యలమంచిలిలో మల్లగుల్లాలు



విశాఖ జిల్లా యలమంచిలి నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుందరపు విజయ్‌కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్నా, మరోపక్క మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పేరు వినిపిస్తోంది. సుందరపు అభ్యర్థిత్వాన్ని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుతోపాటు ఆయన అనుచరులు వ్యతిరేకిస్తుండడంతో అభ్యర్థి విషయంలో స్పష్టత కనిపించడంలేదు. మరోపక్క ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు కూడా హఠాత్తుగా రూటు మార్చారు. చంద్రబాబుతో మంతనాలు జరిపిన ఎమ్మెల్యే యలమంచిలి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తానని కార్యకర్తలతో చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రకటనలు తెలుగుతమ్ముళ్లతోపాటు, కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఇక రాష్ట్ర విభజన దెబ్బకు.. కాంగ్రెస్‌పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు కనుచూపుమేరలో కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీ నుంచి ఆపార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పేరు వినిపిస్తోంది.