సుబ్బిరామి రెడ్డి కూడా దీక్ష చేస్తారుట!

 

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కూడా ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. వచ్చేనెల 6వ తేదీన రాజమండ్రిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రత్యేక హోదా కోరుతూ జూన్ 3నుండి 5వ తేదీ వరకు వరుసగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

 

అయితే ఆయన కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఒక్కరే ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారోనని పార్టీలో వారే ఆశ్చర్యపోతున్నారు. ఆయన తనకు బలం ఉన్న విశాఖలో దీక్షకు కూర్చోకుండా రాజమండ్రిలో ఎందుకు దీక్ష చేయాలనుకొంటున్నారో కూడా తెలియదు. వచ్చే నెలాఖరులోగా రాష్ట్రానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తారని పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు గనుక ఆయన దృష్టిలో పడాలనే ఉద్దేశ్యంతోనే, ఇంతవరకు రాష్ట్ర సమస్యల గురించి ఎన్నడూ మాట్లాడక పోయినా సుబ్బిరామి రెడ్డి ఈ హడావుడి చేసేందుకు సిద్దమవుతున్నారేమోననే పార్టీలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశః ఆయనను చూసి పార్టీలో మిగిలిన నేతలు కూడా దీక్షలకు కూర్చొంటారేమో?