సీబీఐ న్యాయవాదికి జ్వరమొచ్చింది! జగన్ పై ప్రధానికి రఘురామ లేఖ..
posted on Jul 26, 2021 4:27PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడానికి మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనారోగ్య కారణంగా కౌంటర్ ధాఖలు చేయలేక పోయామని తెలిపారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి జూలై14న జరిగిన విచారణ సమయంలోనే సీబీఐ తీరుపై పిటిషనర్ తరపు లాయర్ అభ్యంతరం తెలిపారు. కౌంటర్ దాఖలుకు మళ్లీ మళ్లీ సమయం కోరడం సరికాదని వాదించారు. అయినా మరోసారి సీబీఐ వాయిదా కోరడంపై విమర్శలు వస్తున్నాయి. అది కూడా లాయర్ కు జ్వరం వచ్చిందంటూ వాయిదా కోరడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీబీఐ లాయర్ కు సడెన్ గా ఎందుకు జ్వరం వచ్చిందన్న చర్చ జనాల్లో సాగుతోంది.
ఎంపీ రఘురామ కృష్ణం రాజు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏ1, ఏ2లపై చర్యలు తీసుకోవాలని అందులో ఆయన కోరారు. జగన్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తనపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారని, ఇప్పుడు తాను కూడా వారిద్దరిపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. జగన్, విజయసాయిల అక్రమ ఆర్థిక వ్యవహారాలు, సూట్ కేసు కంపెనీలపై ఆ లేఖలో వివరించినట్టు తెలిపారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. సీబీఐ కేసు వాయిదా పడటంపైనా రఘురామ స్పందించారు. జగన్ బెయిల్ రద్దు కేసు పలు కారణాలతో మళ్ళీ వాయిదా పడిందన్నారు. ఒకేసారి సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు జ్వరం రావడంపై...తనకు అనుమానాలు లేవన్నారు. అయినా ఒకేసారి జ్వరం ఎలా వచ్చిందని రఘురామ ప్రశ్నించారు.
ట్విటర్లో విజయసాయిరెడ్డి అవాస్తవాలు ప్రచారం చేశారని రఘురామ ఆరోపించారు. ఆయన పేర్కొన్న అంశాలను లేఖలో ప్రధానికి వివరించానన్నారు. ఏ-2 పెట్టిన సూట్కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరుపుతున్నారని ఆరోపించారు. క్విడ్ప్రోకో, సూట్కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. తాను విదేశాలకు వెళ్లకుండా పాస్ట్పోర్టు రద్దు చేయాలని అడుగుతున్నారని, మరి 20కి పైగా కేసులున్న విజయసాయిరెడ్డి పాస్పోర్టును ఏం చేయాలని రఘురామ ప్రశ్నించారు. ఏపీ అంశాలపై అందరం కలిసి రాజీనామా చేద్దామని, అందుకు సిద్ధమా? అని రఘురామ సవాల్ చేశారు.