ఏపీ లో జూన్ 11 వరకూ స్కూల్స్ బంద్ తప్పేట్లు లేదు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా రోజురోజకూ విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించడంలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెల 14 వరకు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 15 నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేసినా లేదా సడలించినా పాఠశాలలు మాత్రం వేసవి సెలవుల వరకు మూత అనివార్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్కూళ్లు తెరిస్తే విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరటం ఖాయం. ఫలితంగా సామాజిక దూరానికి విఘాతం కలుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికే ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండా ఆల్‌ పాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా వేశారు. విద్యా విషయక క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.  ఈ నెల 14 తరువాత ఈ విద్యా సంవత్సరంలో ఆదివారాలు పోనూ ఇంకా 7 పనిదినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజా పరిస్ధితుల్లో ఈ కొద్ది రోజులు స్కూళ్లు తెరిపించినా ఒనకూరే ప్రయోజనం ఏమీ లేదని భావిస్తున్నారు. ఒకేసారి వేసవి సెలవుల వరకు అంటే జూన్‌ 11వ తేదీ వరకు స్కూళ్లు మూత తప్పదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.