ఆళ్ళగడ్డలో పోటీ చేయం.. టీడీపీ
posted on Oct 20, 2014 6:06PM
ఒక సస్పెన్స్కి తెరపడింది. వైసీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ వైసీపీ తరఫున బరిలో నిలిచారు. అయితే ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే సందేహాలు ఇప్పటి వరకూ వున్నాయి. అయితే ఆ సస్పెన్స్కి తెరపడింది. ఆళ్ళగడ్డ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టదని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ప్రకటించారు. వైసీపీకి చెందిన మైసూరారెడ్డి తదితరులు తమను కలసి ఆళ్ళగడ్డలో అభ్యర్థిని పోటీకి నిలపరాదని అభ్యర్థించారని, అందుకే అక్కడి నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించామని తెలిపారు.