వైసీపీ నేత పోసానికి బిగ్ షాక్..  టిడిపి తీర్థం పుచ్చుకున్న సోదరుడి కుమారుడు 

వైసీపీ నేతలు ఒక్కొక్కరూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే దిశగా అడుగులేస్తున్నారు. తెలుగు దేశం పార్టీపై ఒంటి కాలిపై లేచే పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల వేళ ఏపీలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు యోగేంద్రనాథ్ పోసాని టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీకి ఓటు వేసి మరోమారు అధికారంలో తీసుకురావాలని ఇప్పటికే పోసాని కృష్ణమురళి ఎన్నికల ప్రచార సభలో పిలుపునిస్తుంటే స్వయాన సోదరుడి కుమారుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని యోగేంద్రనాథ్ ప్రశంసించారు. ఆయన ముందుచూపు ఏపీ అభివృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే తాను టీడీపీలో చేరినట్టు తెలిపారు. టీడీపీలో చేరిక తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. యూకేలో వ్యాపారవేత్తగా ఉన్న యోగేంద్రనాథ్ హైదరాబాద్‌లోనూ తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు. వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి టీడీపీపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడి కుమారుడు టీడీపీవైపు మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది.