ఆసియా బ్యాడ్మింటన్ లో ఆంధ్ర కిశోరం సంచలనం
posted on Apr 19, 2013 7:29AM
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భాగంగా గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రపంచ 16వ ర్యాంక్ హైదరాబాదీ క్రీడాకారిణి పీవీ సింధు, ప్రపంచ మాజీ నెం 1, ప్రస్తుత 6వ ర్యాంక్ చైనా క్రీడాకారిణి షిజియాన్ వాంగ్ పై సంచలన విజయం సాధించింది. గంటా రెండు నిముషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో తొలి గేమ్ 15-21తో ఓడిపోయిన సింధు రెండో గేమ్ లో వాంగ్ పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించి 21-14తో కైవశం చేసుకుంది. మూడో గేమ్ లో 8-4 ఆధిక్యంలో నిలిచిన సింధు ఆ తరువాత వరుసగా పాయింట్లు కూడగట్టి 17-7 తో పై చేయి సాధించింది. ఈ దశలో పుంజుకున్న వాంగ్ చెలరేగి ఆడడంతో 20-20తో సమం చేసింది. అయినా బెదరని సింధు బలమైన స్మాష్ లతో వరుసగా రెండు పాయింట్లు సాధించి 22-20తో మ్యాచ్ ను సొంతం చేసుకుంది.