సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు..


ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు వేడి వేడిగా తయారవుతున్నాయి. పార్టీలన్నీ ప్రచారానికి కసరత్తులు చేస్తుండగా.. మరోవైపు కొన్ని పార్టీలు మాత్రం పొత్తు కోసం చర్చలు మొదలుపెట్టాయి. దీనిలో భాగంగానే సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రెండు రోజుల క్రితమే రాహుల్ గాంధీ, అఖిలేశ్ తో చర్చలు జరపాల్సి ఉంది. కానీ రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడంతో జరగలేదు. ఇప్పుడు తాజాగా త‌మ‌త‌మ‌ పార్టీలకు గట్టి పట్టున్న సీట్లపై పట్టువిడుపుల ధోరణి కొనసాగించాలని ఆ రెండు పార్టీలు అంగీకారానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ చ‌ర్చ‌ల‌న్నీ మధ్యవర్తుల ద్వారా, టెలిఫోన్ చర్చల ద్వారా జరిగాయని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ అంశంపై ఇంకా స‌మావేశం కాలేదు. ఈ ఇరు పార్టీలలో యూపీలోని మ‌రిన్ని చిన్న పార్టీల‌ను కూడా త‌మ కూట‌మిలో చేర్చుకోనున్న‌ట్లు స‌మాచారం.