ఏపీలో మెట్రో, పెట్రో పర్యటనలు...
posted on Sep 20, 2014 1:28PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం నాడు మెట్రో, పెట్రో పర్యటనలు జరిగాయి. విజయవాడలో మెట్రోరైలు ఏర్పాటుకు సంబంధించి మెట్రో నిపుణుడు శ్రీధరన్ విజయవాడ పరిసరాల్లో పర్యటన జరిపారు. ఆయన మెట్రో నిపుణుల బృందంతో కలసి విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మెట్రో రైలు ఏర్పాటుకు గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలు, మెట్రో రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మిస్తే మంచిదన్న అంశం మీద ఆయన పరిశీలన జరిపారు. అలాగే రాజమండ్రిలో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర బృందం రాజమండ్రిలో పర్యటించింది. పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కోసం అనువుగా వుండే స్థలం కోసం ఈ బృందం అన్వేషణ జరిపింది. ప్రస్తుతం తాత్కాలికంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి అవసరమైన భవంతులను కూడా పరిశీలించింది. వచ్చే ఏడాది నాటికి సొంత భవనాలలో పెట్రో యూనివర్సిటీ కార్యకలాపాలు జరిగే అవకాశం వుందని బృంద సభ్యులు చెబుతున్నారు.