ఆశారామ్ బాపుపై లైంగిక దాడి కేసు

 

ఇప్పటికే చాలా మంది ఆద్యాత్మిక గురువులు త‌మ శిష్యుల‌పై లైంగిక దాడికి పాల్పడుతున్నార‌న్న వివాదాలు ఉండ‌టంతో ఇప్పుడు మ‌రో బాబాపై కూడా అలాంటి ఆరోప‌ణ‌లే మొద‌ల‌య్యాయి. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ  తనపై లైంగిక దాడిచేశారంటూ ఓ అమ్మాయి  ఢిల్లీలో కేసు పెట్టింది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ ఈ దాడి చేశారంటూ ఆ 16 ఏళ్ల బాలిక ఆరోపించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆ బాలిక వైద్య ప‌రీక్షలు చేయించి లైంగిక దాడి జ‌రిగిన‌ట్టుగా నిర్ధారించారు. ఆమె ఆరోపించిన విధంగా ఆశారామ్‌పై ప‌లు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఉదంతం రాజ‌స్ధాన్‌లో జ‌రిగినందున కేసును అక్కడి బ‌దిలీ చేయ‌నున్నారు.

అయితే ఆశారామ్ బాపు శిష్యులు మాత్రం ఈ విష‌యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, ఎవ‌రో కావాల‌నే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయిస్తున్నార‌ని ఆరోపించారు. ద‌ర్యాప్తు పూర్తి అయితే అన్ని నిజాలు తెలుస్తాయ‌న్నారు. ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్‌లోనూ భూకబ్జా కేసు నమోదైంది. వీటితో పాటు కొంత మంది భ‌క్తుల‌ను మీడియా ప్రతినిధుల‌ను అవ‌మానించిన కేసులు కూడా ఆయ‌న పై ఉన్నాయి. 2008లో ఆశారామ్ ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో ఇద్దరు విద్యార్ధులు మ‌ర‌ణించ‌టం కూడ అప్పట్లో సంచ‌ల‌న‌మ‌య్యింది.