పోలీసులు చూస్తుండగానే హత్య...
posted on Sep 26, 2018 2:22PM
పరువు హత్యలు,ప్రతీకార హత్యలతో ఎక్కడ చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.పగలు,రేయి తేడాలేకుండా ప్రజలు సంచరిస్తూన్నారనే భయంలేకుండా తెగించి హత్యలకు పాల్పడుతున్నారు.తాజాగా హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్లో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా నరికి చంపారు.సిద్ధిఅంబర్ బజార్కు చెందిన రమేశ్ (35) అనే వ్యక్తి ఓ హత్య కేసులో ఉప్పరపల్లి కోర్టుకు బుధవారం హాజరయ్యాడు. అతను తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారు.తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కక్షతో రమేశ్ ఆరు నెలల క్రితం మహేశ్ అనే యువకుడిని శంషాబాద్లో హత్య చేశాడు. ఆ కేసులో అరెస్టయి అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు.
ఈ కేసు విచారణలో భాగంగానే రమేశ్ ఈరోజు ఉప్పర్పల్లి న్యాయస్థానంలో హాజరయ్యాడు.అతను తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తున్న సమయంలో అత్తాపూర్ 143 పిల్లర్ వద్ద దాదాపు 100 మీటర్ల దూరం వరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్య చేసారు మహేశ్ తండ్రి, బంధువు.ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా.. పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం. తనను రక్షించాలంటూ ఆ యువకుడు ఆర్తనాదాలు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు.అతను చనిపోయేంత వరకూ గొడ్డలితో దాడి చేస్తూనే ఉన్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.