భారత్-పాక్ లకు వరల్డ్ బ్యాంక్ బ్రేక్...
posted on Dec 13, 2016 2:50PM

పాకిస్థాన్ ఉరి దాడులు జరపడం.. దానికి ప్రతీకారంగా భారత్ సర్జికలు దాడులు చేయడం.. ఇక ఆ తరువాత సరిహద్దు ప్రాంతంలో యుద్ద వాతావరణమే నెలకొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందం కూడా తెరపైకి వచ్చింది. ఈ జలాల ఒప్పందంపై ప్రస్తుతం రెండు దేశాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ దూకుడికి ప్రపంచ బ్యాంక్ బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రక్షించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని.. రెండు దేశాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని రెండు దేశాలకు సూచించింది. ఈ సందర్భంగా వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్.. రెండు దేశాల ఆర్థిక మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాసినట్టు సమాచారం. అంతేకాదు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చైర్మన్ లేదా న్యూట్రల్ ఎక్స్పెర్ట్ నియామకాన్ని కూడా వరల్డ్ బ్యాంక్ నిలిపేసింది.
కాగా జమ్ముకశ్మీర్లో భారత్ చేపడుతున్న కిషన్గంగ, రాట్లె జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్థాన్ ప్రపంచబ్యాంక్కు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. ఆ దేశం ఫిర్యాదు మేరకు గత నెలలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ను ఏర్పాటుచేసి, న్యూట్రల్ ఎక్స్పెర్ట్ను నియమిస్తామని, డిసెంబర్ 12లోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. అయితే దీనిపై భారత్ తీవ్ర నిరసన తెలపడంతో వెనుకంజ వేసింది.