శంపాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరుత సంచారం 

అడవిలో ఉండాల్సిన క్రూరమైన జంతువుల్లో జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇలా వచ్చిన ప్రతిసారి స్థానికులు భయాందోళన చెందుతారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ విమానశ్రయంలో చిరుత పులి సంచరిస్తూ కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు మరో రెండు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు.
 విమానశ్రయం ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్‌ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగింది. అనంతరం భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. ట్రాప్‌ కెమెరా, బోన్లు ఏర్పాటు చేశారు. స్థానికులు చిరుత సంచార విషయాన్ని తెలుసుకుని భయభ్రాంతులు చెందుతున్నారు.
 దాదాపు మూడేళ్ల క్రితం శంషాబాద్‌ ఎయిర్ పోర్టు గోడ దూకి చిరుత వెళ్లిన ఘటన జరిగింది. ఆ సమయంలో సీసీటీవీ కెమెరాల్లో సంచరిస్తున్నట్లు రికార్డయింది. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. దానిని పట్టుకోడానికి అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి ప్రయత్నించారు.రెండు గంటల పాటు అధికారులు చిరుత కోసం గాలించారు. అనంతరం అది చిరుత కాదని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. చివరికి సీసీ కెమెరాల్లో చిక్కింది చిరుత పులి కాదు అడవి పిల్లి అని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం కూడా చిరుతపులి వ్యవహారం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. మొద‌ట దానిని అడవి పిల్లిగా భావించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించిన అనంత‌రం దాన్ని చిరుత‌గా నిర్ధారించారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు, అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆర్‌జీఐఏ పోలీసులు సూచించారు. చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు. 
మూడేళ్లక్రితం హైదరాబాద్ శివారులోని ప్రజలను చిరుతపులి భయాందోళనకు గురిచేసింది.  జీహెచ్ఎంసీ, పోలీసులతో సమన్వయం చేసుకొని అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి పట్టుకున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరుత సంచారం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయినప్పటికీ బోనులో చిక్కకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.