బెజవాడ సెంట్రల్ బరిలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల

సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు. వారిలో కొందరు తమదైన ముద్ర వేశారు. మరి కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

అయితే ఇందులో జొన్నవిత్తుల ఏ కోవలోకి వస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ సారి ఎన్నికలలో సినీ రంగానికి చెందిన పలువురు ఎన్నికల బరిలో నిలిచిన సంగతి విదితమే. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే హిందూపురం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మంత్రి రోజా వైసీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికలలో విజయం సాధించిన రోజా ఈ సారి ఎదురీదుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

ఇక విషయానికి వస్తే జొన్నవిత్తుల విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. విజయవాడ అంటేనే రాజకీయాలకు క్యాపిటల్ వంటిది. అటువంటి విజయవాడ నుంచి జొన్నవిత్తుల ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగి ఏ మేరకు ప్రభావం చూపుతారని పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు.  వీరితో పోటీలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది కాలమే నిర్ణయిస్తుంది.