పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద మళ్లీ అదే ఘటన

పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద జరిగిన కారు ప్రమాద ఘటనను తెలుగు రాష్ట్రాల ప్రజలు మరచిపోగలరా..? మద్యం మత్తులో కారు నడిపి ఒక కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా..మిగిలిన ఇద్దరు మంచానికే పరిమితమయ్యారు. ఇది ఇంకా కళ్ల ముందే మెదులుతుండగా..అదే ఫ్లైఓవర్ వద్ద అచ్చం అలాంటి ఘటనే జరిగింది.

 

ఫుల్‌గా మద్యం సేవించిన కొందరు యువకులు మద్యం మత్తులో కారును నడపడంతో పంజాగుట్ట ఫ్లైఓవర్ దాటిన తరువాత డివైడర్‌ను ఢీకొట్టి కొద్ది దూరం వరకూ అలాగే రోడ్డుపైనే దూసుకెళ్లింది. అర్థరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరగడం, ఆ సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భయపడిన మందుబాబులు కారును నడిరోడ్డుపైనే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.