తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన

 

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తుగ్లక్ పాలన నడుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చడానికి తపిస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి కృషి చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లబ్దిదారుల జాబితా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల కోసం మళ్లీ దరఖాస్తులు కోరడం ఏమిటని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేసీఆర్ శాడిజంతో ప్రజలను హింసించడానికే ప్రభుత్వ పథకాల కోసం, పెన్షన్ల కోసం, కుల ధ్రువీకరణ పత్రాల కోసం జనాన్ని క్యూలో నిలబెడుతున్నారని విమర్శించారు.