22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..4 గురు స్మగ్లర్లు అరెస్టు
posted on Jul 10, 2025 6:50PM
.webp)
అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ అటవీప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి 22 ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఎస్ఐ ఎం. మురళీధరరెడ్డి టీమ్ బుధవారం రాత్రి నుంచి సానిపాయ పరిధిలోని వీరబల్లి మీదుగా గడికోట వైపు కూంబింగ్ చేపట్టారు.
గురువారం తెల్లవారుజామున నాయనూరు ప్రాంతం చేరుకోగా అక్కడ మూడు మోటారు సైకిళ్లు కనిపించాయి. సమీపంలో కొందరు వ్యక్తులు గుమికూడి కనిపించారు. వారిని చుట్టు ముట్టే క్రమంలో వారు పారిపోదానికి ప్రయత్నించారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. అక్కడ పరిశీలించగా 22ఎర్రచందనం దుంగలు కనిపించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లా వాసులుగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించగా, డీఎస్పీ శ్రీనివాస రెడ్డి విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.