ఎంపీకి చుక్కలు చూపిస్తున్న విమానసంస్థలు.. రిలాక్స్ కోసం మూవీకి వెళ్లిన ఎంపీ..

 

శివసేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌ కు విమాన సంస్ధలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టినందుకు గాను ఆయనపై పలు విమానయాన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థ ఆయనపై నిషేదం విధించగా.. ఇప్పుడు మిగిలిన ఎయిర్ లేన్స్ సంస్థలన్నీ కూడా రద్దు పాటిస్తామంటూ ప్రకటించాయి. ఇకపై ఆయన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇకపై శివసేన ఎంపీ విమానయానం చేయడం కుదరదని వార్తలు వస్తున్నాయి.

 

కాగా బిజినెస్ క్లాస్ సీటు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టి వివాదంలో కూరుకుపోయిన సంగతి తెలసిందే. అయితే ఎంపీ గారు మాత్రం ఎక్కడా తగ్గకుండా అవును కొట్టాను.. ఒకసారి కాదు 25 సార్లు  చెప్పుతో కొట్టాన‌ు.. ఎయిర్ ఇండియా సిబ్బంది వారి ఇష్టానుసారం మాట్లాడుతుంటే..నేను మారుమాట్లాడకుండా ఉంటానని మీరు అనుకున్నారా?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అక్కడితో అగాకుండా పోలీసులకు కూడా ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేయాలని అన్నారు. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. కాసేపు రిలాక్స్ కావాలని చెబుతూ సినిమాకు వెళ్లిపోయారట. నేడు మీడియాతో మాట్లాడుతూ, తాను ఎయిర్ ఇండియా ఉద్యోగికి క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేసిన ఆయన, మనసును ఆహ్లాదంగా ఉంచుకునేందుకు తాజా చిత్రం 'బద్రీనాథ్ కీ దుల్హనియా' చూశానని, ఈ సినిమాను అందరూ చూడాలని చెప్పారు.