బొత్సతో లీకులు ఇప్పిస్తున్నదెవరు? జగనా? విజయసాయిరెడ్డా?

జరిగింది చెబుతారు... జరగబోయేది చెబుతారు... లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు... ఏదో చెబుతూ కనికట్టు చేస్తారు... ఏం మాట్లాడుతున్నారో అసలు అర్ధమే కాదు... కానీ, కీలక వ్యాఖ్యలే చేస్తారు... ఈ మాటలన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా? మీరు గెస్ చేసేశారు? అవును బొత్స సత్యనారాయణ గురించే. జగన్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే, పరిపాలనాపరమైన అంశాలతోపాటు  రాజకీయంగా వైసీపీ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్నీ ప్రెస్ మీట్ పెట్టిమరీ చెప్తున్న బొత్స, తిరిగి వెనువెంటనే వాటిని ఖండించడం రొటీన్ గా మారింది.

అయితే, రాజధాని అమరావతి వివాదం దగ్గర్నుంచి... బీజేపీ-వైసీపీ పొత్తు వరకు బొత్స చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. అందుకే, విపక్ష నేతలతోపాటు, కేంద్ర ప్రభుత్వంపై బొత్స చేస్తున్న కామెంట్స్ పై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే, మొదటి నుంచి బొత్స చేస్తున్న ప్రతి ప్రకటన వెనుకా, బలమైన కారణం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే, ప్రభుత్వం తీసుకునే ప్రతి వివాదాస్పద కీలక నిర్ణయాలన్నీ ముందుగా బొత్సతోనే చెప్పిస్తున్నారు. ఆవిధంగా రాజధాని మార్పునకు సంబంధించి మొదట హింట్‌ ఇచ్చింది కూడా బొత్స సత్యనారాయణే. డైరెక్టుగా రాజధాని తరలింపు ఉంటుందని చెప్పకపోయినా, అమరావతిలో ఏముందంటూ కామెంట్ చేశారు. అప్పుడు చేసిన కామెంట్... ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు అతికినట్టు సరిపోతోంది. అలాగే మరోసారి అమరావతిలో శ్మశానం తప్ప ఏముందని కామెంట్ చేసినప్పుడే, రాజధానిని ఇక్కడ ఉంచే ఉద్దేశం లేదన్న అంశం అర్థమైపోయింది. మంత్రిస్థాయిలో బొత్స చేసిన వ్యాఖ్యలు అమరావతిలో అలజడులు, ఆందోళలకు కారణమయ్యాయి. అయితే, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని భావించిన బొత్స, తరువాత తీరిగ్గా తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మీడియా ముందుకొచ్చారు. ఆ తరువాత మళ్లీ కట్టుబడి ఉన్నానంటూ కామెంట్ చేస్తారు. ఇలా కొన్ని  ఔననీ, ఇంకొన్ని కాదని చేస్తున్న వ్యాఖ్యల వెనుక, బొత్స ఒక్కరే లేరని, ఆయనతో ఎవరో అలా మాట్లాడిస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు బొత్స కామెంట్స్ వెనుక పొలిటికల్‌ గేమ్‌ ఉందంటున్నారు.

రాజధాని విషయంలో అనేక వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన బొత్స, ఇప్పుడు ఎన్డీయేతో పొత్తు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అవసరమైతే ఎన్డీయేలో కలుస్తామంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. అయితే, బొత్స డైరెక్టుగా ఆ మాట అనకపోయినా... ఏపీ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాం...ఎంతమంది గడ్డాలైనా పట్టుకుని బతిమలాడతాం అంటూ కామెంట్ చేశారు. జగన్‌ ఢిల్లీ టూర్‌లో ప్రధానిని, అమిత్‌షాను, కేంద్ర పెద్దలను కలిసి తరువాత.. వెంటనే బొత్స నుంచి ఈ కామెంట్ రావడంతో కేంద్రంలో వైసీపీ చేరడం ఖాయమనే చర్చ పెద్దఎత్తున జరిగింది. అమరావతి విషయంలో మొదటి నుంచి బొత్స చెప్పిందే జరిగిందంటున్న విపక్ష నేతలు, రాబోయే రోజుల్లో వైసీపీ ఎన్డీయేలో చేరడం ఖాయమని, అందుకే బొత్సతో  లీకులు ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగింది. బొత్స వ్యాఖ్యల ప్రకంపనల ప్రభావంతో, ఏకంగా జనసేన అధినేత పవన్‌ స్పందించాల్సి వచ్చింది. బీజేపీ-వైసీపీ పొత్తు ఉంటే, తాము బీజేపీకి దూరం జరుగుతామన్నారు. బొత్స మాటల సునామీకి పవన్ కామెంట్లే ఎగ్జాంపుల్‌.

బొత్స మాటలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సొంతంగా చేస్తున్నవి కాదన్నది మాత్రం తెలుస్తోంది. తెర వెనుక ఉండి, ఎవరో బొత్సతో మాట్లాడిస్తున్నారన్న విషయం, అర్థమవుతోందన్న మాటలు వినపడ్తున్నాయి. ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా, రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న బొత్స, ఆలోచన లేకుండా చెయ్యరని, పొలిటికల్ మైండ్ గేమ్‌లో భాగంగా, ఆయనతో ప్రకటనలు చేయిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా బొత్సతో మాట్లాడిస్తున్నారని, అది చర్చనీయాంశం అయ్యేలా చూస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. బొత్సతో లీకులిప్పించి, ప్రజాభిప్రాయాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి, రాజధాని మార్పు నుంచి ఎన్డీయేలో వైసీపీ చేరడం గురించి, ఆయన లీక్స్‌ చేశారో, ఏదో అలా మాట్లాడారో తెలియదు కానీ, ఆ మాటలు మాత్రం సంచలనం అవుతున్నాయి. ఆయన చెప్పినవి కొన్ని నిజం కావడంతో, ఆయన  ప్రస్తుతం చెబుతున్నవి కూడా రేపు నిజమవుతాయన్న చర్చ జరుగుతోంది.