చంద్రబాబు వల్లభనేని వంశీని పక్కన పెట్టేసారా?
posted on Feb 5, 2013 1:32PM
కొత్తనీరు వచ్చి పాత నీటిని బయటకి పంపినట్లే పార్టీలోకి కొత్త నాయకులు రాగానే పాతవారు పనికి రాకుండాపోతారు. అంతకాలంగా వారు పార్టీకి చేసిన సేవలకన్నా, వారి వల్లజరిగిన తప్పులే ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది. ఇక అప్పుడు, వారికి తప్పని పరిస్థితుల్లో పార్టీనివీడి బయటకి వెళ్ళక తప్పదు. వివిధ పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ అనుభవం ఎప్పడు ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటుంది.
ఇక విషయానికి వస్తే, ఒకనాడు దేవినేని నెహ్రు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అయితే, ఆ తరువాత వచ్చిన కొందరు నాయకులు ఆయనని పార్టీ నుండి బయటకి సాగనంపే వరకు విశ్రాంతి తీసుకోలేదు. మళ్ళీ కొద్ది కాలం క్రితం, నందమూరి వీరాభిమాని కొడాలి నానికి అటువంటి అనుభవమే ఎదురయింది. దానితో అయన కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళక తప్పలేదు.
ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీ వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు కృష్ణా జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుండీ చాలా చురుకుగా పనిచేసిన ఆయనను, ప్రస్తుతం కేసినేని నాని వర్గం పక్కకు తప్పించి చంద్రబాబు పాదయాత్రను తన అదుపులోకి తీసుకొంది. అయినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం తనను పట్టించుకోకపోవడంతో, వంశీ క్రమంగా ఆయన పాదయాత్రలో కనిపించడం మానేశారు. ఒకవేళ, తెలుగు దేశం పార్టీ ఆయనతో అదే విధంగా వ్యహరిస్తే, ఆయన కూడా కొడాలినాని వలెనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే, ఒక కొత్త నాయకుడు రాగానే పాతవారిని పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేస్తారనే అపవాదు చంద్రబాబు నిజం చేసినవారవుతారు.