చక్రి తల్లి, అక్కా చెల్లెళ్ళు వేధిస్తున్నారు.. శ్రావణి

 

గుండెపోటుతో మరణించిన ప్రముఖ సంగీత దర్శకుడు తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు తనను ఆస్తికోసం వేధిస్తున్నారని చక్రి భార్య శ్రావణి మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్రావణి మానవ హక్కుల కమిషన్‌కి రాసిన లేఖలో అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. ‘‘చక్రిని నువ్వే చంపేశావంటూ అందరూ నన్ను వేధిస్తున్నారు. చక్రి, నేను పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. మా పెళ్ళి ఇష్టం లేకపోవడంతో ఆయన తరఫు బంధువులంతా దూరమైపోయారు. ఈమధ్యే మళ్ళీ దగ్గరవుతున్నారు. చక్రి చనిపోయిన తర్వాత చక్రి చనిపోయాడన్న బాధ కంటే చక్రి ఆస్తి మీద ఆసక్తి వారిలో ఎక్కువగా కనిపించింది. నేను బాధతో రోదిస్తుంటే చక్రి తరఫు బంధువులెవరూ నన్ను ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం మంచినీళ్ళు అయినా తాగానా లేదా అని కూడా పట్టించుకోలేదు. ఆయన కర్మకాండలు పూర్తి కాకముందే ఆస్తికోసం వీళ్ళ వేధింపులు ఎక్కువయ్యాయి’’ అని పేర్కొన్నారు.