అన్యాయంగా చంపేశారు... కోర్టులు చేయాల్సిన పని మీరెలా చేస్తారంటున్న నిందితుల తల్లిదండ్రులు

 

 

దిశ హత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు ఈ తెల్లవారు జామున 3న్నర గంటల సమయంలో...  ఎన్‍కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దేశం మొత్తం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూన్న నేపథ్యంలో ఈ ఎన్‍కౌంటర్ జరిగింది. ఐతే నిందితులు తమ దగ్గరున్న తుపాకులు లాక్కొని తమపై దాడి చెయ్యాలని యత్నిస్తూ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తాము ఎన్‌కౌంటర్ చెయ్యాల్సి వచ్చిందని పోలీసులు చెపుతున్నారు. ఐతే... నిందితుల తల్లిదండ్రులు మాత్రం పోలీసులు తమ కొడుకుల్ని కావాలనే చంపేసి, ఎన్‌కౌంటర్ జరిగిందని అబద్ధం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ కొడుకుల్ని అన్యాయంగా చంపేశారని నిందితుడు అరిఫ్ మరియు  చెన్నకేశవులు తల్లులు ఆరోపిస్తున్నారు.  అసలు కోర్టులు నిందితులకు  శిక్షలు విధించాలి కానీ  ఇలా పోలీసులే చంపేస్తే... ఇక న్యాయం ఎక్కడ జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. దిశపై జరిగిన హత్యాచారం ఘటనపై తమకు కూడా ఆవేదన ఉందనీ, అలాగే తమ పిల్లల్ని కాపాడాలని కూడా తాము కోరట్లేదనీ,  శిక్షలనేవి చట్టప్రకారం కోర్టులు విధించాలే తప్ప ఇలా ఎన్‌కౌంటర్ పేరుతో పోలీసులే చంపేయడం ఎంతవరకూ సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా వాళ్లను చంపే ఉద్దేశంతోనే తెల్లవారకముందే స్పాట్‌కి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో పోలీసులు నాటకం ఆడారని... దిశ హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి తమ కొడుకుల్ని కాల్చి చంపి... ఎన్‌కౌంటర్ డ్రామా ఆడుతున్నారని వారు  తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే  ఇలా నిందితల్ను చంపేటట్లైతే ఇక కోర్టులు, చట్టాలూ ఎందుకని నిందితుల తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పొలిసు చర్య ద్వారా తమకు న్యాయం జరగలేదనీ, తమ కొడుకుల్ని చంపేయడం ఎంతవరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.