కేసీఆర్ ని గద్దె దించే వరకు పోరాడుతూనే ఉంటా! రేవంత్ రెడ్డి
posted on Aug 20, 2015 3:41PM
తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మరికొందరు తెదేపా కార్యకర్తలను పోలీసులు మెహబూబ్ నగర్ కొండగల్ మార్కెట్ యార్డు వద్ద అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఆయన నియోజక వర్గంలో ఉన్న మార్కెట్ యార్డుకి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేసారు. కానీ, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో ఆయన తను అంచరులతో కలిసి అక్కడికి చేరుకొని నిరసనలు తెలుపుతున్నప్పుడు పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. భూమిపూజ కార్యక్రమం పూర్తయ్యే వరకు వారిని స్టేషన్లో ఉంచి తరువాత విడుదల చేసారు.
స్థానిక ఎమ్మెల్యేనయినా తనకు ప్రొకాల్ ప్రకారం ఆహ్వానం పంపకపోగా తనను పోలీసుల చేత అరెస్ట్ చేయించినందుకు రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈవిధంగా అరెస్టులతో తనను ఎవరూ భయపెట్టలేరని, తెదేపాను ఎంతగా అణగద్రొక్కే ప్రయత్నిస్తే మరినత శక్తివంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోరాడుతామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దె దించేవరకు తన పోరాటం సాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.