రెడ్లను పైకి తెచ్చేందుకే జగన్ బీసీలను అణగదొక్కుతున్నారు!!

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను నిన్న బీసీ సమాఖ్య చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు పలువురు బీసీ నాయకులు కలిశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. అమరావతిలో ఈరోజు మీడియాతో మాట్లాడిన యనమల.. బీసీలను అణగదొక్కుతున్న జగన్ కు అభినందనలు తెలిపేందుకు వీరు వెళ్లారా? అని ప్రశ్నించారు. బీసీలకు జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి అన్యాయం చేశారని యనమల విమర్శించారు. బీసీలపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఆదరణ-1 పథకాన్ని వైఎస్ రద్దు చేస్తే, ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ ఆదరణ-2 పథకాన్ని రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీయేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారనీ, ఇప్పుడు దాన్ని 40కే పరిమితం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత సామాజికవర్గాన్ని పైకి తెచ్చేందుకే జగన్ బీసీలను అణగదొక్కుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారం చేపట్టి 2 నెలలు కాకముందే ముగ్గురు బీసీలను హతమార్చారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.