నిల‌వ‌డంపై ఆయ‌న చెల్లెళ్లు వైఎస్ ష‌ర్మిల రెడ్డి, సునీతా రెడ్డిలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ వ‌ర్సెస్ ష‌ర్మిల, సునీత‌ల వ్య‌వ‌హారం  ఏపీ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా వివేకా హ‌త్య‌కేసు విష‌యంపై చెల్లెళ్ల వ్యాఖ్య‌ల‌కు పెద్ద‌గా స్పందించ‌ని జ‌గ‌న్‌.  పులివెందుల స‌భ‌లో ఎదురుదాడి చేశారు. వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ ప్ర‌మేయం లేదంటూ .. ఆయ‌న ఓ చిన్న‌పిల్లోడు అని జ‌గ‌న్ చెప్ప‌డం అంద‌రినీ విస్మయపరిచింది. అంతేకాదు.. ప‌సుపు చీర క‌ట్టుకుంటే చంద్ర‌బాబు మ‌ద్ద‌తుదారులే అన్న‌ట్లుగా జ‌గ‌న్ మాట్లాడ‌టం చూస్తుంటే ఆయ‌నలో ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా,  ఎవ‌రు ప్ర‌శ్నించినా దాని వెనుక తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఉన్నాడ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌గ‌న్‌కు అల‌వాటుగా మారింది. చంద్ర‌బాబు పేరు ఎత్త‌కుండా జ‌గ‌న్ నిద్ర‌పోయిన రోజు లేద‌న‌డంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఇటీవ‌ల బ‌స్సు యాత్ర‌లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు జ‌గ‌న్‌పై రాయిదాడికి పాల్ప‌డ్డారు. ఆ రాయి ఎటుపోయిందో దొర‌క‌లేదు కానీ, జ‌గ‌న్ కు కంటిపై భాగంలో గాయ‌మైంది. రాయి వేయించింది కూడా చంద్ర‌బాబే అన్న‌ట్లుగా వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేశారు. హత్యాయత్నం అంటూ బిల్డప్ ఇచ్చారు. అయితే చివరికి ఆ బిల్డప్ నవ్వుల పాలైంది. జగన్ ప్రతిష్టను పలుచన చేసింది. దీంతో వివేకా హ‌త్యకేసులో  అవినాశ్‌ను వెనుకేసుకొస్తున్న జ‌గ‌న్ రెడ్డిని గట్టిగా నిలదీస్తున్న తన చెల్లెళ్లు షర్మిల‌, సునీత‌లపై జగన్ ఎదురుదాడికి, దిగజారుడు విమర్శలకు, వ్యాఖ్యలకు తెగబడ్డారు. వారు సంధించే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేని జ‌గ‌న్‌.. వారి వెన‌క ఉందికూడా చంద్ర‌బాబే అని పులివెందుల స‌భ‌లో మాట్లాడ‌టం ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ప‌సుపుపచ్చ చీర కట్టుకొని, చంద్ర‌బాబు ఇచ్చిన స్క్రిప్ట్ లు చ‌దువుతున్నారంటూ త‌న చెల్లెళ్ల‌పై అడ్డ‌గోలుగా జ‌గ‌న్ నోరుపారేసుకున్నారు. ప్ర‌తిప‌క్షాల‌పై అంటే రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేశార‌ని అనుచోవ‌చ్చు.. కానీ,  వివేకా హ‌త్య‌కేసులో న్యాయంకోసం పోరాడుతున్న చెల్లెళ్ల‌పైనా జ‌గ‌న్ ఇష్టానుసారంగా మాట్లాడ‌టం ప‌ట్ల‌ క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. పులివెందుల స‌భ‌లో జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీత‌లు స్పందించారు.. అన్న‌మాట్లాడిన ప్ర‌తిమాట‌ను గుర్తుచేస్తూ.. దానికి స‌మాధానం చెబుతూ జగన్ ను చెడుగుడు ఆడేశారు.  ప‌సుపుపచ్చ చీర క‌ట్టుకున్న‌వారంతా చంద్ర‌బాబు మ‌నుషులే అని జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల వైఎస్ ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం చేశారు. నేను పసుపుపచ్చ చీర కట్టుకున్నానట, చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానట. పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైటా ?   కలర్ కొన్నారా..? గతంలో సాక్షి ఛానెల్‌కి పసుపు రంగు ఉండేది కాదా..? జగన్ రెడ్డి ఈ విషయాన్ని ఎలా మరిచిపోయాడు అంటూ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ప‌సుపు మ‌నం వంట‌ల్లో కూడా వేస్తాం.. అలాని వైసీపీ శ్రేణులు ప‌సుపు వాడొద్ద‌ని జ‌గ‌న్ చెప్ప‌గ‌ల‌రా? పసుపు మంగళకర‌మైన రంగు అని స్వయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.  వైఎస్సార్ స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారని ష‌ర్మిల గుర్తు చేశారు. అయినా, ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్నవ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గునా అంటూ ష‌ర్మిల నిల‌దీశారు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్ర్కిప్ట్ ను చెల్లెళ్లు చదువుతున్నార‌ని జ‌గ‌న్ అన‌డంపై ష‌ర్మిల మండిప‌డ్డారు. స‌భ‌లో ఎవ‌రో రాసిచ్చిన స్క్రిప్ట్ ను మ‌క్కీకి మ‌క్కీ చ‌దివే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ త‌న‌ను చూడటం లేదని అనుకుంటుంద‌ట‌.. అలా ఉంది జ‌గ‌న్ తీరు అంటూ ష‌ర్మిల ఫైర్ అయ్యారు.  పులివెందుల స‌భ‌లో జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై వివేకానందరెడ్డి కుమార్తె సునీత‌రెడ్డికూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల రాయిదాడి ఘ‌ట‌న‌లో జ‌గ‌న్‌కు కంటి పైభాగంలో చిన్న‌ గాయ‌మైన విష‌యం తెలిసిందే. గాయ‌మై వారం రోజులు అవుతున్నా జ‌గ‌న్ క‌ట్టుమాత్రం తీయ‌డం లేదు. ఎన్నిక‌ల ప్ర‌చారం పూర్త‌య్యే వ‌ర‌కూ జ‌గ‌న్ ఆ క‌ట్టును అలానే ఉంచుతారా అనే డౌట్ ను ఏపీ ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే విష‌యంపై సునీతారెడ్డి మాట్లాడారు.. జ‌గ‌న్ కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది. వైద్యులు స‌రైన స‌ల‌హా ఇవ్వ‌లేద‌నుకుంటా.. జ‌గ‌న్ త్వ‌ర‌గా బ్యాండేజ్ తీయాల‌ని ఒక డాక్ట‌ర్ గా స‌ల‌హా ఇస్తున్న‌ట్లు సునీతా రెడ్డి సూచించారు. జ‌గ‌న్ పులివెందుల స‌భ‌లో ష‌ర్మిల‌ను, న‌న్ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌డం, ఐదేళ్లుగా నా తండ్రి హ‌త్య‌పై పోరాడుతుంటే రాజ‌కీయాలు అంట‌గ‌ట్ట‌డం నాకు బాధేసింది. సీఎంను ప్రాధేయ‌ప‌డుతున్నా.. ఇప్ప‌టికైనా నా పోరాటానికి స‌హాయం చేయండి అంటూ జ‌గ‌న్ రెడ్డిని సునీతా కోరారు. మొత్తానికి ఎన్నిక‌ల వేళ అవినాశ్ రెడ్డిపై ష‌ర్మిల‌, సునీత రెడ్డిలు చేస్తున్న వ్యాఖ్య‌ల్లో నిజం ఉంద‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని భావించిన జ‌గ‌న్‌.. పులివెందుల స‌భ వేదిక‌గా వారిపై ఎదురుదాడి చేయ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని సీబీఐ చెబుతున్నా జ‌గ‌న్ మాత్రం ఆయ‌న్ను వెనుకేసుకొని రావ‌డాన్ని క‌డ‌ప ప్ర‌జ‌లు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.
Publish Date: Apr 26, 2024 10:38AM

ఇంత కన్నా దిగజారుడుతనం ఉంటుందా?

తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు. ఆ తరువాత తల్లినీ చెల్లినీ దూరం నెట్టేసి ఈయనకు బంధుత్వాలు, అనుబంధాలూ కూడా లేవా అని జనం ముక్కున వేలేసుకునేలా చేశారు. సరే ఎవో కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలు అనుకుంటే.. షర్మల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆమెను టార్గెట్ చేస్తూ ఆమె వ్యక్తిత్వ హననానికి సొంత సోషల్ మీడియా పాల్పడినా పట్టించుకోకుండా జగన్ తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు. ఇక ఇప్పుడు పులివెందులలో నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్  చేసిన ప్రసంగం ఒక మనిషి ఇంత దిగజారగలడా అని ఆయన ప్రత్యర్థులు సైతం ఆశ్చర్య పడేలా చేసింది. తన ప్రసంగంలో జగన్ షర్మిల కట్టుకున్న చీరను సైతం ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.    షర్మిల పసుపు చీర కట్టుకోవడాన్ని కూడా తప్పుపడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ లెవల్ లో విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. పసుపు చీర కట్టుకున్న షర్మిల వైఎస్ వారసురాలు కాదు అని అర్ధం వచ్చేలా జగన్ మాట్లాడడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని  పక్కన పెట్టుకుని, ఆయనకు రక్షణగా నిలిచి పార్టీ టికెట్ ఇచ్చిన  జగనా వైఎస్ వారసత్వం గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా షర్మిల కట్టుకున్న చీరను సైతం జగన్ తప్పుపడ్డడాన్ని, వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించారు. ఇక కొందరు నెటిజనులైతే జగన్ భార్య భారతి  పసుపు చీర కట్టుకుని ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తూ.. భార్యపైన కూడా అలాంటి వ్యాఖ్యలు చేయగలవా జగన్ అ ంటూ సవాల్ చేస్తున్నారు.  
Publish Date: Apr 25, 2024 6:00PM

అవినాష్ పాపం చిన్న పిల్లోడంట!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.  తాజాగా జగన్  వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులలో ఒకడైన అవినాష్ రెడ్డిని ‘చిన్న పిల్లోడు’ అంటూ సంబోధించి మరోసారి నెటిజనులకు అడ్డంగా దొరికి పోయారు. గురువారం (ఏప్రిల్ 24) పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సభలో ఆయన అవినాష్ రెడ్డిని ‘చిన్న పిల్లోడు’ అని పేర్కొన్నారు. ఈ చిన్నపిల్లోడి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుల్లో అవినాష్ రెడ్డి ఒకరు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఆయన బెయిలు రద్దు పిటిషన్ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో కడప లోక్ సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని  చిన్నపిల్లోడిగా అభివర్ణిస్తూ జగన్ ఆ ఆరోపణలను తుడిచేసే ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదు కనుకనే ఆయనకు కడప లోక్ సభ టికెట్ ఇచ్చినట్లు చెప్పారు.  అయినా అవినాష్ రెడ్డి అమాయకత్వం గురించి జగన్ కు స్వయానా మేనమావ అయిన రవీంద్రనాథ్ రెడ్డి గతంలోనే బాహాటంగా చెప్పేశారు. వివేకా మృతదేహానికి కుట్టు వేస్తుంటే అవినాష్ రెడ్డి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ నిలబడిపోయారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అదికూడా కమలాపురంలో ఓ బహిరంగ సభలో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకునే ఆ మాట చెప్పారు.  ఇప్పుడు జగన్ కూడా అదే చెబుతున్నారు. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అతడికి ఏమీ తెలియదు అంటున్నారు.  వివేకా హత్య కేసులో అవినాష్  నిందితుడని అనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ తేల్చి చెప్పింది. కోర్టులూ అదే చెబుతున్నాయి. అయినా జగన్ అవినాష్ రెడ్డిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్లు పేలుతున్నాయి.  
Publish Date: Apr 25, 2024 5:23PM

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు గడువు గురువారం (ఏప్రిల్ 24) మధ్యాహ్నం మూడుగంటలతో ముగిసింది.  ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4, 210 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక తెలంగాణలోని 17లోక్ సభ స్థానాలకు గాను 603 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ల గడువు ముగిసింది.  అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల నామినేషన్లను రేపు పురిశీలిస్తారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకూ గడువు ఉంది.  మే 13న పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి.
Publish Date: Apr 25, 2024 5:10PM

జగన్ కు సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ? వైసీపీ మైండ్ బ్లాక్

గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది. హత్య కేసు నిందితులకు వత్తాసు పలుకుతున్న జగన్ పై సొంత కుటుంబీకులే విమర్శలు గుప్పిస్తుండటం, కేసు దర్యాప్తు, విచారణలో వేళ్లన్నీ వైసీపీ కడప లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి అవినాష్ రెడ్డివైపే చూపుతుండటం, ఆ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారంటూ జగన్ పై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతుండటం ఎన్నికల సమయంలో   వైసీపీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేళ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు నుంచి గ్యాగ్ అర్డర్ తెచ్చుకున్నారు. అయితే కడప కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి, పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవిలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు బుధవారం విచారణకు రావాల్సి ఉండగా ఆ బెంచ్ న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనడంతో విచారణ వాయిదా పడింది. కొత్త బెంచ్  ముందుకు ఆ కేసు విచారణకు రానుంది.   అయితే  వివేకా హత్య పై మాట్లాడకూడదంటూ కడప కోర్టు పేర్కొన్న జాబితాలో లేని సౌభాగ్యమ్మ సరిగ్గా జగన్ పులివెందులలో నామినేషన్ వేసే సమయానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో వివేకా హత్య కేసులో నిందితులకు మద్దతుగా నిలబడుతున్నావంటే సూటిగా పేర్కొని వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. వాస్తవానికి ఈ సారి ఎన్నికలలో జగన్ కు తెలుగుదేశం కూటమి మాత్రమే కాదు సొంత కుటుంబం కూడా ప్రతిపక్షంగా మారింది. వివేకా హత్యకేసులో న్యాయం కోసం పోరాడుతున్న చెల్లెళ్లనే పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణిస్తూ వారు తెలుగుదేశం స్క్రిప్టు చదువుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ విమర్శల గుప్పిస్తోంది. అక్కడితో ఆగకుండా షర్మిల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు జగన్ స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ సోషల్ మీడియాలో పేర్కొన్న అంశాలనే ఎన్నికల ప్రచార సభలలో ప్రస్తావిస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే  వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ  జగన్ కు ఓ బహిరంగ లేఖ ద్వారా షాక్ ఇచ్చారు. ఆ లేఖ కూడా జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలోనే విడుదల చేశారు. ఆ లేఖలో   నీ తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు నువ్వెంత మనోవేదన చెందావో వివేకా హత్య జరిగిన నాటి నుండి నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదనకు గురయ్యింది. ఇటువంటి సందర్భంలో అన్నగా చెల్లికి అండగా నిలవాల్సిన నువ్వు ఇలా వివేకా హత్యకు కారణమైన వారికి రక్షణగా నిలవడం  తగునా జగన్..? అంటూ సూటిగా ప్రశ్నించారు.  సునీత కు అండగా నిలబడిన నీ సొంత చెల్లి షర్మిలను కూడా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నువ్వు నోరెత్తకపోవడమేంటంటూ నిలదీశారు. సరిగ్గా జగన్ నామినేషన్ దాఖలు చేసే రోజునే జగన్  కు ఆమె  పిన్నమ్మ బహిరంగ లేఖ రాయడం వైసీపీని దిగ్భ్రమకు గురి చేసింది. ఆమె సూటిగా, సుత్తి లేకుండా చెల్లెళ్ల పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరును ఆ లేఖలో ఎండగట్టడంతో ఆ లేఖపై ఎలా స్పందించాలో తెలియక జగన్ సహా వైసీపీ నేతలకు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. అంతే కాకుండా జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న, దర్యాప్తు సంస్థలు వేలెత్తి చూపుతున్న అవినాష్ రెడ్డికి రక్షణగా నిలుస్తున్న జగన్ ను తప్పుపట్టడంతో జగన్ డిఫెన్స్ లో పడ్డట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సౌభాగ్యమ్మపై కూడా షర్మిల, సునీతమ్మల వలె ఎదురుదాడికి దిగుతుందా? ఆమెపై కూడా పెయిడ్ ఆర్టిస్ట్ ముద్ర వేస్తుందా చూడాల్సి ఉంది. జగన్ అండ్ కో  మేరకు చంద్రబాబు స్క్రిప్ట్ చదివేవారి జాబితాలో ఇప్పుడు సౌభాగ్యమ్మను కూడా చేరుస్తారా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వివేకా హత్య కేసు జగన్ కు ఈ ఎన్నికల వేళ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నదనడంలో సందేహం లేదు.  
Publish Date: Apr 25, 2024 4:19PM

బెజవాడ సెంట్రల్ బరిలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల

సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు. వారిలో కొందరు తమదైన ముద్ర వేశారు. మరి కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే ఇందులో జొన్నవిత్తుల ఏ కోవలోకి వస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ సారి ఎన్నికలలో సినీ రంగానికి చెందిన పలువురు ఎన్నికల బరిలో నిలిచిన సంగతి విదితమే. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే హిందూపురం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మంత్రి రోజా వైసీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికలలో విజయం సాధించిన రోజా ఈ సారి ఎదురీదుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక విషయానికి వస్తే జొన్నవిత్తుల విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. విజయవాడ అంటేనే రాజకీయాలకు క్యాపిటల్ వంటిది. అటువంటి విజయవాడ నుంచి జొన్నవిత్తుల ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగి ఏ మేరకు ప్రభావం చూపుతారని పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు.  వీరితో పోటీలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది కాలమే నిర్ణయిస్తుంది.  
Publish Date: Apr 25, 2024 3:30PM

EVM మళ్ళీ మళ్ళీ గెలిచింది, గెలుస్తుంది!

ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది. ఓటింగు యంత్రాలను వ్యతిరేకించే వారి వాదన మన దేశ సాంకేతికతను అవమానించేలా ఉంటుంది. ప్రపంచంలో ఫలానా దేశాల్లో వాడటం లేదు, ఫలానా దేశాలు నిషేధించాయి కనుక ఓటింగు యంత్రాలు నమ్మదగినవి కావు అని వాదిస్తారు. బుర్ర తక్కువ లేదా భారత దేశం కనుగొన్న ఓటింగు యంత్రాలను మేము ఎందుకు వాడాలి అనే బలుపుతో ఆయాదేశాలు వాడటం లేదు అని కోణంలో ఆలోచించరు.  లక్షలాది ఓటింగు యంత్రాలు గల్లంతు అయ్యాయి అనే ఆరోపణ రాజకీయ పరమైంది. ఒకవేళ ఓటింగు యంత్రాలు దొంగిలించబడ్డా... వాటితో ఏమీ చేయలేరు.  ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంతమంది దుమ్మెత్తి పోసినా,  ఓటింగు యంత్రాలుతోనే ఎన్నికలు నిర్వహిస్తున్న భారత ఎన్నికల సంఘం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది. ఈవిఎంలపై దేశంలో పెద్ద ఎత్తున‌ చర్చ సాగుతోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఎన్నికల కమిషన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని అంటోంది. సాంకేతిక సమస్యలపై ఈవిఎంలు మొరాయించే అవకాశం మాత్రమే ఉంది గానీ అక్రమాలకు పాల్పడే లేదా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని అంటోంది.  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు సుర‌క్షిత‌మైన‌వ‌నీ, ఇవి భారతదేశానికి గర్వకారణమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర చెబుతున్నారు.  EVM సింగిల్ చిప్ ప్రోగ్రామ్ మాత్రమేన‌నీ, ఫ్రీక్వెన్సీ లేదనీ.. కాబట్టి హ్యాకింగ్ ప్రశ్నే లేదని తెలిపారు. వాటిని ట్యాంపరింగ్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. భార‌త దేశం ఎంతో వేగంగా, సకాలంలో, ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను  అందించగలదో తెలుసుకోవడానికి అనేక దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు.  ఈవీఎం అనేది సింగిల్ చిప్ ప్రోగ్రామ్ అని సుశీల్‌ చంద్ర తెలిపారు. దీనిని ట్యాంపరింగ్‌ చేయలేరని, హ్యాకింగ్ ప్రశ్నే తలెత్తదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో VVPAT ఆడిట్ ట్రయల్ కూడా ఉంటుందన్నారు. దీంతో ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని వివరించారు. చాలా తక్కువ సమయంలో వేగంగా, ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు భారత్‌లో ఎలా సాధ్యం అని పలు దేశాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు.  ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత, అవగాహన చాలా కీలకమని, అందువల్ల ఈవీఎంల క్రమబద్ధమైన నిల్వ, నిర్వహణ, తరలింపు కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, చెక్‌లిస్ట్ అనుసరించడం చాలా కీలకమని ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే చెబుతున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 25, 2024 2:24PM

జగన్.. బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు సారూ!?

ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది. రాయిదాడి సంఘటనను హత్యా యత్నం అంటూ మీడియాలో వైసీపీ నేతల ప్రకటనలతో సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆ దాడిని ఖండిస్తూ  ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు,  జనసేనాని పవన్ కల్యాణ్ కూడా దాడి ఘటనను ఖండిస్తూ ప్రకట చేశారు. సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యకు కూడా డిమాండ్ చేశారు. సరే ఒకింత ఆలస్యమైనా సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యాలతో పాటు ఇతర ఫిర్యాదులను కూడా పరిగణననలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలిస్ పై బదలీ వేటు వేసింది. అక్కడకు ఆ అంకం ముగిసినట్లుగానే భావించాలి. కానీ జగన్ లో మాత్రం ఆ దాడి నుంచి ఇంకా సానుభూతి పిండుకోవచ్చన్న దింపులు కళ్లెం ఆశ మిగిలే ఉన్నట్లుంది. అందుకే ఇప్పటికీ ఆయన నుదుటి మీద కనుబొమలను కవర్ చేసేలా బ్యాండ్ ఎయిడ్ ను అలాగే కొనసాగిస్తున్నారు. వాస్తవానికి రాయి తగిలిందని చెప్పి నుదురు పట్టుకున్న తరువాత జగన్ కు నుదుటిపై గుండ్రంగా ఒక చిన్న బ్యాండ్ ఎయిడ్ వేశారు. అయితే ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పదుల సంఖ్యలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్న తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ సైజు ఒక్క సారిగా పెరిగిపోయింది. నుదుటి భాగాన్నే కాకుండా కనుబొమను కూడా వకర్ చేస్తూ పెద్ద బ్యాండ్ ఎయిడ్ ఇప్పుడు ఆయనకు సహజ కవచకుండలంగా మారిపోయి కనిపిస్తున్నది.  హత్యాయత్నం అని వైసీపీ ఎంతగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించినా జనం నమ్మలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే కాదు చివరాఖరికి సొంత చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్ పై జరిగింది గులకరాయి దాడే అని పదే పదే చెబుతున్నారు. సరే అది పక్కన పెడితే గాయం తగిలి ఇన్ని రోజులైనా వైద్యులు ఇంకా జగన్ నుదుటిపై ఉన్న బ్యాండ్ ఎయిడ్ ను ఎందుకు తీయలేదా అని వైసీపీ శ్రేణుల్లోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా సానుభూతి కోసమే ఇబ్బంది అయినా బ్యాండ్ ఎయిడ్ ను అలా భరిస్తూ కొనసాగిస్తున్నారా అన్న జోకులు కూడా పేలుతున్నాయి. ఇక ఆంధ్రాలో అయితే జగన్ స్టైల్ లో నుదుటిమీద బ్యాండ్ ఎయిడ్ పెట్టుకుంటూ యూత్ ఓ లెవల్ లో  ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసే దాకా జగన్ నుదుటిమీద ఆ బాండ్ ఎయిడ్ ను అలా ఓ ఆభరణంలా మెయిన్ టెయిన్ చేస్తారేమో అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు.  
Publish Date: Apr 25, 2024 2:02PM